Thursday, August 19, 2010

తర్వాత ఎవరు???



ఆగస్ట్ నాలుగో తేదీన ' టాటా సన్స్" వారు చేసిన ప్రకటన తర్వాత నాతో పాటు అనేకమంది కి తోచిన మొదటి ప్రశ్న ఇది. ఎప్పుడో నూట నలభై రెండేళ్ళక్రిందట ఒక చిన్న మొక్కగా మొదలయి నేడు ఒక మహా సంస్థ గా విస్తరించి ఉప్పు మొదలు కార్లవరకూ అదీ ఇదీ అని లేకుండా అన్నింటినీ ఒకే రకమైన అంకితభావంతో, అత్యంత ప్రతిష్టాత్మకంగా తయారు చేస్తూ మన దేశానికే మకుటాయమానంగా నిలిచిన సంస్థకి తర్వాత అధినేత ఎవరు? 2012 లో తన 75 ఏళ్ళ వయసులో పదవీ విరమణ చేయడానికి నిర్ణయించిన ఆ మహానాయకుడి ని ఎవరు అనుసరించగలరు? ( అధిగమించడమనే సమస్య ఇంకా రానే లేదు) జే.ఆర్.డీ టాటా నించి 1991 లో పగ్గాలు చేపట్టిన నాటినించీ ఇప్పటివరకూ ఎన్నో విజయాలని తన ఖాతాలో వేసుకుని తిరుగులేని నాయకుడిగా నిలిచిన రతన్ నవల్ టాటా కి నిజమైన వారసుడు ఎవరు అనేవి ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్నలు. బోర్డ్ నాయకుడిగా ఎవరిని ఎంపిక చేస్తుంది? దగ్గరబంధువులనా? లేక పార్శీ పరివారాలలోంచి ఒకరిని ఎంపిక చేస్తుందా? ఆ అవకాశం అసలు భారతీయుడిని వరిస్తుందా? లేక విదేశీయులని కూడా పరిగణిస్తారా? ( పరిగణిస్తామని అన్నారు కదా)



శ్రీ రతన్ టాటా ఇప్పటి వరకూ సాగించిన యాత్రలో విజయాలే అత్యధికం. దాదాపు 300 చిన్న చిన్న కంపెనీలుగా ఉన్నా టా టా సామ్రాజ్యాన్ని ఒక పద్దతిగా, ప్రణాళికా బద్ధంగా నిర్మించుకుంటూ, నిర్ణాయాత్మకమైన మార్పులు చేసుకుంటూ వచ్చారు. ఈ రోజు టాటా సామ్రాజ్యంలో 98 సంస్థలు ఉన్నాయి, వీటిలో భారత దేశంలో సాఫ్ట్ వేర్ రంగంలో మొదటిదైన సంస్థా, కార్లలో రెందో స్థానంలో ఉన్న సంస్థా కూడా ఉన్నాయి. రతన్ టాటా ఏది చేసినా సఫలమే , టా టా వారు ఏది చేసిన సంచలనమే అన్న స్థాయికి సంస్థని తీసుకు వచ్చారు. సామాన్యుడికి కూడా అందుబాటులో ఉన్న నానో కారు రూపొందించడమన్న తన కలని నిజం చేసుకున్నా, అధికంగా విదేశీ కంపెనీలని కొనుగోలు చేసినా ( టెట్ లీ టీ, కోరస్ స్టీల్, జాగ్వార్ లాండ్ రోవర్ వగైరాలు) అది ఆయనకున్న సమర్ధతా, నియమబధ్ధత వల్లనే. ఆయన చేసిన విదేశీ కొనుగోళ్ళు తొలుత ఒకింత మిశ్రమ స్పందనకు గురి అయినా తరవాత లాభాలనే ఆర్జించి పెట్టాయి అన్నది నిజం. ఆయన కున్న ప్రణాళికా బద్ధత, దూర దృష్టి చాలా స్పష్టమైనవి. ఆయన తరవాత అధిపతిగా వచ్చేవారు ఇవన్నీ అంతే చాకచక్యంగా నిర్వహించేవారు అయి ఉండాలి అన్నది నిర్వివాదాంశం.

ఈ విషయం మీద 'ద ఎకానమిస్ట్' పత్రికలో (ఆగస్ట్ 14-20, 2010) లో ఒక వ్యాసం చదివాను. వ్యాసకర్త ఇలా అంటారు.. రతన్ టాటా కి వారసుడిగా వచ్చే వ్యక్తి కొత్త సంస్థలని కొనుగోలు చేసేకంటే ముందు ప్రస్తుతం ఉన్న సంస్థలన్నీ సజావుగా, మెరుగ్గా పనిచేసేటట్టుగా చూడాలి. ఎందుకంటే ప్రజల దృష్టిలో టాటా వారికున్న మంచిపేరుని కొనసాగించడమూ, వీలున్నప్పుడల్లా పెంపొందించడం చాలా ముఖ్యమైన బాధ్యతలు. అంతే కాక టాటా వారు కొనసాగిస్తున్న పలు సామాజిక సహాయ కార్యక్రమాలు అన్నీ సజావుగా కొనసాగేలా చూడాలి. ఇలా అధికారికంగా ప్రకటన చేసి తర్వాత అధినేతని వెతకడం ఒక చక్కని ప్రయత్నంగా అభివర్ణించారు, ఎందుకంటే భారత దేశంలో ఒక అధినేత ఎలా ఎన్నుకోబడతాడన్నది ఎప్పుడూ వెల్లడి కాని రహస్యంగా ఉండిపోతుంది కనక అంటారు. ఇంటర్నేషనల్ బిజినెస్స్ స్కూల్ కి చెందిన కవిల్ రామచంద్రన్ గారు టాటా వారి ఈ పద్ధతిని ఒక సమున్నతమైన సాంప్రదాయంగా కొనియాడాతూ ఇదే పద్దతిని సౌత్ ఈస్ట్ ఆసియా లోని మిగతా దేశాలుకూడా అవలంబిస్తే బావుంటుంది అని అన్నారు. అయితే ఆ వ్యక్తి ఎవరు అవుతారు? అనేది చాల ఉత్సుకభరితంగా మారింది. అంత గొప్ప నాయకుడినీ, " జెంటిల్మాన్ ఎక్స్ట్రా ఆర్డినైర్ " గా ప్రసిద్దుడైన వ్యక్తికి వారసుడవడం అంత సులభం కాదు కదా. అదన్నమాట విషయం.
చివరగా ఒక విషయం చెప్పి ముగిస్తాను. సూపర్ స్టార్ రజనీకాంత్ గారి సినిమా శివాజి లో ఒక డైలాగ్ ఉంది. " ఆరు తర్వాత ఏడురా, శివాజీ తర్వాత ఎవడురా? అని. ఈ అనువాద సంభాషణ విన్న వెంటనే చాలా విచిత్రంగా అనిపించినా ఆలోచిస్తే నిజమే కదా అనిపించింది.. ఆరుతర్వాత ఏడు వచ్చినంత సులువు కాదు కదా ఒక గొప్ప నాయకుడి తర్వాత మరొకరు రావడమన్నది.. ఇక్కడ సినిమాలో శివాజీ పాత్రనుద్దేశించి రాసినా, రతన్ జీ వంటి మహానాయకుడి వారసుడిగా పీఠమెక్కడం నిజంగానే చాలా గొప్ప బాధ్యత.. రాగల కాలమే కాగల నాయకుడిని నిర్ణయించాలి.. అంతవరకు.. జయ హో రతన్ జీ..

Wednesday, August 18, 2010

తోడుగా నడిచే తోబుట్టువులు.

ఒక అమ్మ పిల్లలందరూ ఒకేలా ఉండరు.. ఎంత అక్కాచెళ్ళెళ్ళయినా, అన్నదమ్ములైనా ఒక్కలా ఉంటారా, ఒక్కటే చేస్తారా? ఇలాంటి మాటలూ, ప్రశ్నలూ మనం తరుచూ వింటూనే ఉంటాము. ఒక చేతివేళ్ళూ ఒక్కలా ఉండవు, ఒక్క తల్లి పిల్లలూ ఒక్కలా ఉండరూ అని కూడా అంటారు. అన్నదమ్ములూ, అక్కచెళ్ళెల్లూ ఒకేలా ఉన్నా లేకపోయినా ఒకే రంగంలో కలిసి రాణించిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. పైన చెప్పిన ప్రశ్నలని గురించి ఆలోచిస్తుంటే ఈ ఆలోచన వచ్చి అలాంటివారిలో కొందరిగురించి రాయాలని అనిపించింది. ఇది చదివి మీరు కూడా కొన్ని ఉదాహరణలు చెప్తే బావుంటుంది. ముందుగా సంగీతరంగాన్ని ప్రస్తావిస్తాను. తొలుతగా కర్నాటక సంగీతరంగం.

1. హైదరాబాద్ బ్రదర్స్ : కర్నాటక సంగీత రంగంలో ప్రముఖ స్థానాన్ని అలంకరించిన హైదరాబాద్ బ్రదర్స్ గా ప్రసిద్ధులైన డి. శేషాచారి, డి. రాఘవాచారి గార్లు దేశ విదేశాలలో అనేక కచేరీలు చేసిన విద్వాంసులు. ఏన్నో అవార్డులనీ, రివార్డులనీ అందుకున్నారు. తొలుత వారి తండ్రిగారైన లేటు సంగీత విద్వాన్ శ్రీ. రామానుజాచార్యుల వారివద్దా, తల్లిగారైనా శ్రీమతి సులోచనాదేవి గారి వద్దా శిక్షణ ప్రారంభించి తరవాత వారు తమదైన ప్రత్యేక శైలిని అవలంబించి ఎంతో ప్రాచుర్యాన్ని పొందారు.

2. హైదరాబాద్ సిస్టర్స్: హైదరాబాద్ సిస్టర్స్ గా ప్రసిద్ధులైన శ్రీమతి లలిత, శ్రీమతి హరిప్రియ కూడా ఎంతో పేరు గలిగిన సంగీత కళాకారిణులు. వీరు లేటు శ్రీ టీ. పద్మనాభన్ గారి దగ్గర శిక్షణ పొందారు, దేశంలో అన్ని ప్రముఖ సభలలోనూ, విదేశాలలోనూ కూడా ఎన్నో కచేరీలు నిర్వహించారు. మన తెలుగు తేజం శ్రీ రామ చంద్ర వీరిలో హరిప్రియగారి శిష్యుడు కూడా.


హైదరాబాద్ సిస్టర్స్



3. బాంబే సిస్టర్స్: శ్రీమతి శీ. సరోజ, శ్రీమతి శీ. లలిత గార్లు కూడా చాలా ప్రముఖులైన సంగీత విద్వాంసులు. వీరు హెచ్. ఏ. ఎస్ మణీ, ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్ మొదలైన వారి వద్ద విద్యనభ్యసించారు. అనేక కచేరీలు చేసారు.

బాంబే సిస్టర్స్


4. శూలమంగళం సిస్టర్స్: శూలమంగలం జయలక్ష్మి, రాజ్యలక్ష్మి గార్లు శూలమంగలం సిస్టర్స్ గా, యుగళ గానానికి ( ఇద్దరు చేసే కచేరీలకి) ఆద్యులుగా చెప్పబడతారు. వీరిద్దరి బాటలోనే ఆ తరవాత రాధా-జయలక్ష్మి ( కజిన్స్), బాంబే సిస్టర్స్ మొదలైన వారు పయనించారు అని చెప్పుకోవచ్చు.

శూలమంగళం సిస్టర్స్


రాధా-జయలక్ష్మి


5. రంజని- గాయత్రి: ఈ ఇద్దరు సోదరీమణులు వోకల్ మరియూ వయొలీన్ వాదనలోనూ సుప్రసిద్దులు. టీనేజ్ నుంచే వీరిద్దరూ వయొలీన్ ప్రదర్శనలు ఇచ్చేవారు. అంతేకాక ఎంతో మంది ప్రముఖులకి పక్కవాయిద్యంగా కూడా వయోలీన్ సహకారం అందించారు. ఆ తర్వాత వోకల్ కచేరీలు కూడా ప్రారంభించి అందులో కూడా ప్రాచుర్యాన్ని పొందారు.

రంజని- గాయత్రి


6. ప్రియా సిస్టర్స్: ఫ్రియా సిస్టర్స్ గా సుపరిచుతులైన హరిప్రియ, షణ్ముఖప్రియ కూడా ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసులు. రాధా-జయలక్ష్మి గార్ల శిష్యులైన వీరిద్దరూ కూడా చిన్ననాటినించే ప్రతిభ కనపర్చిన వారు. వీరు ఇప్పుడు టీ. ఆర్ సుబ్రమనియం గారి శిష్యులు. ప్రియా సిస్టర్స్ కూడా ఎన్నో కచేరీలు చేసి ప్రశంసలూ, పురస్కారాలూ పొందారు.

ప్రియా సిస్టర్స్



7.మల్లాది బ్రదర్స్: మల్లాది శ్రీరాంకుమార్, మల్లాది రవికుమార్ మల్లాది బ్రదర్స్ గా ప్రసిద్దులు. మొదట వారి తాతగారూ, తండ్రిగార్ల దగ్గర శిక్షణ ప్రారంభించిన వీరు తర్వాత నేదునూరి కృష్ణమూర్తి గారు, వోలేటి వెంకటేశ్వర్లు గారు, శ్రీపాద పినాకపాణి గారు వంటి మహానుభావుల వద్ద విద్యాభ్యాసం చేసి త్యాగరాజ కృతుల ఆలాపనలో ప్రముఖులుగా నిలిచారు. ఎన్నో కచేరీలు చేసారు.


మల్లాది బ్రదర్స్



8. మైసూర్ బ్రదర్స్: సుప్రసిద్ధ వయొలీన్ విద్వాసుంలైన శ్రీ. మంజునాధ్, శ్రీ. నాగరాజ్ అత్యంత పేరు ప్రఖ్యతులు కలిగిన వయొలీన్ విద్వాసులు. వీరి ప్రతిభగురించి కానీ, వారి ప్రత్యేకతలని గురించి కానీ ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచవ్యాప్తంగా ఎంతో కీర్తినార్జించిన ప్రముఖులు వీరు. కలిసి ప్రదర్శనలిస్తూనే, ప్రముఖులకి పక్కవాయిద్య సహకారాన్ని కూడా అందిస్తారు.

మైసూర్ బ్రదర్స్



9.మాండలీన్ సిస్టర్స్: మాండలీన్ మీద సురాగాలు పలికించే ఈ ఇద్దరు చిన్నారులు శ్రీఉష, శిరిష అనతికాలంలోనే ఎంతో పేరు తెచ్చుకున్నారు.


మాండలీన్ సిస్టర్స్


10.రుద్రపట్నం బ్రదర్స్: రుద్రపట్నం బ్రదర్స్ గా ప్రముఖులైనా ఆర్.ఎన్. త్యాగరాజన్, ఆర్. ఎన్ తారానాథన్ గార్లకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. వీరు ప్రముఖు విద్వాసులవద్ద సంగీతాన్ని నేర్చుకున్నారు. వారిలో ప్రముఖ వయోలీన్ విద్వాసుంలు శ్రీ. టీ. చౌడయ్య గారు కూడా ఉన్నారు. మూడు తరాల సంగీత సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న ప్రముఖులు వీరిద్దరూ.

రుద్రపట్నం బ్రదర్స్


వీరు మచ్చుకి కొందరు మాత్రమే. ఇంకా ఎందరో ఇలాంటి వారు ఉన్నారు. ప్రతిభావంతులైన బిడ్డల వల్ల తల్లి తండ్రులకి కలిగే ఆనందమూ, గౌరవమూ ఎంత ఆహ్లదాన్ని కలిగిస్తాయో మనందరికీ తెలుసు. అది ఒకటికి రెండితంలైతే.. ఆ భావాన్ని చెప్పడానికి మాటలుండవేమో.. వీరి తల్లితండ్రులు నిజంగా ధన్యులు..


వీరిలో కొందరిని ప్రత్యక్షంగా చూసే అవకాశమూ, వారి అమృతగానాన్నీ, వాయిద్య విన్యాసాలనీ వినగలిగే అదృష్టం మాకు దొరకడం నిజంగా గొప్ప వరం.


ఇతరరంగాలలోని ప్రముఖ అక్కచెళ్ళెళ్ళూ, అన్నదమ్ముల గురించి మరొక టపాలో. ఇక్కడ నేను ప్రస్తావించని కళాకారులగురించి తప్పకుండా చెప్పండి.

నగుమోము గనలేని నాజాలి తెలిసి నన్ను బ్రోవగ రాదా శ్రీరఘువర నీ...