Tuesday, March 29, 2011

భూదేవి కొక్క గంట...

          వేల దేశాలలో, లక్షల కొలదిగా ఉన్న ఊర్లలో కోట్లాదిమంది ప్రజలని, వారి భారాన్నీ మోస్తున్న భూదేవి కి ఏడాదికి ఒక్క గంట మనవంతు కృతజ్ఞత ప్రకటించడం, ధన్యవాదాలు చెప్పడమే ఈ ఎర్త్ అవర్ అని నా అభిప్రాయం. అది  అమలుపరచడం అంత కష్టమా? కానిపనా? ఏమో మరి.
       మా అపార్ట్మెంట్  లో ఉన్న 144 ఇళ్ళల్లో ఉన్న కొంతమంది ఉత్సాహవంతులం ఈ భూమి గంటను  మనందరం తప్పకుండా పాటించాలి అని నిశ్చయిన్చేసుకున్నం . అంతే కాదు,  మంచి మాట అందరికీ చెప్తే మంచిది కదా అని ఒకరంటే సరే అంటే సరే అనుకున్నాం. ఉన్న ఎనిమిది అంతస్తులనీ మాలో మేము సమానంగా పంచుకుని అందరికీ వీలయితే పర్సనల్ గా లేకపోతె ఇంటర్ కాం ద్వారానూ చెప్పి, దీనికి మనవంతు సహాయం చెయ్యాలని మా సంకల్పం. మాలో ఒకరు తయారు చేసి తెచ్చిన నోటీసులు అన్ని లిఫ్టు లలోనూ, నోటీసు బోర్డు లలోనూ  పెట్టాము. ( ఒక వైపు రాసిన కాగితాలే వాడాము సుమండీ). అపార్ట్మెంట్ యాహూ గ్రూప్ లో మెసేజ్ లు పంపించాం. ఇంక మిగిలింది వీలైనంత మందికి చెప్పడం.

         మొదట నేను ఫోన్ చేసిన ఒక ఫ్లాట్ ఆతను.. 'తప్పకుండా చేద్దాం అండీ, మనం ఇలాంటివన్నీ చాలా శ్రద్దగా పాటించాలి. గుర్తు చేసినందుకు మీకు థాంక్ యూ.. అన్నారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. మన ప్రయత్నాన్ని మెచ్చుకోవడమే కాదు, వారు అందులో పాలు పంచుకుంటాము అన్నందుకు.
       తరవాత ఇంకొకాయన 'మనందరం ఒక గంట ఆపేస్తే ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి పెరిగిపోతుందా?' అని వ్యంగ్యంగా అడిగారు. దానికి నాకు కొంత కోపం వచ్చిన మాట నిజం.. పెరగక పోయినా కనీసం మిగులుతుంది కదా అని ఫోన్ పెట్టేసాను.
         మరికొందరు మెచ్చుకున్నారు. కొందరేమో.. "మేడం మాకూ తెలుసు దీని గురించి.. మేమూ బాధ్యతా గల పౌరులమే.. మీరు  పని కట్టుకుని గుర్తుచేసెంత శ్రమ తీసుకోక్కరలేదు" అన్నారు. నాకు ఏమనాలో తెలియలేదు. "ఇలా మేమందరం ఒక గ్రూప్, ఈ మెసేజ్ అందరికీ చెప్పాలని మా ప్రయత్నం. మీరు మాలాగే ఆలోచిస్తున్నందుకు సంతోషం" అని చెప్పాను.
            మా గ్రూప్ లో మిగతావారికి కూడా ఇలాంటి అనేక రకాలైన అనుభవాలు ఎదురయ్యాయి. "గవర్నమెంట్ ఎలాగూ పవర్ కట్ విధిస్తోంది, అప్పుడు ఎన్నో గంటలు ఇస్తున్నాం, ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇవ్వక్కర్లేదు" అని కొందరంటే, "నాలుగేళ్ళకొకసారి వస్తుంది, క్రికెట్ మాచ్ చూడక్కరలేదా?" అని కొందరు అన్నారుట. ఇలా ఒక అరగంట ప్రయతించి వీలున్నంత వరకూ చెప్పాం. తరవాత ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళది అని వదిలేసాం. మొత్తానికి 75 % ఇళ్ళల్లో పాటించారని తృప్తి పడ్డాం.
        ఏ విషయం మీదైనా భిన్నాభిప్రాయాలు ఉండడం సహజం. ఉండాలి కూడా. కానీ ఇలాంటి వాటిల్లో కాదేమో. ప్రపంచమంతా కేవలం సంవత్సరానికి ఒక్క గంట కరంట్ వినియోగం మానేస్తే ( కనీసం వీలైనంత వరకూ తగ్గిస్తే) జరిగే మేలు మనందరికీ తెలుసు. అలాంటప్పుడు అది పాటిస్తే మనకి వచ్చే పెద్ద నష్టం ఏమంటుంది?
         ఇది మనకి ప్రత్యక్షం గా ఇప్పటికిప్పుడు కనిపించే మేలు కాకపోవచ్చు. కానీ దీర్ఘకాలంలో ఇలాంటి వెన్నో మనం క్రమం తప్పకుండాపాటించ డాన్ని  బట్టే మన మనుగడా, జీవిత విధానం ఆధారపడి ఉంటుంది అనేది కాదనలేని సత్యం. మన చేతిలో డబ్బు ఉండవచ్చు, కానీ కొనడానికి వనరులు లేకపోతే ఏం లాభం? వనరులు ఉన్నప్పుడు వివేకంగా వాడుకోకపోతే తరవాత ఎవరిని ఏమీ అనలేము. అది కోట్లకి పడగలెత్తి నెలకి లక్షల రూపాయల విధ్యుత్ కాల్చే కోటీశ్వరులైనా, కామన్ మాన్ అయినా సరే.. ఇది అందరూ పాటించవలసిన సూత్రం. నడుచుకోవలసిన మార్గం. లేకపోతే మన తరవాత తరం వారు కార్ల బదులు ఎడ్ల బళ్ళూ, జటకాలూ కొనుక్కోవాలి. తప్పదు.
          

No comments:

Post a Comment

నగుమోము గనలేని నాజాలి తెలిసి నన్ను బ్రోవగ రాదా శ్రీరఘువర నీ...