Wednesday, December 22, 2010

ప్రమదావనంలో పండగ- వెలుగు రవ్వల పండగ..

జ్యోతిగారు.. అదే మన వలబోజు జ్యోతిగారి పుట్టిన రోజట.. ఈ రోజు.
ఏమిటావిడ గొప్పట ?అసలు ఆవిడకేమి వచ్చట? ఏమి తెలుసట? 

పిల్లలు పెద్దవాళ్ళయి పోయారు .. వాళ్లకి పెళ్ళిళ్ళూ, పేరంటాలు చేసేసి
హాయిగా దీవాన్ మీదో, సోఫాలోనో కాళ్ళు చాపుకుని కూర్చుని
టీలు తాగేస్తూ, టీ.వీ చూసేస్తూ   సీరియస్ గా సీరియల్స్
నడిపించేస్తూ   కాలం గడిపేద్దాం అనుకోవడం  తెలుసా?

ఊహూ. బ్లాగ్ లూ , జాబులూ, స్లిప్పులూ  అంటూ
కంప్యూటర్ కలం  ( మౌస్ ) చేత పట్టి
అంతర్జాలపు తెలుగు సాహితీ క్షేత్రంలో
అద్భుతంగా  హలం దున్నటం మాత్రం తెలుసు..

పోనీ ఏదో రాస్తున్నాం కదా! అని సరదాగా చదువుకునేవి
రాసి ఊరుకోవడం తెలుసా ?
సరే.. శారీలూ, ఫాషన్లూ అవీ రాస్తే తోటి వారు సంతోషిస్తారు
అనుకోవడం తెలుసా?
ఊరికే ఊసుపోని కబుర్లు రాసేసి చేతులు దులుపుకోవడమైనా తెలుసా?

ఊహూ. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరడజను పైన బ్లాగ్లు
ఒక్క చేత్తో నడిపేయడం, ఎన్నో విషయాలు వాటిలో చర్చించడం
అబ్బా ఇంత పెద్ద పనిని  ఇంత  వీజీగా ఎలా చేస్తారబ్బా?
అనిపించేయడం మాత్రం తెలుసు.

పెళ్లి అయినప్పటి నుంచో, ఇంకా మాట్టాడితే అంతకు ముందు నుంచో
ఈ మాత్రం వంట వండుతూనే ఉన్నాం కదా.. రోజూ ఉండే పప్పూ, కూరే కదా
ఇందులో గొప్పేముంది  అని అనుకోవడం తెలుసా?
చీకు చింతా లేకుండా చికెనూ, మహా పసందుగా మటనూ
వండేసుకుని తినేద్దాం అని ఊరుకోవడం తెలుసా?

ఊహూ.. ఓట్లతో పాయసం అంటూ ఓటేయించుకుని, పలు రుచుల పొట్లాలు కట్టేసి,
రకరకాల  వంటలు చక చకా వండేసి.. చవులూరేలా ఫోటోలు తీసి
షడ్రుచులంటూ మన నోరు ఊరించడం, అది చాలనట్టు 
అవి టీ. వీ ల లో చూపించడమూ .. మాత్రం బాగా తెలుసు

కంప్యూటర్ అంటే కళ్ళ ముందుంటుంది .. 
కాలు కదపకుండా కలం కదిపేసి కాలం గడిపేయచ్చు
ఇంతకంటే ఇంకేం కావాలి? అని తృప్తి పడడటం తెలుసా?
ఊరికే. ఊరంతా తిరిగి హైరానా పడటం ఎందుకు?
పత్రికలకీ, టీ. వీ చానెల్స్ కి తిరగడమెందుకు? అనుకోవడమైనా తెలుసా?

ఊహూ.. ఈనాడు, ఆంధ్రభూమి, చిత్ర, సాక్షి ఇలా ఒకటి అని లేకుండా
రకరకాల పత్రికలలోనూ  పలురకాల ఆసక్తికరమైన కధనాలూ,
వ్యాసాలూ బ్రహ్మాండంగా  రాయడం మాత్రం తెలుసు..

మనం తెలుసుకున్నాం కదా, మన పని చక్కగా అయిపోతోంది కదా
ఎవరెలా పొతే మనకెందుకు అని ఊర్కుకోవడం అసలెప్పుడైనా తెలుసా?
ఎవరికీ కావాలంటే వాళ్ళే నేర్చుకుంటారులే.. అంతగా ఆడిగితే
అప్పుడు చూద్దాం అనుకోవడమైనా తెలుసా?

ఊహూ.. తనకి తెలిసిన విషయాలని నలుగురికీ చెప్పి వారికి నేర్పించకపోతే
పాపం వాళ్ళు కూడా నేను ఇబ్బంది పడినట్టే పడతారు అనుకోవడం మాత్రం తెలుసు.
ఎవరికెలా నేర్పితే అర్ధం అవుతుందో 'గురుతెరిగి' తెలియ చెప్తూ 
గురూజీ అన్న పేరుకి,సార్ధకత సమకూర్చడం మాత్రం తెలుసు..

అందరూ ఎవరిమానాన వారు వారికి నచ్చింది ఏదో  రాసుకుంటున్నారు కదా
నాకెందుకు? వారి పనికి వారినొదిలేద్దాం అనుకోవడం తెలుసా?

ఊహూ.. 'రెండు కొప్పులు ఒకచోట ఇమడ లేవు' అన్న నానుడి ని మార్చేసి
 ఎన్నోకొప్పుల ఒప్పుల కొప్పలనెందరినో
ఒక  చోట చేర్చి
ఆడించీ, పాడించీ, కలిసి రాతలు రాయించీ, అల్లరి చేయించీ
ప్రమదావనాన్ని సృష్టించి దానిని 
ఒక ప్రమోదవనంగా మార్చడం మాత్రం తెలుసు..

ఇన్ని తెలిసిన జ్యోతిగారికి చెప్పడానికి నాకేం తెలుసు?
ఈ రోజు ఆవిడ పుట్టిన రోజు కనక ,  శుభాకాంక్షలు చెప్పడం మాత్రమే  తెలుసు.
జ్యోతిగారూ.. మీకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఇలాంటి పుట్టిన రోజులు మీరు మరెన్నో జరుపుకోవాలి..మీ ప్రతిభా జ్యోతినీ,  స్నేహ జ్యోతిని మరింత గా ప్రజ్వరింప చేయాలి..
నాతో పాటు మీరు కూడా మరోసారి జ్యోతిగారికి విషెస్ చెప్పేయండి మరి..

Sunday, December 5, 2010

స్వామీ అండ్ ఫ్రెండ్స్ - చిన్నారి లోకపు గొప్ప అనుభవం.

       ఉందో, లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చేయి , ఆ సర్వస్వం నీకిస్తా నా బాల్యం  నాకిచ్చేయి అని దేవుడిని కోరినట్టుగా రాసిన ఒక గజల్ కొన్నాళ్ళ క్రితం గజల్ శ్రీనివాస్ గారు పాడుతుండగా విన్నాను. ఆయన పాడిన తీరూ, ఎంతో బాగా రాసిన సాహిత్యం ఇంకా నాకు ఎప్పుడూ గుర్తు వస్తూనే ఉంటాయి. ఉందో లేదో తెలియని స్వర్గం మీద నా పుణ్యాన్ని వృధా చేసుకోను, తెలిసినదీ, అందరి జీవితాల్లోనూ మరపురానిదీ అయినా బాల్యమనే స్వర్గాన్ని మళ్ళీ నాకిచ్చేస్తే ఆ పుణ్యం మొత్తం నీకిచ్చేస్తాను అని దేవుడితో బేరం పెట్టడం.. ఎంత మధురమైన ఊహ?? 
      సరిగ్గా అలాంటి బాల్యాన్నే 'మిఠాయి పొట్లం' అనే తాయిలంగా చుట్టి  దాదాపు వంద నిమిషాల సేపు మన చేతికందించిన నాటకం నిన్న రాత్రి మేము చూసిన 'Swami and friends". పసితనపు అమాయకత్వాన్నీ, ఆనందాన్ని, స్నేహాన్నీ, అవి తీసుకొచ్చే చిన్న చిన్న ఆపదలనీ, అనుమానాలనీ మనసుకు హత్తుకునేలా చూపించి అందరినీ మెప్పించారు. ప్రముఖ రచయత R.K.Narayan  సృష్టించిన మరపురాని, మధురమైన పాత్ర ఈ చిన్నారి స్వామి.  ఈ పదేళ్ళ చిన్న పిల్లాడూ, అతని కొత్తా, పాత స్నేహితులూ, వారి నడుమ చోటు చేసుకున్న సంఘటనలూ, మధ్య మధ్యలో వాన మబ్బుల్లా వచ్చి భయపెట్టే టీచర్లూ, కోప్పడి క్రమ శిక్షణ లో  పెట్టే అప్పా  ( నాన్న), లాలించి అక్కున చేర్చుకునే పాటీ ( బామ్మా) ఇవీ ఈ కధలోని పాత్రలు. 
     స్వామి ప్రపంచం చాలా చిన్నది. మాల్గుడి అనే చిన్న ఊరిలో (బెంగుళూరు  లోని మల్లేశ్వరం, బసవనగుడి లని కలిపితే మాల్గుడి తయారయింది, కాల్పనిక  గ్రామం ) ఉన్న స్వామి కుటుంబం, రెండు స్కూళ్ళూ, నలుగురు స్నేహితులూ, ముఖ్యంగా పెద్ద గైడ్ లా వ్యవహరించే స్నేహితుడు మణీ... ఇదీ అతని లోకం. కొత్తగా అందులోకి 'రాజం' అనే కుర్రవాడు వస్తాడు. పోలీస్ ఆఫీసర్ గారి అబ్బాయి, అతని తెలివీ, ధైర్యమూ చూసి మన స్వామీ అతనికి ఆప్త మిత్రుడైపోవాలని అనుకుంటాడు. "స్వామీ రాజం తోక" అని పిలిపించుకోవడానికి  కూడా వెనుకాడడు. తన ఇల్లు అతని ఇల్లులాగే ఉండాలనీ, తాను కూడా అతనిలా ఉండాలని తాపత్రయపడతాడు. అమాయకత్వంతో చిక్కుల్లో పడి తను చదువుతున్న మొదటి  స్కూల్ నించి బహిష్కరించ బడతాడు. రెండో స్కూల్ లో చేరిన తర్వాత ఆ  స్కూల్ డిసిప్లిన్ కీ, స్నేహితుల క్రికెట్ ఆటకీ మధ్యన నలిగిపోతాడు. డ్రిల్ ప్రాక్టీస్ కి రమ్మని హెడ్ మాస్టారూ, ఆట ప్రాక్టీస్ కి రమ్మని స్నేహితుడు రాజం వత్తిడి చేసేసరికి, ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితిలో హెడ్ మాస్టార్ కోప్పడి స్కూల్ కి రావద్దనేసరికి భయపడి ఇల్లు వదిలి పారిపోతాడు. తరవాత కొంతమంది సహాయం వల్ల క్షేమంగా ఇల్లు చేరతాడు. స్నేహితుడు రాజం తండ్రికి ట్రాన్స్ ఫర్ అయిందని తెలుసుకుని బాధ పడతాడు. అతనికి వీడ్కోలు పలికి, ఆ తరవాత మళ్ళీ తన పాత స్నేహితుడు మణి తో కలిసి ఉంటాడు.
                అతి తక్కువ పాత్రలతో (11 ), సరంజామాతో (props), ఎక్కడా అంతరాయం లేకుండా, ఒక్క బిగిన నాటకం మొత్తం  చాలా రసవత్తరంగా ప్రదర్శించారు. చిన్న పిల్లలూ, వారి మానసిక స్థితినీ, వారి వయసులో చాలా పెద్దవిగా కనపడే సంఘటనలనీ ప్రతిభావంతంగా చూపించారు. తెలివైన  తన స్నేహితుడు మణి కి ఎదురు చెప్పలేక పోవడమూ, క్రికెట్ జట్టుకి తగ్గ పేర్లు ఆలోచించు కోవడమూ  , ఆమెకేమీ తెలియదని తెలిసినా సరే బామ్మకి అన్నీ చెప్పుకోవడమూ, ఇంట్లో తిడతారని భయపడి పారిపోయిన తర్వాత స్వామి ఇంటి గురించీ, తన వారి గురించీ తలచుకుని బాధపడడమూ .. ఒకటేమిటి?  స్టేజ్ మీద కనపడిన అన్ని సన్నివేశాలూ ఎంతో సహజంగా ఉంది పెద్దవారికి గడచిపోయిన తమ బాల్యాన్ని గుర్తు చేస్తే, పిలల్లకి తమ ప్రస్తుత బాల్యాన్ని గుర్తుచేశాయి. ఈ నాటకం ఇంత రక్తి కట్టడానికి పెద్ద కారణం ఇదే. ప్రతీవారూ తమని ఇందులో చూసుకోగలగడమే.. 
             "The Hindu" దిన పత్రిక వారు నిర్వహిస్తున్న "The Metroplus Theater Fest" లో భాగంగా "The Madras and Landing Stage" వారిచే ప్రదర్శింప బడింది. R.K.Narayan రచించిన ఈ పుస్తకాన్ని 'మానసి సుబ్రహ్మణ్యం' నాటక రూపాన్ని కూర్చగా, 'అరుణ గణేష్ రాం' ఎంతో ప్రతిభావంతంగా దర్శకత్వం వహించారు. పాత్రధారులందరూ తమ తమ పాత్రలలో లీనమై నటించారు. అవకాశం దొరికితే తప్పకుండా చూడవలసిన నాటకం. 

Thursday, November 25, 2010

నాకు నచ్చిన మూడు లాలి పాటలు...

        లాలి పాటకీ, మనకీ ఉన్న అనుబంధం మాటల్లో చెప్పలేము.. అమ్మ తరవాత మనతో అంతగా మమేకమైనది అమ్మ పాడే లాలేనేమో. ఈ భూమి మీద మనలో చాలా మంది ప్రయాణం "జో అచ్యుతానంద" అనో "రామా లాలీ" అనో మొదలవుతుందంటే అతిశయోక్తి కానే కాదు. "నువ్వు నాకు నచ్చావ్" సినిమాలో చెప్పినట్టు ఇలా అంటే ఇలా నే కాదు.. మన తెలుగు వారికి ఇలా అయితే.. ఇతర భాషల వారికి వారి, వారి జోల పాటలతో అన్నమాట. :)
       "జో అచ్యుతానంద" అన్నది అన్నమాచార్య కృతి అని చాలా రోజుల వరకూ నాకు తెలియదు.. ఎవరో అమ్మలే కనిపెట్టి ఉంటారు అనుకునేదాన్ని.. నిజంగా చాలా మంచి కీర్తన. 'రామా లాలీ' అనే పాట  నిజంగా శ్రీ రాముడికి అతని తల్లులు పాడారో, లేదో తెలియదు.  కానీ పౌరాణికాలని అత్యంత అద్భుతంగా తెరకెక్కించే మన సినిమాలలో చూపిన విధానం నా మనసుకెంతో హత్తుకుపోయింది. పైనుంచీ వేళ్ళాడే బంగారుగొలుసుల ఉయ్యాలలూ, వాటిల్లో చిన్న చిన్న పట్టు పంచెలు కట్టుకుని,  ముత్యాల హారాలు వేసుకుని, చంద్రవంక లాంటి బొట్లు పెట్టుకుని ముద్దుగా,  బోసి నవ్వులు నవ్వుతున్న నలుగురు పిల్లలూ.. రామాలాలీ పాడుకున్నప్పు డల్లా   కళ్ళ ముందు కదులుతూనే ఉంటారు. ఆ తరవాత అనేక చిత్రాలలో రకరకాల లాలి పాటలూ, జోల పాటలూ వచ్చాయి.. ఎన్నో మంచి పాటలు.. మర్చిపోలేని పాటలు. అలాంటి మూడు పాటల గురించే ఇదిగో ఈ చిన్న టపా.. మూడు పాటలనీ స్వరపరిచినది శ్రీ ఇళయరాజా కావడం విశేషం.. ఇది పూర్తి చేసేవరకూ నేనూ గమనించలేదీ విషయం.

1. లాలీ లాలీ : ఈ మధ్యన వచ్చిన లాలి పాటల్లో  అగ్ర స్థానాన్ని పొందిన పాటల్లో ఇది తొలి  వరసలో  ఉంటుంది అని చెప్పడం అతిశయోక్తి కాదు. డా.  సినారె కలం నించి జాలువారిన ఈ పాట ఎంత సరళంగా ఉంటుందో, అంత మధురంగా వినిపిస్తుంది.. లాలి పాట పాడి బిడ్డని నిద్రపుచ్చే ప్రతీ తల్లీ తన బిడ్డ వటపత్రశాయి అనే అనుకుని వరహాల లాలి పోస్తుంది, ఈ పాట పల్లవిలో అలాంటి రత్నాల లాలులూ, ముత్యాల పగడాల లాలలూ పోస్తారు సినారేగారు.

       మొదటి చరణం లో బిడ్డ లోకాలనేలే పరమాత్ముడైనా అమ్మ జోల వినకుండా పెరగడు  అన్న భావాన్ని ధ్వనింప చెయ్యడమే కాక ఎంత పెరిగినా పిల్లవాడు తల్లి కంటికి పసిపాపే సుమా! అన్న భావన వినిపిస్తారు. కళ్యాణ రామునికి కౌసల్య లాలీ.. యదువంశ విభునికి యశోద లాలీ అంటూ.. ఇదే భావాన్ని మరొక సినీ కవి ఇలా చెప్తారు. "అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కటే. అవతార పురుషుడైనా ఒక అమ్మ కు కొడుకే" అని..
     ఇక రెండో చరణంలో వివిధ వాగ్గేయ కారులు తమ ఇష్ట దైవానికి ఎలా జోలలూ, లాలలూ పాడారో అని ప్రస్తావిస్తారు. అలమేలు పతికి అన్నమయ్య లాలి పాడితే, కోదండ రాముడికి కంచర్ల గోపన్న పాడాడంటారు, కర్నాటక సంగీత త్రిమూర్తులలోని శ్యామ శాస్త్రి గారినీ, త్యాగరాజ స్వామిని గుర్తుకు తెస్తారు. 'ఉత్సవ సాంప్రదాయ కీర్తనలో' త్యాగరాజస్వామి చాలా మధురమైన లాలిపాటలు రాసారు, పాడారు. "రామా శ్రీరామా లాలీ", ఉయ్యాలలూగవయ్యా", "మల్లెపూల పాన్పు మీద" లాంటివి.
    సుమధురంగా లయ రాజు 'ఇళయరాజా' గారు స్వరపరచిన ఈ పాటని మధురగాయని శ్రీమతి పీ. సుశీల గారు కమనీయంగా, వీనులవిందుగా పాడారు
      ఇక  చిత్రీకరణ గురించి  చెప్పనే అక్కరలేదు. కాళ్ళమీద పడుక్కోబెట్టుకుని నలుగు పెట్టి స్నానం చేయించడం, సాంబ్రాణి పొగ వేసి ఉయ్యాలలూపడం, గొడుగు పెట్టి మరీ నిద్ర పుచ్చడం అన్నీ ఎంతో సహజంగా ప్రతీ ఇంట్లో జరిగేవే అన్నట్టుగా చూపిస్తారు.  ఎంతో సాత్వికమైన అభినయాన్ని కనపరుస్తారు శ్రీమతి. రాధిక.
     చిత్రంలో మొదట తల్లి పాడిన లాలి పాటను తెలుగు వారందరూ గర్వపడే ప్రముఖ  కవి, జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత డాక్టర్.    శ్రీ. సి. నారాయణ రెడ్డి గారు రాస్తే, చివరలో కధానాయక మరణించే సన్నివేశంలో వచ్చిన చిన్న కొనసాగింపు శ్రీ సిరివెన్నెల గారు రాసారు.  ఈ సినిమా విడుదలైన తరవాత పుట్టిన తెలుగు పిల్లలందరూ  ఈ  జోల పాట చెవులా రా విని,  కళ్ళనిండా  నిద్ర పోయి  ఉంటారు అన్నది చాలా నిజం.
ఈ పాట ఇక్కడ వినండి.. లేదా ఇక్కడ  చూడండి.

2. లాలిజో..లాలిజో : సాధారణంగా లాలి పాటలు అమ్మలు పాడినట్టే చూపిస్తారు మన చిత్రాలలో ఎందుకంటే నిజ జీవితంలో కూడా అలాగే జరుగుతుంది కనక. నాన్నలు పాడే లాలి పాటలు లేవని కాదు కానీ అవి సాధారణంగా సెంటిమెంట్ పెంచడానికి వాడుతూ ఉంటారు.. ఉదా: సినిమాలలో తల్లి లేని పిల్లలకిల  తండ్రులు  పాడుతూ ఉండడం అలాంటివి అన్నమాట. ఐతే  'ఇంద్రుడు -చంద్రుడు 'సినిమా లోని ఈ పాట చాలా ప్రత్యేకమైనది అని నా అభిప్రాయం. ఇది కేవలం తండ్రి పాడే జోల మాత్రమే కాదు, తాను గతంలో  చేసిన తప్పులు తెలుసుకుని భార్యనీ, పెద్ద పిలల్లనీ క్షమించమని అడగలేని పరిస్థితులలో అందరికంటే చిన్నపిల్లకి చెప్తున్నట్టుగా తనకి తనే చెప్పుకునే మాటల్లాంటి పాట ఇది. 
   పల్లవి లో' పారిపోనీకుండా పట్టుకో నా చేయి ' అంటూ తనకి తనవారైన వారితోనే  ఉండాలన్న్న బలమైన కోరిక ని చెప్తాడు. అంతేకాదు బుద్దిగా కాపురం చేసుకుంటున్న ఒక పావురం ఎలా గతి తప్పిందో చెప్తాడు. 
        మొదటి చరణం లో దానిని కొనసాగిస్తూ.. మాయని నమ్మి, బోయవాడిని కోరిన  ఆ పావురం దాపునే ఉన్న ముప్పును ఎలా చూసి, తెలుసుకొని గండాన్ని తప్పించుకుంది ( కనీసం తప్పించుకున్నాను  అని అనుకుంది ) అంటూ.. ఇంటిలో చోటుందా చెప్పవే పాపాయి అని కూతుర్ని  దీనంగా అడుగుతాడు. తన ఇంట్లో తనకి చోటు లేదనీ, ఉండదనీ కాదు,  ఆ చోటు తనదే అని చెప్పుకోగల  అర్హత తనకి నిజంగా ఉందా అన్నది భావన కావచ్చు.. శాస్త్రి గారి కలంలోంచి రాని భావన ఉంటుందా? చిన్న,  చిన్న పదాలతో గొప్పభావాలని తట్టి లేపడమే  ఆయన ప్రత్యేకత.
            రెండో చరణంలో ఇప్పటి వరకూ పావురం పేరున చెపుతున్నది కధ తనదే అని ఒప్పుకున్నట్టుగా సాగుతుంది. పిల్లలూ , ఇల్లాలూ తనవల్ల గుండెల్లో బండలు మోస్తూ ఎంత క్షోభ పడ్డారో, నేరం తాను చేస్తే అభం , శుభం తెలియని వారు ఎలా శిక్ష ని అనుభవించారో  అని బాధ పడతాడు. దానికి పరిహారంగానే "తండ్రినే నేనైనా దండమే పెడుతున్నా నంటాడు. తల్లిలా మన్నించూ, మెల్లగా దండించూ.". అంటాడు. "ఏ  తల్లికైనా మెల్లగా  మాత్రమే దండిచడమే తెలుసు.". అని అభిప్రాయమేమో.  అందుకే.. తను చేసిన తప్పులకి అమ్మ పెద్ద మనసుతో ఇచ్చే మెల్లని దండన సరిపోదనో,  ఏమో.. తరవాత "కాళి లా మారమ్మా, కాలితో తన్నమ్మా" అంటూ . అప్పుడైనా పెడదారి పట్టిన నా 'బుద్ధిలో లోపాలు దిద్దుకోగలనేమో 'అని కుమిలిపోతాడు. కంటతడి పెట్టించే సాహిత్యం, అభినయం.
       ఒక చిన్న పాటలో చిత్ర కధనంతా ఇమిడి పోయేలా  చెయ్యడం శ్రీ సిరివెన్నెల గారికి వెన్నతో పెట్టిన విద్య. అది ఇందులో ఆద్యంతమూ కనబడి, వినబడుతుంది.. సమయానికీ, సందర్భానికీ తగ్గట్టు రాసిన  ఈ మాటలు తప్ప , మరేమీ ఇక్కడ నప్పనే నప్పవు అన్నట్టు గా సాగే  పాట ఇది. దానికి జతగా తోడైన మరో  రెండు మణి భూషణాలు.. ఒకటి స్వరజ్ఞాని రాజా గారి సంగీతం రెండోది ఆ పాత్ర ధరించిన శ్రీ కమల్ హాస నే పాడారేమో అన్నంత గొప్పగా ఆలపించిన గాన గంధర్వుడు శ్రీ బాలు గారి గానం.దానికి తోడేమో అనితరసాధ్యమనిపించే కమల్ హాసన్ గారి అభినయం. మొత్తమ్మీద మరిచిపోలేని మధుర గీతం..
ఈ పాట ఇక్కడ వినండి. ఇక్కడ చూడండి.

౩. ఓ పాపా లాలి: అమ్మలూ, నాన్నలూ తమ చిన్నారులకి పాడే లాలి పాటలు చాలా కమనీయంగానూ, కామన్ గానూ ఉంటాయి అని ముందే చెప్పుకున్నాం కదా.  అల్లన్తికోవకి చెందని, ఇది ఒక ప్రత్యేకమైన పాట, తన ప్రేయసికి ప్రియుడు పాడే పాట గానే మాత్రమే కాదు , సందర్భానికి తగ్గట్టుగా మధురంగా వినిపించే పాట ఇది. ప్రముఖ దర్శకుడు శ్రీ మణి రత్నం గారు దర్సకత్వం వహించిన ఒకే ఒక్క తెలుగు సినిమా ( ఇప్పటివరకూ) "గీతాంజలి" చిత్రంలోది. మరణానికి చేరువలో ఉన్న తన స్నేహితురాలికి మిగిలి ఉన్న కొద్ది  రోజులూ ఏ రకమైన కలతలూ, కన్నీళ్ళూ లేకుండా హాయిగా గడవాలని  తపన  పడే ఒక ప్రేమికుడు అదే విషయాన్ని ప్రకృతికి కూడా వినిపించడం ఈ పాట నేపధ్యం. 
            తొలిగా పల్లవిలోనే 'ఈ జన్మకంతా సరిపడేలా లాలి'  పాడనా అంటూ ప్రారంభమవుతుంది. మొదటి చరణం లో గాలిని కూడా సన్నగా వీచమని అడుగుతాడు.. గుండె సవ్వడి  కూడా సన్నగా వినిపిస్తే బావుంటుంది అనుకుంటూ, జీవితంలో ఏమీ చూడని,  అనుభవించని, కన్న  కలలారని పసి పాపకి తడి నీడలు పడేలా కన్నీళ్ళతో నింప వద్దని  చేపల్లాంటి ఆమె కళ్ళని బ్రతిమాలుతాడు. అన్నింటికీ ఒకే అర్ధం.. ఆమె కి మిగిలిన జీవితాన్ని ప్రశాంతంగానూ, సంతోషంగానూ ఉండేలా చూడాలని చెప్పడం.
          రెండో చరణంలో కూడా దాదాపుగా ఇదే భావాన్ని మరికొన్ని మధురమైన మాటలతో పొందుపరిచారు. మేఘాన్ని ఉరమద్దంటూ, కోకిలమ్మని తన పాట పాడమంటాడు, తీయని తేనెలు చల్లమంటాడు.  ఇరు సందెలు కదలాడే ఎద  ఊయల  ఒదిలో తనను దాచుకున్నాను, అంటూ,  తరవాత లైనులో సెలయేరుల అలా పాట కూడా వినిపించనంత ప్రసాంతత లో దాచుకున్నాను మీరు కూడా అలాగే ఉండనివ్వండి అని చలి ఎండకీ, సిరి వెన్నెలకి మనవి చేస్తాడు. ఇక్కడ ఇరు సందె లు కదలాడే ఎద అంటే  జననమూ మరణమూ అనే రెండు సందెలూ  అనుకుంటాను నేను, ఎద కదలికల ఫలితమే కదా ఏ సందైనా.  సినిమా కధ ప్రకారం గా నాకలా అనిపించిందేమో..
   మహాకవి శ్రీ వేటూరి రాసిన ఎన్నో మధురమైన గీతాలలో ఇది ఒకటి. పాటంతా ఒకే భావాన్ని  వివిధ రకాల మాటలతో, అనుభూతి చెదరకుండా చాలా చక్కగా చెప్తారు. బంగారానికి పరిమళం అబ్బినట్టుగా  ఉండే  ఇళయరాజా గారి సంగీతం,  బాలూ గారి గానం  పాట  భావాన్నీ, మూడ్ ని ప్రతిబింబిస్తాయి. మంచుపూల మధ్యన, ఎంతో మృదువుగా చిత్రీకరించిన మంచి పాట ఇది. ఈ చిత్రం విడుదల అయ్యాకా "గీతక్కా", "ఏం?" లాంటి మాటలు ఎంత ప్రాచుర్యం పొందాయో అంతకు రెట్టింపు పేరు పొందాయి ఈ చిత్రం లోని పాటలు..
ఈ పాట ఇక్కడ వినండి. ఇక్కడ చూడండి..
ఇవన్నమాట నాకు నచ్చిన ఎన్నో పాటలలోంచి నేను ఏరుకున్న   మూడు లాలి పాటలు.. అమ్మా, నాన్నా, స్నేహితుడూ..పాడినవి..

Monday, November 22, 2010

ఫ్రీగా వచ్చినా బావున్నాయే.. అసలైనవేనేమో??

         ఈ మధ్యన మనం కొనుక్కున్న వస్తువులకంటే ఫ్రీగా ఎక్కువ వస్తువులు వస్తున్నాయా? అని అనుమానం భయంకరంగా వచ్చేస్తోంది నాకు. దేశ, కాల, మాన పరిస్థితులతో సంబంధం లేకుండా  దుకాణాలన్నీ ఎప్పుడూ కళకళ లాడిపోతూకనిపిస్తున్నాయి.. కేవలం జనాలతోనే కాదు. సేల్,  సేల్, .. అన్న బోర్డులతోనూ.. లైట్లూ, మెరుపులూ వగైరా హంగులతోనూ.. కళ్ళూ, మనసులూ చెదిరిపోయే ఆఫర్లతోనూ..
      కొన్ని అర్ధం అయ్యే ఆఫర్లూ.. మరికొన్ని అర్ధం కానివీనూ . ఒకటి కొంటే  ఒకటి ఫ్రీ, లేదూ రెండు కొంటే  ఒకటి ఫ్రీ . ఇలాంటివి సులువుగా అర్ధం అయ్యేవన్నమాట. ఇంకోరకం ఇలా ఉంటాయి.. రెండు కొనండి,   రెండో దాని మీద ఇరవైయో, నలభైయో.. నూటపద్దేనిమిదో శాతం ఆఫ్..   ఇది కొంచం తిరకాసు వ్యవహారం.. ఇక్కడ అర్ధం, మొదటి దానిమీద ఏమీ లేదు.. రెండోది కొంటే   దానిమీదే డిస్కౌంట్ అని కదా .. ( నా మట్టి బుర్రకి అప్పుడప్పుడు ఇవి అర్ధం కావు కూడా). ఇలాంటివి ఇంకా ఉంటాయి. చాలా మంచి అవకాశం, 50% +40% డిస్కౌంట్  అనో.. లెకపోతే 50%+20%  డిస్కౌంట్ అంటూ ఇలా మన సాధారణ, లేక సైంటిఫిక్ కాలిక్యులేటర్ లో  ఉన్న రకరకా ల చిహ్నాలూ, ఫార్ములాలూ వాడితే కాని అర్ధం అవని ఆఫర్లూ..ఇంత లెక్కల ఒలింపియాడ్ తగ్గట్టుగా ఎందుకూ లెక్కలు చెప్పడం? నిజం గా ఇచ్చేదేమైనా ఉంటే బుద్దిగా ఇచ్చేస్తే సరిపోతుంది కదా..అనుకుంటాను నేను.
     మొన్న మా పక్కింటివాళ్ళ అబ్బాయికి 4 జతల బట్టలు కొంటే ఐదు జతల బట్టలు ఫ్రీగా ఇచ్చారుట.. (నిజంగా నిజం) . వాడి ఆనందం పట్టలేకపోయాము. పది నిమిషాల కో జత మార్చుకొని , వాళ్ళ అమ్మా నాన్నలకి చూపించి తరవాత  మా తలుపు కొట్టి మాకు చూపించడమూ, మళ్ళీ లోపలకి పరిగెత్తడమూ, ఇంకో జత వేసుకోడానికి  ..ఈ రకంగా వాడి  హడావుడి దాదాపు ఒక గంటసేపు నడిచింది అన్నమాట. ఆ ఐదేళ్ళ బుడతడి ఉత్సాహం చూస్తే చెప్పద్దూ.. నాకు కూడా భలే ముచ్చటేసింది..
      మరి  నల్లీ సిల్క్ వాళ్ళు ఒక మంచి పట్టుచీర కొనుక్కుంటే రెండు ఉచితం అని కానీ, స్టెర్లింగ్ హౌస్ వాళ్ళు ఒక సల్వార్ కమీజ్ కోంటే మరో మూడు ఫ్రీ అని కాని ఒక్కసారి కూడా అనరు గాక అనరు కదా. అలా కనక వాళ్ళు ఇచ్చేస్తే  నేను  కూడా అవన్నీ కట్టేసుకుని,  ఈ పాటికి కారివాక్ లు ( అదేనండీ. కారిడార్ లో రాంప్ వాక్ లన్నమాట) అవీ,  ఒక రేంజ్ లో చేసేద్దును కదా అని చాలా సేపు బాధ పడిపోయాను. కానీ ఏం  చేస్తాం? చేసుకున్నవారికి చేసుకున్నంతా.
      ఏదో గుడ్డిలో మెల్ల అన్నట్టుగా నాకూ ఒక అవకాశం వచ్చింది తొందరలోనే. M.T.V వారి టీ షర్టులు ట.  . వీళ్ళు ఒక్క  మ్యూజిక్  చానల్ మాత్రమే నడుపుతారు అనుకున్నా... ఇలా చొక్కాలూ, లాగూలూ  కూడా అమ్ముతారని  ఈ మధ్యనే తెలిసింది.. ఎలా అంటారా? మా అబ్బాయిని మ్యూజిక్ క్లాస్ లో దింపి వాడి కోసం ఎదురు చూస్తుండగా.  మరి  ఆ గంట సేపటిలో  వెనక్కి ఇంటికి వచ్చి  మళ్ళీ వెళ్ళలేము కదా మన బెంగళూర్ ట్రాఫిక్ లో.. అందుకని అక్కడే కూర్చునో, నించునో, కొంగ జపం చెయ్యటమో, ఎదైనా తినడమో, లేదా ఇలా పక్కన కనిపించిన షాప్ లో దూరి అవసరం ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి కొనేసుకోడమో మాత్రమే మార్గాలు. వేరే మార్గాంతరం లేదు కాక లేదు. 
        సరే అలా  ఆ షాప్ లోకి దూరానో లేదో.. M.T.V చొక్కాలు. ఒకటి కొంటే రెండు ఫ్రీ అన్నాడు. షాప్ లో అతను  ఓహో.. మా పక్కింటి వాళ్ళ అబ్బాయంతల్లా  కాకపోయినా  మావాడి అలమారా ( అదే.. వార్డ్రోబ్) ఒక్కసారి మార్చి పారేసే మహదవకాశం  నాకూ వచ్చింది కదా!  అని గబగబా చూసేసాను. అంతేకాదు.. " పొడుగయ్యిపోయాడు.. పాతవి పట్టడం లేదు.. ఇవి బానే ఉన్నాయి. మూడు నెలలోచ్చినా చాలు" వగైరాలన్నీ  నాకునేను ముందు  చెప్పేసుకుని.. అర్జెంట్ గా  ఫోన్ చేసేసి తనకి కూడా చెప్పేసి.. మొత్తానికి మూడు కొన్నాను.. అవీ, వాటితో  ఫ్రీగా వచ్చినవీ కలుకుని నా ముఖం చేటంతా.. మోయ్యాల్సిన బరువు    కొండంతా  అయ్యాయి.. అయితే ఏమైంది? పరాలేదులే.. జీవితం లో లాభాలన్నీ ఊరికే వస్తాయా?  అనుకున్నాను. ప్చ్.. అమాయకత్వం!
        ఇంటికొచ్చాకా చూసుకుంటే నేను కట్టిన డబ్బుకి కొద్దిగా అటూ ఇటూగా అన్ని చొక్కాలు మామూలుగా కూడా కొనుక్కోవచ్చు అని తేలింది.. పొరపాటున నాలిక కరుచుకుని.. మోకాలి మీద కొట్టుకుని.. "పరవాలేదులే.!. వాడికి లేవు.. నేను కూడా జిమ్ కి వేసుకుంటాను" అని సర్ది చెప్పేసి వాటిని అర్జెంట్ గా  లోపల పెట్టేసాను.. "అవుట్ అఫ్ సైట్ ఇస్ అవుట్ అఫ్ మైండ్ "అని నాకు తెలీదా?.మా వాడేమో.. ఇదేం బ్రాండ్? నేను ఎప్పుడూ వినలేదు అని అననే అనేసాడు కూడా. ప్చ్ ! నా కష్టం అలా వృధా అయిపోయింది.  దానికి తోడూ  వాటిల్లో ఎక్కువ శాతం  ఒక నెల రోజుల్లో మేము ముగ్గురమూ రాత్రి పైజామాల మీదకి వేసుకున్టున్నామని మీకు నేను చెప్పలేదు.. చెప్పను కూడా..
        అలా తగిలిన ఆ చిన్న దెబ్బతో నేను కొన్ని రోజులు ఉచిత బట్టల జోలికి వెళ్ళలేదు.. అయినా నెలకోసారి వద్దన్నా వస్తున్నా పండగలూ,., పబ్బాలు..  చేతులు కట్టేసుకుని కూర్చోలేము కదా.. అయినా పాపం కూర్చున్నాము. 

      సరే ఇంతట్లోకి నాకు బొంబాయి వెళ్ళే పని వచ్చింది.. ఈ లోపున మా అబ్బాయి వాళ్ళ నాన్నా కలిసి డ్యూయల్ సిమ్ కార్డ్ లు వేసుకోగలిగే ఫోన్ కావాలి.. అందులో సింపిల్ మోడల్ చాలు నాకు.. నాది చాలా సింపిల్ టేస్ట్ అదీ ,ఇదీ ( ముందర కొన్న హై, ఫై ఫోన్ లూ, గేజేట్లూ గుర్తుకి రావు)  అంటూ నాకు బిల్డ్ అప్ లు ఇచ్చి.. "సంగీతా" షాప్ కి వెళ్లి సామ్సంగ్ వాళ్ళది ఏదో ఒక ఫోన్ కొనుక్కోచ్చారు. నేను వచ్చేసరికి " ఆ ఫోన్ తో పాటు ఈ గ్లాస్ ఫ్రీగా ఇచ్చారు సంగీతా వాళ్ళు , అని భలే ముద్దుగా ఉన్న ఒక వెండి గ్లాస్ చూపించారు కూడా. " ఇంత చిన్న ఫోనుతో  ఇలాంటి వెండి గ్లాసా" అని మేమందరమూ హాచ్చెర్య పడి పోతూ ఉండగానే వచ్చింది ఒక చిన్న అనుమానం.. "ఆ ! మహా మహా వస్తువులు కొంటేనే వెండిసామాన్లు ఇవ్వరు , ఇది  ఆ మధ్యన నేను మల్లేశ్వరం మార్కెట్లో చూసిన తెల్ల లోహంది ( వైట్ మెటల్ అన్నమాట)  అయ్యి ఉంటుంది అనుకున్నాను . ఎందుకంటే అప్పుడెప్పుడో మేము వాషింగ్ మెషీన్ కొన్నప్పుడు బంగారు గాజులు ఫ్రీ అని ఇరవై పైసల బిళ్ళతో చేసిన గాజుల జత ఇచ్చారు. వాషింగ్ మెషీన్ కి బంగారు గాజులు ఇస్తారంటే మేము నమ్మలేదు కానీ అలా వాళ్ళు ప్రకటించుకోవడం నవ్వొచ్చింది. ఇదీ అలాంటిదే అనుకున్నాం.
          "  కొత్త బట్టలు ఉన్నాయి  కదా. నీ ఫోన్ పాడయిపోయింది.. కొత్తది కొందాం "అని దీపావళి కి మళ్ళీ అదే షాపు కి వెళ్ళాము. ఈ సారి మా వాడు "టచ్ ఫోన్ కొందాం, టచ్ మీ నాట్ ఫోన్ వద్దు "అదీ అని మొత్తానికి కొద్దిగా ఎక్కువ ఖరీదున్న  ఫోన్ కొనిపించాడు. "అబ్బో! ఆ చిన్న, సింపిల్ ఫోన్ కే అంత లావు వెండి గ్లాస్ ఇచ్చేస్తే మరి ఇంత ఖరీదైన ఫోన్ కి కంచమో, వెండి చెంబో ఇచ్చేస్తారేమో" అని నేను మనసులోనే అనేసుకున్నాను .. నయం పైకి  అనలేదు.   బిల్ కట్టేసి అప్పుడు మెల్లిగా అడిగాము.. "కిందటి వారం ఈ ఫోన్  కోంటే వెండి  గ్లాస్ ఇచ్చారు.. ఇప్పుడు దీపావళి కూడా కదా. మరి ఈ పెద్దఫోన్ కి ఏమి ఇస్తున్నారు? "అని.. 
        "ఆ స్కీం అయిపోయిందండి.. ఇప్పుడేమీ లేదు" అన్నాడు మొదట.  ఇంకోసారి అడిగాకా మెల్లిగా చిన్న కవర్లోంచి మళ్ళీ గ్లాసూ, చిన్న వెండి (?) కుందులూ చూపించి.." దీపావళి కదా ఈ దీపాలు కూడా ఉన్నాయి. మీకు ఏది కావలిస్తే అది తీసుకోండి "అన్నాడు రహస్యంగా. మళ్ళీ ఎవరైనా వింటే ఏం  ప్రమాదమో !అన్నట్టుగా.. "చూసారా! అడగందే అమ్మైనా పెట్టదు అని ఒక గ్లాస్ ఉంది కదా, అసలే కొత్తగా దేముడి మందిరం కూడా చేయించాము, దీపాలు తీసుకందాం "అని తీసేసుకున్నాను.. భలే.. భలే ! నా దేవుడి మందిరానికి కావలసిన హంగులన్నీ ఇక్కడే అమిరిపోతున్నాయి అన్న ఆనందంతో. సరే మిలమిల లాడుతున్న ఆ గ్లాసూ, దీపాలు పెట్టేసుకుని దీపావళి పూజ కొత్త మందిరం లో చేసేసుకుని ఆనందించేసినా   "అవి వెండి సామానులా , కావా? "అన్న అనుమానం అలాగే ఉండిపోయింది.  వాటిని చూస్తె వారం రోజులైనా రంగు  మారలేదు, రవ్వంత మెరుపు తగ్గలేదు.. "అరే!. ఇవి నిజంగా వెండి  వాటి లాగే ఉన్నాయే.. గ్లాసు తీసుకోవలసిందేమో.. రెండూ జతగా ఉండేవి, ఈ కుందులు మరీ చిన్నవిగా ఉన్నాయి కూడానూ"  అని ఇంకో బాధ.. ఆశ.. దురాశ ...
         అనుమానం అన్నది రానే కూడదు.. వచ్చిందా ?మరి మనల్ని నిలబడ నివ్వదు  కదా. మా పక్కింటి స్నేహితురాలికి చూపించాను.. ఇలా, ఇలాంటి సంగతి అని చెప్పాను.. ఆవిడ వాటిని ఎగా ,దిగా , కిందా, పైనా చూసి "వెండివాటి లాగే ఉన్నాయి ,పోనీ మన కాలనీ లో ఉన్న బంగారం షాప్ లో అడగండి "అన్నారు.
     సరే.. మర్నాడు ఏదో పెద్ద పని ఉన్నట్టు గా  వెళ్లి, చాలా కాజువల్ గా ఏదో వేరే వస్తువు గురించి అడుగుతూ దీని విషయం అడిగాను.. అతను " అయ్యో. మేము ఇక్కడ టెస్టింగ్, పాలిషింగ్ చెయ్యడం మానేసామండి. ఎందుకంటే మొదట ,మనుషులు దొరకటం లేదు, రెండు , షాప్ లో A.C పెట్టాకా యాసిడ్ పొగలు ఒక పట్టాన పోవండి.. మూడు,  వర్క్ షాప్ కి పంపిద్దామంటే నాకు గిట్టుబాటు అవడం లేదండి.. వస్తువుకి  యాభై తీసుకుంటారు వాళ్ళు." అని కర్ణుడి చావుకి ఉన్న కారణాల లాగా పెద్ద లిస్టు చెప్పారు. పైగా.." అందుకే పాత వెండి ఎక్స్చేంజ్ లో కూడా తీసుకోవడం లేదు "అన్న చావు కబురు కూడా చల్లగా చెప్పాడు. 'సీత కష్టాలు సీతవి పీత కష్టాలు పీతవి అంటే ఇదే మరి.'. అతని కష్టం మాట సరే.. ఇప్పుడు నా దగ్గరున్న ఆ వస్తువులు వెండివా ,కాదా అని తేలడం ఎలాగా? ఈ నా పీత కష్టం తీర్చే నాధుడెవరు? ఇదో పెద్ద సమస్య అయింది నాకు.
      "ఫ్రీగా వచ్చిన వస్తువులకి ఇంత పెద్ద హంగామా ఎందుకు? రోజూ వాడు.. బావుంటే వెండి.. లేకుంటే కాదు "అంటారు తను.. "అబ్బా అది నాకు తెలియదా? అయినా తెలియని విషయాలు తెలుసుకోవడమనే కుతూహలం ఉంది చూసారూ.. అది అంత సామాన్యంగా వదిలేది   కాదు.. అంచేత మీకెవరికైనా అసలైన వెండి సామాను కనిపెట్టే విద్యలు, చిట్కాలు తెలిస్తే నాకు తొందరగా చెప్పేయండి మరి. ఈ లోపున మా గ్లాసూ, దీపాలు వాటి రంగులు మార్చేసుకుని తమ అసలు రంగులు బయట పెట్టేసుకుంటే మీ చిట్కాలు వేస్ట్ అయిపోతాయి కదా.. అందుకే..

Sunday, November 21, 2010

బ్లాగుల్లో వనభోజనాలు..పప్ప, పప్ప పప్ప పప్పు దప్పళం

బ్లాగులలో స్నేహాలు .. కొబ్బరిలో నీళ్ళల్లా అన్నారు.. బానేఉంది, భలే కమ్మగా ఉన్నాయి ఈ స్నేహాలు, అచ్చు లేత కొబ్బరి నీళ్ళల్లాగే. అని సంబరపడిపోయాను నా బ్లాగ్ మిత్రులందరినీ చూసి ... భోజనాలూ. టిఫిన్లూ కూడా బ్లాగుల్లోనేనా? అనుకున్నా బ్లాగులలో వనభోజనాల గురించి వినగానే.. అందుకేనేమో.. హాస్యబ్రహ్మ జంధ్యాల కోడిని చూరుకి కట్టేసుకుని దానికేసి ఆశగా చూస్తూ ఆత్రంగా ఉత్తి అన్నం తినేసే చిట్కా ఎప్పుడో చెప్పేశారు. ఇలాంటి రోజులు వస్తాయని ఆయన ముందే ఊహించేసారు.. అని కూడా అనేసుకున్నా.
ఇప్పుడు మాత్రం!.. షడ్రుచుల మన వంటల జ్యోతిగారూ,కేవలం సొరకాయలే కాక అన్నిరకాల వంటల స్పెషలిస్ట్ మాలగారూ, కాబీజీ ఉడికించే కధ చెప్తూ సరదాగా టమాటా పచ్చడి చేసేసే భావన (ఉమా) గారూ.. ఇలా చెప్పుకుంటూ పొతే నా ఈ పోస్ట్ సరిపోనంత లిస్టు అయ్యే స్నేహితులందరి వంటలూ, వారు పెట్టిన టపాలు చదువుకుంటూ, చిత్రాలు చూసుకుంటూ రోజూ మనం వండుకునే వంటే ఈ రోజు కూడా తినాలి కదా అనేదే నా బాధ. అర్ధం చేసుకోరూ!!!!
అయితే నిజంగా రాసేడప్పుడు ఆ అనుభవం చాలా బావుంది లెండి అది వేరే విషయం.అది గట్టిగా చెప్పేస్తే ఇంకా అందరి వంటలూ ఎప్పటికీ ఇలా కంప్యూటరల లోనే తినేయమంటారు మరి. అందుకే ..ష్! గప్ చుప్ !!
సరే.. ఒప్పుకున్నాక తప్పేదేముంది? స్నేహబంధమూ ఎంత మధురమూ ( బ్లాగ్ స్నేహితలకిచ్చిన మాట వల్లే కదా ఈ టపా).. మన ఈ (కంప్యూ) వన భోజనమూ ఎంత అందమూ.. అనుకుంటూ వనాన్ని, ఉసిరి చెట్టునీ కొంతసేపు మర్చిపోదామని ప్రయత్నిస్తూ.. ఏమి వండాలి? దేని గురించి రాయాలి? అని ఆలోచించడం మొదలుపెట్టా.. వంట వండే ఏ ఇల్లాలినైనా అడగండి.. వండడం ఎంత సులువో, ఏమి వండాలి? అని నిర్ణయించడం ఎంత కష్టమో? చాలా సులువుగా చెప్పేస్తుంది. అలా, ఇలా తిరుగుతూ , ఒక సారి పెన్ను తలమీద కొట్టుకుంటూ, ఒక సారి శూన్యం లోకి చూస్తూ, మరొకసారి చేసిన ప్రతీ వంటకీ రకరకాల భంగిమలలో ఫోటోలు తీస్తూ.. ఇలా చిత్రాతి చిత్రమైన వేషాలు వేసి మా ఇంట్లో వాళ్ళని కొన్నిరోజులు భయపెట్టాకా..
" ఆ! పెద్ద కష్టమైన వంటలు మన వల్ల కాదులే!.. చాలా సులువైనదీ, తప్పకుండా ఉండి తీరాల్సినదీ, రుచికరమైనదీ, వంటలలోకెల్లా ఉత్తమోత్తమైనదీ ( ఏమిటీ.. ఏదైనా వ్రతం తాలూకా విశేషణాలు గుర్తొస్తున్నాయా? ఇంచుమించు ఇదీ అలాంటిదే కదా మరి), అందరిచేతా ప్రశంసలు అందుకునే అర్హత ఉన్నదీ.. అయిన అలాంటి ఒక ఉత్తమ వంటకాన్ని మీ అందరికీ పరిచయం చెయ్యాలని డిసైడ్ అయిపోయాను. అది మీకు ముందే తెలిసినా, నా కంటే చాలా బాగా చెయ్యడం వచ్చినా సరే.. మీరందరూ అమాంతం 'గజినీ' సినిమా గుర్తుకు తెచ్చుకుని ఈ వంట చేసే విధానం మర్చిపోవాలి అని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. అందుకని నా మీద పెద్ద మనసు చేసుకుని.. ఈ సారి కిలా కానిచ్చెయ్యండి మరి..
ఇక వంట గురించి చెప్పేద్దామా ? "ఆగు.... ఆత్రం లేదు... మరగనీ- బాగా మరగనీ.. దప్పళం, దాంపత్యం మరిగిన కొద్దీ రుచి. అన్నారు 'మిధునం' కధలో ఒక రమణగారు ( ప్రముఖ రచయత శ్రీ రమణగారు). ఇంకో రమణ గారు మరికొంత ముందుకెళ్ళి తానూ తన ప్రాణమిత్రుడూ ఆలుమగల అనుబంధాన్ని ఎంతో అపురూపంగానూ, అద్దంలా అద్భుతంగానూ ఆవిష్కరించిన "పెళ్లి పుస్తకం" సినిమాలో "పప్ప, పప్ప, పప్ప, పప్పు దప్పళం " అని ఒక పాట కూడా పెట్టించారు ( సుప్రసిద్ధ రచయిత ముళ్ళపూడి రమణగారు). మరి అదన్నమాట ప్రముఖుల చేత మననలూ, మన్ననలూ పొందినదే మన ఈ వంట.
ఈ ఇద్దరి మాటలు ఆదర్శంగా తీసేసుకుని.. ఈ కార్తీక పౌర్ణమి నాడు నేను కూడా పప్పు.. దప్పళం చెయ్యడాని కి ఫిక్స్ అయ్యాను. సింపుల్ గా చెప్పాలంటే ముక్కల పులుసు అన్నమాట. సింపుల్ గా అన్నాను కదా అని మరీ అలా తేలికగా చూడకండి. సరిగ్గా చెయ్యకపోతే.. శ్రీ రమణ గారు కధలో చెప్పిన " క్షీరసాగర మధనంలా కోలాహలం ఉండదు మరి.. పోపు పడితే రాచ్చిప్పలో ఉప్పెన రాదు మరి.". అందుకే ఏమేమి వేసానో?, ఎలా, ఎలా చేసానో ? కింద చూడండి మరి.

మధురమైన ఈ దాంపత్యానికి.. అదేనండి దప్పళం చెయ్యడాని కి కావలసిన వస్తువులు..
సొరకాయ ముక్కలు- రెండు కప్పులు, తొక్క తీసి పెద్ద ముక్కలుగా తరుగు కోవాలి
చిలగడదుంప ముక్కలు- ఒక దుంప తొక్కతీసి గుండ్రంగా చక్రాలుగా తరుగు కోవాలి
బెండకాయలు- 4 - 5 - ముచికలు తీసి పెద్ద ముక్కలుగా కానీ, నిలువుగా కానీ తరుగు కోవాలి
గుమ్మడి కాయ ముక్కలు - ఒక కప్పు.. పెద్ద ముక్కలు..
టమాటో - ఇష్టమైతే వేసుకోవచ్చు.. పూర్తిగా చింతపండు కంటే ఆరోగ్యం కాదా.
పచ్చిమిరపకాయలు- మన ఇష్టానికి సరిపడినన్ని
బెల్లం - తగి నంత
చింతపండు- ఒక నిమ్మ పండంత. నీటిలో నానబెట్టి చిక్కగా రసం తీసుకోవాలి.
సెనగపిండి- కొంచం నీళ్ళల్లో కలిపి ఉంచుకోవాలి.
కూర పొడి లేదా రసం పొడి కొద్ది గా
కొత్తిమీర తగినంత
ఉప్పు తగినంత
పసుపు.
పోపుకి:
ఆవాలు, జీలకర్రా, కరివేపాకు, ఇంగువ.

ఇంకా ఇలా చేసేసుకోండి మరి! ముందుగా తరిగిన కూరగాయ ముక్కలన్నీ పచ్చి మిరపకాయలతో సహా కలిపి మరీ మెత్తగా కాకుండా ఉడికించుకోవాలి. కుకర్లో అయితే రెండు విజిల్స్ వస్తే చాలు, మైక్రోవేవ్ లో అయితే 5 -6 నిమిషాలు సరిపోతుంది. తరవాత ఇందులో చింతపండు రసమూ, ఉప్పూ, పసుపూ, బెల్లమూ వేసి మరిగించుకోవాలి. చిన్న గిన్నెలో కొంచెం నీళ్ళల్లో కలిపిన సెనగపిండిని దీనికి చేర్చాలి.. దీనివల్లన పులుసుకి చిక్కదనమూ, కమ్మదనమూ వస్తాయి . ఇప్పుడు కరివేపాకు వేసి మరొక రెండు నిమిషాలు మరిగించాలి. ఇష్టమైన వారు కూరపొడి కానీ, రసం పొడి కానీ వేసుకోవచ్చు.ఆ తరవాత చిన్న మూకుడు లో నూనె వేసి వేడి చేసి, ఆవాలు, జీలకర్రా, కరివేపాకూ, ఇంగువ లతో పోపు పెట్టుకుని అది కూడా మరుగుతున్న పులుసు లో వేసి, అప్పుడు కొత్తిమీర వేసి.. మూత పెట్టి, స్టవ్ ఆపేసి దింపుకోవాలి.
సన్నని సెగ మీద దోరగా కందిపప్పుని వేయించి దానికి తగినంత నీరు పోసి ఉడికిస్తే చక్కటి ముద్దపప్పు తయారవుతుంది. వేడి వేడి అన్నం మీద.. కమ్మని పప్పు.. కాచిన నెయ్యీ..తోడుగా దప్పళం.. ..సోమరాజు సుశీల గారి 'ఇల్లేరమ్మ కధల్లో'వాళ్ళ నాన్న అంటారుట.. పప్పూ, దప్పళమూ ఉంటే కూరెందుకూ? కుమ్ములోకి అని. మీరు అదే మాట అంటారు .. మేము అదే అన్నాము కనక.. అంతే కాదు.. ఈ వంకన కూర వండండం బద్దకింఛినా మీకు మరేమీ ఇబ్బంది ఉండదు అని ఇందుమూలం గా నేను ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను. కనక ఈ ఫోటోలు చూసేసి, ఈ పాట తాలూకా ఆడియో వినేసి , వీడియో చూసేసి .. ఇది వండేసుకుని, తినేసి హాయిగా నిద్రపోండి.. మరి మళ్ళీ ఎప్పుడో బ్లాగుల్లో భోజనాలకో, టిఫినీలకో మళ్ళీ ఇంకో వంటతో కలుసుకుందాం. సరే నా .. అమ్మయ్యా రాసేసాను.. ఇంక ఎలా ఉందో చదివి చెప్పేయండి మరి.
ఈ సందర్భంగా పాట వినేయండి మరి..






Thursday, September 30, 2010

రాబోయే ప్రపంచ యుద్ధాలు..

         యుద్ధం రావాలని ఎవరూ కోరుకోరు. అందునా ప్రపంచయుద్ధం?? .అనుకోడానికే భయంగా ఉంటుంది. కానీ ఈ మధ్యన ఎక్కడ చూసినా మూడో ప్రపంచ యుద్ధం నీటికోసం జరుగుతుంది అనే చెప్తున్నారు. అడ్డూ అదుపూ లేకుండా మనం వనాలనీ, తటాకాలనీ, కొండలనీ, కోనలనీ, నదులనీ, సముద్రాలనీ వేటినీ వదలకుండా మన స్వార్ధం కోసం వాడేసుకుంటే తాగడానికి కూడా నీరు దొరక్క మన మనుగడకే ముప్పు రావచ్చు అన్నది మనందరికీ తెలిసినదే... వివిధ దేశాలలో ఇది చాలామందికి ఎంతో కొంత అనుభవంలోకి వచ్చిన విషయమే. నీతివనరులకోసం వివిధ దేశాలూ, రాష్ట్రాల  మధ్య విభేదాలు మరింత ఉధృతం గా మారితే మాత్రం యుద్ధాలు నిజంగానే తప్పవు. చూస్తూ ఉంటే కేవలం నీరు ఒక్కటే కాదు, ఇంకా చాలా వాటికోసం యుద్ధాలు జరగవచ్చు అని. మరి అదేమిటి? మీరే చూడండి.
ఆదివారం కదా, సరదాగా అలా బయట తిరిగోద్దామా? అనుకుంటారు.. మీరూ, మీ శ్రీమతీ..ఇంకేం? అనుకోగానే త్వరగా తయ్యారయిపోతారు మంచి బట్టలు వేసుకుని, సెంటూ వగైరాలు కొట్టుకుని. కాని మీకు ఇక్కడ తెలియనిది ఒకటి ఉంది. మీరు అనుకున్న సమయానికే మీ ఊరిలో అనేక వందల  మంది అలాగే అనుకున్నారనీ, వాళ్ళందరూ కూడా మీరు కార్ బయటకు తీసే సమయానికే బయలుదేరారనీనూ.. 
ముందు కొంచం షాపింగ్ చేసేసి తర్వాత రెస్టారంట్ లో భోజనం చేసేసి వద్దాం అనుకున్నారు. రక రకాల సిగ్నల్స్ దాటుకుంటూ, ట్రాఫిక్ లో పడుతూ లేస్తూ, బయటకి వచ్చినందుకు మనల్నీ దారిలో మనకి అడ్డొచ్చిన వారినీ తిట్టుకుంటూ  షాపింగ్ మార్కెట్ దగ్గరకి వెళ్ళడానికి ఒక గంట..అక్కడకి వెళ్ళాకా ఉంటుంది.. కార్ ఎక్కడ పెట్టాలి?? హైదరాబాద్ లో ఆబిడ్స్, బెంగళూర్ లో కమర్షియల్ స్ట్రీట్ ఇలాంటివి అయితే కనీసం అరగంట పడుతుంది ఒక ఖాళీ స్థలం దొరకడానికి.
వరసగా రకరకాల రంగులూ, సైజులూ, ఆకారాల్లో కార్లు తోరనాల్లా పార్క్ చేసి ఉంటాయి.దీనికొక వరసా వావీ ఉండదు,వెతికి చూద్దామన్నా క్రమశిక్షణా, పద్దతీ కనపడదు. ఎక్కడైనా ఒక చోట ఖాళీ కనిపించిందంటే అది ఖచ్చితంగా ఎవరిదో గేట్ అయ్యి ఉంటుంది. లేదా ట్రాన్స్ ఫార్మర్ లాంటి దానికి దగ్గర, పేలిపోయే ప్రమాదం ఉండవచ్చు అని జనం అనుకున్న చోట మాత్రమే ఉంటుంది. మళ్ళీ ఓ నాలుగు ప్రదక్షిణాలు చేస్తే దొరకవచ్చు.ఇది ఓపెన్ మార్కెట్ లలో పరిస్థితి అయితే ఇంకాకేవలంమహానగరాలే కాక ఒక మాదిరి నగరాలలోకూడా ప్రముఖ సందర్శనాలయాలుగానూ , మళ్ళీ మాట్లాడితే దేవాలయాలంత  గోప్పవిగానూ  మారిపోయిన మాల్స్ లో పరిస్థితి వేరేరకంగా ఉంటుంది. కొన్నింట్లో ఓ  పది అంతస్తులలో పార్కింగ్ ఉంటుంది. తిరుపతి ఘాట్ రోడ్ ఎక్కినట్టు లాఘవంగా స్టీరింగ్ తిప్పుకుంటూ ఎక్కడ 'పార్కింగ్ ఫుల్' అన్న బోర్డ్ లేదో చూసి అక్కడ పెట్టుకోవాలి. దీనికి మూల్యం బానే చెల్లిం చుకోవాలి మనం పెట్టే గంటల్ని బట్టి. మన వ్యాపారవేత్తలకి మాల్ కట్టడం లో ఉన్నంత శ్రద్ద పార్కింగ్ చోటు కట్టడం లో ఉండదు ( రెండిం టి మీదా వచ్చే ఆదాయం  లో ఉన్న వ్యత్యాసం ఒక్కటే  దీనికి కారణమా?). దానివల్ల ఎన్నో అవకతవకలూ, కొన్నిసార్లు ప్రమాదాలు.. సరిపడినంత స్థలం వదలక పోవడం వాళ్ళ మలుపులు తిరుగుతూ పైకి ఎక్కేదప్పుడూ, కిందకి దిగేటప్పుడూ ఎన్నో కార్లు గోడలని గుద్దేసుకోవడం నాకు తెలుసు. కొన్ని చోట్ల దానిని తగ్గించడానికి మలుపుల్లో పెద్ద పెద్ద రబ్బర్ మాట్ లని గోడలకి తాపడం చేయడం కూడా నాకు తెలుసు.
"భారత దేశంలోనే అతి పెద్ద సూపర్ మార్కెట్"! అని ఒకరూ.. "ఆసియా ఖండంలోనే గొప్ప మాల్" అని ఇంకొకరూ. "మీ గృహ ఉపకార ణాలన్నీ  ఒకే చోట లభించే చోటు "అని ఇలా పేపర్లలో చదవడానికి  బానే ఉంటుంది. కానీ దానికి తగ్గ పార్కింగ్ లేనప్పుడు వీటి అంత తలనొప్పి మరొకటి ఉండదు. అందరికీ అందుబాటులో ఉండే చోట కడితే వ్యాపారం బాగుంటుంది అన్న దూరదృష్టి చాలా మంచిదే కానీ దానికి తగ్గ సదుపాయాలూ లేనప్పుడు ఇలాంటివి తెచ్చే లాభాలకన్నా, ఇబ్బందులే ఎక్కువ.. షాపింగ్ మార్కెట్ లూ, సినిమా హాళ్ళూ కలిపేసి ఒకే చోట కట్టేసే చోట ఈ సమస్య మరీ అధికం. కొన్ని చోట్ల కనీసం భద్రతా ఏర్పాట్లు లేకుండా కట్టేస్తారు. ప్రమాదం చెప్పి రాదు, మన జాగ్రత్త మనం తీసుకోవాలి అన్న ఆలోచనే ఉండదు.
  అదీకాక మనవారికి మనం కొనదలుచుకున్న షాప్ ముందే దిగాలి, వీలయితే మెట్లమీద.మనం దిగాకా కార్ అక్కడే ఉంది వెయిట్ చేస్తే మన పని పూర్తి కాగానే ఎక్కడానికి వీలుగా ఉంటుంది. కొంత దూరం నడిచి కార్ ఎక్కాలంటే ఇంకా కార్ లో వచ్చి లాభం ఏమిటి? ఇలాంటి ఆలోచనులున్నప్పుడు ఇంకా పార్కింగ్ ఎలా దొరుకుతుంది? అందుకే ప్రజల కోసం కట్టిన పార్కింగ్ ప్లేస్ లలో అరుదుగానూ, రోడ్ల మీద అన్నిచోట్లా తరచుగానూ కార్లని చూస్తూ ఉంటాము. వీటికోసం పెరిగిపోయే కోపాలు, గొడవలూ మాల్స్ లోకి వెళ్ళేటప్పుడూ, వచ్చేటప్పుడూ ఆపకుండా కొట్టేసే హారన్లూ ఇవన్నీ చూస్తె నిజంగా విరక్తి వస్తుంది. ఈ మధ్యన కొన్నిచోట్ల చాలా కొత్త సాంకేతిక పరిజ్ఞానం తో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది చూడటానికి బానే ఉన్నాయి.. పైకి, కిందకీ ముందుకీ, వెనక్కి మన కార్లని జరిపి తిరిగి మనకప్పగించడానికి పట్టే సమయం తప్ప. పెరుగుతున్న జనాభాతో పాటూ అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతున్న  వాహనాల సమాఖ్య ఇలానే సాగితే కేవలం వీటిని నిలుపుకోదానికే రాష్ట్ర సరిహద్దులూ, దేశ సరిహద్దులూ కూడా దాటవలసి వస్తుందేమో?

ఉన్న ఇన్ని గ్రహాలలో నివాసయోగ్యమైనది భూమి ఒక్కటే ( కనీసం ఇప్పటికి).  మన అవసరాలకోసం, స్వార్ధం కోసం, సంపాదనకోసం మన భూమిని ఇప్పటికే ఎంతో దుర్వినియోగం చేసేసాము, చేస్తూనే ఉన్నాం. ఇది ఇలాగే సాగితే మనం నిలబడ టానికైనా   స్థలం ఉంటుందో, లేదో? ఇంకా అప్పుడు కార్లు నిలబెట్టుకోవాలంటే ప్రపంచ యుద్ధాలు నిజంగానే   జరిగినా జరుగుతాయి.
  

            

Friday, September 17, 2010

జాలిగా జాబిలమ్మా..



        మనసులో   నాలుగు కాలాలపాటు నిలిచిపోయేది మంచిపాట అనుకుంటే ఎప్పుడు గుర్తు వచ్చినా కళ్ళనే కాదు మనసుని తడిమేదీ, తడిపేది.. గొప్ప పాట. అలాంటి గొప్ప పాటలు మాత్రమే రాయగలిగే  ఒక కలం.. ఆ కలం పట్టే ఒక చెయ్యి.. ఆ చేతిని ఎప్పుడూ , ఎల్లప్పుడూ సరి అయిన దిశలో మాత్రమే నడిపించే ఒక  సాహితీ మూర్తి.. సొంత పేరు కాకపోయినా పాటల వెన్నెలలూ, మాటల మిల మిలలూ కురిపిస్తూ,  పొందిన ఆ   పేరుకే  కళనీ, కాంతినీ, వెన్నెలంత చల్లదన్నాన్నీ, అపారమైన గౌరవాన్నీ  ఆపాదించుకున్న  ఆ  వ్యక్తి 'శ్రీ సిరి వెన్నెల.'   ఆయన కలంలో ఒదగని భావం లేదు.. ఆ ఇంకులో ఇంకని మధురిమ  లేదు..ఎంతమంది  ఎన్ని రకాలుగా  రాసినా, కీర్తించినా  ఇంకా  ఇంకా చెప్పుకోడానికి మరెంతో మిగిలి ఉన్న అసమాన  ప్రతిభా మూర్తి ఆయన . అందుకే ఈ టపా.  ఈ సాహితీ చంద్రునికో నూలుపోగు..
            " శ్లేషా మాత్రంగానైనా అభ్యంతరకరమైన పదాలుండవు శాస్త్రి గారి పాటల్లో "అని శ్రీ బాలు గారు ఎప్పుడూ చెపుతూ ఉండే మాట ఎంత నిజమో ఆయన రాసిన ఏ పాటైనా చెప్తుంది. అంతే కాదు.. కత్తికి  మహా ఉంటే రెండు వైపులా పదును ఉండవచ్చు  కానీ  కలానికీ, కవి హృదయానికీ అన్ని వైపులా పదునే అంటుంది ఆయన కలం. అందుకే  ఒక పాటలో 'తరలి రాద  తనే వసంతం.. తన దరికి రాని వనాలకోసం" అని  అంటే.. "అదుపెరుగని  ఆటలాడు వసంతాలు వలదంటే విరి వనముల పరిమళముల విలువేముందీ?" అంటారు మరొక పాటలో.   . పరస్పరం విభిన్నంగా అనిపించే భావాలని అందంగా రాసి నిజమే కదా అనిపించి ఒప్పించా గలగడమే   ఆయన  గొప్పతనం.
              మూడు నిమిషాల చిన్న పాటలో చిత్ర కధ మొత్తం ఇమిడ్చి,  జీవిత కధలా వినిపించీ, వినగానే అలరించి.. కళ్ళని ఎడిపించీ  మనసుని కదిలించగలిగే ఒక గొప్ప  పాట గురించే ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది. శాస్త్రి గారు రాసిన ఎన్నో వందల అధ్బుతమైన పాటల్లోంచి  ఈ పాటనే నేను ఎంచుకోవడానికి ఇదే ముఖ్య కారణం. కళా తపస్వి దర్శకత్వంలో వచ్చిన 'స్వాతి కిరణం' చిత్రం లో ఒక పాట గొప్పదీ, మరొకటి కాదు.. అని ఎంచడం పెద్ద దుస్సాహసం. అయినా ఈ పాటలో ఇమిడిన భావం, అనుభూతి ఎందుకో నన్ను ఎప్పుడూ వెంటాడుతూ ఉంటాయి.. ఇది నిజంగా ఒక  హాంటింగ్ మెలోడీ. 

                  "జాలిగా జాబిలమ్మా.. రేయి రేయంతా రెప్పవేయనే లేదు ఎందు చేతా. ఎందు చేతా..
                  పదహారు కళలనీ పదిలంగా ఉంచనీ ఆ కృష్ణ పక్షమే ఎదలో చిచ్చు పెట్టుట చేతా.". అంటారు పల్లవిలో..

              జాలిగా  చూస్తూ జాబిలమ్మ రాత్రంతా నిదరపోలేదుట.. ఎందుకంటే పదహారు కళలని తనలో నింపకుండా తీసుకుని వెళ్ళిపోయే కృష్ణ పక్షం  తన ఎదలో చిచ్చు పెట్టడం వల్లనట. ఇక్కడ జాబిలమ్మ అంటే అద్భుతంగా పాడే బుల్లి గంధర్వుడు 'గంగాధరం', కృష్ణ పక్షం మరెవరో కాదు అతని  'గురువుగారు.' శర్మ గారు . వారు పెట్టిన చిచ్సు, ఆయన వయసుకు తగని,  ఏ మాత్రమూ ధర్మం కాని అసూయ. సంధర్భానీ, భావాన్ని ఇంతకంటే పొందికగా చెప్పడం సాధ్యమా? ఈ చిన్నారి జాబిలమ్మ తన వయసుకి మించిన పరిణతి చూపిస్తుంది, "పెద్దవారు ఎదగకుండా చిన్నపిల్లల్లా  ప్రవర్తిస్తే  పిల్లలు పెద్దవారవుతారేమో".. అందుకే మొదటి చరణంలో తన తల్లి కాని తల్లికి ధైర్యం చెపుతాడు ఇలా..

                            " కాటుక కంటి నీరు.. పెదవుల నంటనీకు.. చిరునవ్వు దీపకళిక చిన్నబోనీయకు..
                               నీ బుజ్జి గణపతిని.. బుజ్జగించి చెపుతున్నా. నీ కుంకుమ కెపుడూ పొద్దు గుంక దమ్మా.."

            కాటుక కంటి నీరు పెదవుల నంట నీయవద్దమ్మా. నీ మొహాన దీప కళిక లా   వెలిగే చిరునవ్వు చిన్నపోకూడదు. అంటూనే ఆ ముఖానే వెలిగే మరో దీపం, ఆ తల్లి నుదిట కుంకుమ  ఎప్పుడూ అస్తమించ దమ్మా అంటాడు.. గురువు గారు ఎప్పుడూ చల్లగా ఉండాలి.. ఉంటారు అని అనునయిస్తాడు.  గురువుగారి దారికడ్డం రాకుండా తానే తప్పుకోవాలి అనుకున్న తన నిర్ణయాన్ని చెప్పకుండానే చెప్తాడు, ఇదే మాటని రెండో చరణంలో మరింత స్పష్టంగా చెప్తాడు . 'నీ బుజ్జి గణపతినమ్మా .. అమ్మవైనా నిన్ను బుజ్జగిస్తున్నా' అని అ తల్లి కాని తల్లిని అనునయిస్తాడు. ఇక్కడ 'గణపతిని 'అని ఎందుకు అన్నారో మనసు కరిగేలా రెండో చరణంలో చెప్తారు శ్రీ సిరివెన్నెల..

                        సున్నిపిండిని నలిచి చిన్నారిగా మలచి సంతసాన మునిగింది సంతులేని పార్వతి.
                        సుతుడన్న మతి మరిచీ, శూలాన మెడవిరిచి పెద్దరికం చూపే చిచ్చు కంటి పెనిమిటి..

         ఈ రెండు పంక్తులు చాలు మొత్తం కధనీ, పాత్రల వైఖరిని మనముందు ఉంచడానికి. తన కొడుకు కాకపోయినా భర్తని ఒప్పించి దత్తత తీసుకుని,  ప్రతిభావంతుడైన ఆ బిడ్డని చూసుకుని మురిసిపోతుంది ఆ తల్లి, గురువు గారి భార్య.  అచ్చం తన వంటి నలుగు పిండికి ప్రాణం పోసిన పార్వతీదేవి లాగే.  తనకు పుట్టినవాడు కాకపోయినా ధార్మికంగా, వేదోక్త ప్రకారంగా తనవాడిని చేసుకున్న బిడ్డ మీద కూడా అలవి కాని అసూయని పెంచుకుని, అందరి జీవితాలనీ దుర్భరం చేసి  'పెద్దరికం' చూపించే గురువు.. 'చిచ్చు కంటి పెనిమిటి ' అన్న పద ప్రయోగం ఎంత   గొప్పగా ధ్వనిస్తుందో ఇక్కడ.. అక్కడ సదాశివుడు నిజంగానే చిచ్చు కన్ను ఉన్నవాడే.. ఇక్కడ ఆ కన్ను లేకుండానే అందరి మనసుల్లో చిచ్చు పెట్టగలవాడు, తండ్రే మరి .

                      ప్రాణ  పతి నంటుందా  . బిడ్డ గతి కంటుందా ఆ రెండు కళ్ళల్లో ఇది కన్నీటి చితి
                      కాల కూటం కన్నా.. ఘాటైన గరళ మిదీ... గొంతునులిమే గురుతై వెంటనే ఉంటుంది
                     ఆటు పోటు నటనలివీ, ఆట విడుపు ఘటనలివీ ఆది శక్తివి నీవు.. అంటవు నిన్నేవీ
                     నీ బుజ్జి గణపతినీ బుజ్జగించీ చెపుతున్నా. కంచి కెళ్ళి పోయేవే కధలన్నీ..

              ఈ నాలుగు లైన్లలో బుజ్జి గణపతీ, అతని పెంపుడు తల్లీ పడే వేదన కనిపిస్తుంది..రెండు కళ్ళలాంటి ఆ ఇద్దరిలో ఏ ఒక్కరికి ఏ మాత్రం హాని జరిగినా తల్లడిల్లిపోయే ఆమె స్త్రీ  హృదయమూ..  ఎంత గొంతు నులిమే విషమైనా    ఇవి ఎవరూ కావాలని చేసేవి కాదు.. జీవితంలో మాములుగా వచ్చే ఆటు పోట్లు మాత్రమే..  అంటూ ధైర్యం చెప్పే చిన్నారి తనయుడి గొప్పతనమూ మనల్ని పలకరిస్తాయి. అయినా   ఆది శక్తి రూపమైన అమ్మవు నువ్వు. నీకు ఇవేవీ అంటవు తల్లీ .. ఇందులో నువ్వు కేవలం నిమిత్త మాత్రురాలవు.. అంటూ..  అనునయంగా బుజ్జగిస్తూనే తన కధ కంచికి వెళ్ళిపోతోంది అని సూచిస్తాడు.

పాట పూర్తి అయ్యేసరికి ఎన్ని సార్లు విన్నా, మనవి  కాటుక కళ్ళైనా, కాకపోయినా వాటిల్లో  కన్నీరు వచ్చి చేరడం తధ్యం..పని కట్టుకుని పిలనక్కరలేదు..  చాలా సాధారణంగా కనిపించే అసాధారణమైన పాట ఇది.
             జాబిలమ్మ జాలిగా చూస్తూ చిన్నపోయినా. ఆ వెన్నెలల కళలని కృష్ణ పక్షం మింగేసినా శాస్త్రి గారి కలం మాత్రం వెన్నెలలే కురిపిస్తుంది.. ఎందుకంటే  ఎన్నటికీ గ్రహణం లేని వెన్నెలే మన  సిరివెన్నెల కనక.
             కళా తపస్వి దర్శకత్వం లో వచ్చిన ఈ స్వాతి కిరణం చిత్రంలో అన్ని పాటలు వెన్నెల కిరణాలే.. మణి  పూసలే.. పాటలకి ప్రాణం పోస్తూ స్వరపరిచారు 'గ్రహణం ఎరుగని మరో ఛంద'మామ' ' శ్రీ. మహదేవన్.. శ్రీమతి వాణీ జయరాం సుమధురంగా పాడారు. మమ్ముట్టీ, రాధికా, బాలనటుడు మంజునాథ్  తమ తమ పాత్రలకి ప్రాణం పోశారు.. 

            

Wednesday, September 15, 2010

నాలుగే రకాల పళ్ళు.. నాలుగొందల సాధనాలు..

"అబ్బా ! పొద్దున్నించీ పళ్లన్నీ ఒకటే పోటు" అంటారు బాపు గారి జోక్ లో ఒక తాతగారు. అది విన్న ఆయన భార్యేమో "ఓసోస్ !పళ్ళు అని బహువచనం కూడానూ" అంటుంది. చూడగానే, వినగానే కిసుక్కున నవ్వు పుట్టించే జోక్ ఇది. "పాపం తాతగారికి పళ్లన్నీ ఊడిపోయాయి కదా!, పళ్ళు ఎలా తోముకుంటారో?" అనుకునేదాన్ని చిన్నప్పుడు. ఇప్పుడేమో "ఆహా ఎంత అదృష్టవంతులో కదా అనుకుంటాను. ఎందుకో తెలుసా.. చూడండి మరి..
కళ్ళూ, చెవులూ, కాళ్ళూ చేతులూ రెండేసి ఇచ్చిన దేవుడు పళ్ళు మాత్రం 32 ఇచ్చాడు. మంచిదే!.. అందువల్లే కదా మనం కావలసినవన్నీ తినగలుగుతున్నాము. మన శరీర ఆరోగ్యంలో దంతాల రక్షణా, ఆరోగ్యమూ ఎంతో ముఖ్య మైనవని తెలుసుకున్నాము కూడా. వాటిని శ్రద్ధగా చూసుకోకపోతే అనవసరంగా దంతవైద్యుల జేబులు నింపాలని కూడా మనకి తెలిసిపోయింది. అయితే వీటి శ్రద్ధ లోనే వచ్చింది చిక్కంతా. వెనకటి తరంలో మనవారు చక్కగా ప్రకృతి దొరికే వేపపుల్లలూ, పొయ్యిలో కచికా మొదలైనా వాటితో శుభ్రంగా తోముకునేవారు , అందుకే ఎనభై ఏళ్ళువచ్చినా ఒక్క పన్ను కూడా కదిలేది కాదు అని గొప్పగా మనకీ చెప్పేవారు. పుల్లల మాట ఎలా ఉన్నా, బూడిద లు అవి అంత మంచివి కాదు కదా. అప్పుడే వచ్చాయి తెల్లటి కుంచెలు వేసుకుని రంగురంగుల ప్లాస్టిక్ ముక్కలు.. అవేనండీ, మన బ్రష్ లు.
మొదట్లో వీటిని చూసి 'భలే ఉన్నాయే' అనుకున్నారు అందరూ.. కాలక్రమేణా వీటిల్లో ఎన్నో రకాలు, 'బస్సులు, రైళ్ళు, విమానాలు, జట్లు, జాకెట్లూ ఇలా దైనందిన జీవితంలో ఎలా స్పీడూ, మార్పూ వచ్చిందో అన్న లాల్చీ మాస్టారి మాట లా గే వీటిల్లోనూ అన్నమాట. అవేవిటో మనమూ చూద్దాం.
1. పుల్లలూ, బొగ్గూ, కచికా ఇలాంటివి మీ పల్లకి మేలు చెయ్యకపోగా హాని చేస్తాయి. ఇది నిజం గా నిజం.. వేప పుల్ల పరవాలేదు కాని. మిగతావి అస్సలు మంచివి కాదు. అందుకే బ్రష్ లు వాడండి అని తయారీదారులు చెప్తే చాలా మంది నేర్చుకున్నారు.. మెచ్చుకున్నారు. వాడడం మొదలు పెట్టారు కూడా. ఇది మంచి పరిణామం. తర్వాతే అయోమయం మొదలయింది.
2. బ్రష్ ఊరికే అలా ఒక పుల్లలా తిన్నగా ఉంటె ఉపయోగం లేదు.. కొంచం వంగి ఉంటేనే అది మీకు వీలుగా ఉంటుంది.. అన్నారు. ఓహో ! అలాగా, అనుకున్నాము.. కొద్దిగా వంపుగా ఉన్న బ్రష్ లు కోనేసుకున్నాం.
3. ఆ తర్వాత ఊరికే వంపుగా ఉంటె చాలదు.. దానికి తగినంత 'ఫ్లెక్సి బిలిటీ" ఉండాలి.. అప్పుడే అది మీ నోట్లో గుండ్రంగా తిరిగి హాయిగా శుభ్రం చేస్తుంది.. అందుకే మేము బ్రష్ ల తల భాగం కొద్దిగా అటూ, ఇటూ తిరిగేదిగా దీని రూపొందించాం . ఇప్పుడు మీరు తిరగనక్కరలేదు అని వారు చెప్తే. "ఆహా! భలే! వీరు ఇంత పరిశోధన చేస్తారు కనక ఇన్ని విషయాలు తెలుస్తాయి.. మనలాంటి సామాన్యులకి ఎలా తెలుస్తుంది?" అనుకున్నాము.
4. రోజుకి హీనపక్షం పది నిమిషాలు దంతధావనం చేసుకున్నారనుకుంటే. వారానికెంత? నెలకెంత?సంవత్సారానికెంత? చివరికి మీ జీవితకాలంలో ఎంత? దీనివల్ల మీ చేతి కండరాల మీద ఎంత వత్తిడి? గట్రా గట్రా ,, అందుకే మీ బ్రష్ చేతిని అంటుకునే భాగానికి కుషన్ అమర్చాము. పెద్దలు మీకే ఇలా ఉంటె మీ లేత శిశువుల నాజూకు ( క్షమించెయ్యండి ప్రకటనల భాష వద్దన్నా వచ్చేస్తోంది మరి :)) చేతుల మీద ఎంత వత్తిడి? అందుకే బొటనవేలు పెట్టుకునేందుకు ఒక వొంకు ఏర్పాటు చేసాము అన్నారు. చేతులని సోఫాల్లో కూర్చో బెట్టినంత సంబర పడిపోయాము . పిల్లులూ, కుక్కలూ, బార్బీలూ అవి తర్వాత వచ్చాయి.
5. ఇన్ని చేసాకా కుంచెలు పట్టుదారాల్లా ఉండాలి కానీ కొబ్బరి పీచులా ఉంటే ఎంత హాని? ఎంత నష్టం? అని మనల్ని అడిగినట్టే అడిగి తయారీదారులే సమాధానం చూపించేశారు.. ఈ సెన్సిటివ్,, ఆ సుతి మెత్తనా అంటూ.మొదలు పెట్టి . పైగా ప్రపంచంలోని పళ్ళ డాక్టర్ లు అందరూ ఇవే వాడతారు, ఇవే సిఫార్స్ చేస్తారు అంటూ మళ్ళీ మళ్ళీ చెప్పేశారు. సరే.. 'చెప్పేవాడికి వినేవాడికి లోకువ ;అనడం కన్నా 'వినేవాడికి చెప్పే వాడంటే చాలా గౌరవం' అనుకుందాం.. మనం 'అవును.. ఇది మాత్రం నిజంగా నిజం 'అనుకున్నాం
6. ఇప్పుడేమో తరవాత తరం బ్రష్ లని ప్రవేశపెట్టారు. వీటిని మన పాత తరం వాటితో 'మన అబ్బాయి' అని కూడా పిలిపించారు. ఇవి మెత్తగా ఉంటూ, ఎలా అంటూ అలా తిరుగుతూ, పళ్ళూ, నోరు, నాలికా, చిగుళ్ళూ ఇంకా నోట్లో ఏముంటే అవన్నీ ఒక్క దెబ్బతో శుభ్రం చేసి పారేస్తుంది.. అన్నారు.
7. తరవాత ఏకంగా జాగ్రఫీలు, జామెట్రీ లు రంగ ప్రవేశం చేసేసాయి. పూర్తిగా 360 డిగ్రీల బ్రష్ అని ఒకటీ, మీ నోరు భూమండలం అంత ఉన్నా సరే. ఇది అన్ని రకాలుగా నూ రంగుల రాట్నాలు తిరిగి మరీ దుమ్ము దులిపేస్తుంది అని.
8. ఇవన్నీ కాదంటే బాటరీ తో నడిచే 'ఎలక్ట్రానిక్ బ్రష్లూ.. ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో ఎన్నెన్నో..
ఇందులో ఏది మంచిదో? ఏది అవసరమో? ఏది కొనాలో తెలియని అయోమయం. ఒక్క బ్రష్ లనేమిటి మనం ఉపయోగించే ప్రతీ వస్తువులోనూ వినియోగదారులు ఎదుర్కుంటున్న ముఖ్యమైన సమస్య ఇది. తయారీదారుల మధ్య ఉన్న పోటీ ల పుణ్యం ఇది. దీనివల్లనే కళ్ళూ, మనసు చెదిరేలా రకరకాల తయారీలూ.. జేబులూ మనసులూ కొల్లగొట్టే ధరలూ.
ఇది ఇలాగే సాగితే ( సాగితే ఏమిటి? సాగుతూనే ఉంటుంది). కొన్ని రోజుల్లో మనం ఒక బ్రష్ కాక కనీసం నాలుగో లేక ఐదో కొనుక్కోవలసి వస్తుంది.. మన నోట్లో ఉన్నవి నాలుగు రకాల పళ్ళు కనక ( Incisors, canines, pre molars and Molars) ఒక్కో రకపు పళ్ళకీ ఒక్కో రకమైన బ్రష్, ఐదోది మన నాలుకా, చిగుళ్ళూ, వగైరాలకీనూ. శుభవార్త ఏమిటంటే ఇవి కొనుక్కున్న వారికి ఒక కీ రింగ్ ఫ్రీ కూడా. ఇది నేనివ్వడం లేదు.. ఇస్తారేమో అని చెప్తున్నాను. తలకి ఐదు బ్రష్లు దాచుకోవాలంటే ఈ మాత్రం అవసరం కదా అని నా ప్లాన్.
ఉన్నప్రతీ పన్నుకీ ఒక రకమైన బ్రష్ కొనుక్కోమనకుండా ఉంటె అదే పదివేలు కదా. ఇప్పుడు అర్ధం అయింది కదా పైన బాపు గారి జోక్ లో తాత గారు ఎందుకు అదృష్టవంతులో ? ఇదన్నమాట మన నాలుగు రకాల పళ్ళు , నాలుగొందల సాధనాలు అనే దంతోపాఖ్యానం.. సారీ బ్రష్శోపాఖ్యానం.

Thursday, August 19, 2010

తర్వాత ఎవరు???



ఆగస్ట్ నాలుగో తేదీన ' టాటా సన్స్" వారు చేసిన ప్రకటన తర్వాత నాతో పాటు అనేకమంది కి తోచిన మొదటి ప్రశ్న ఇది. ఎప్పుడో నూట నలభై రెండేళ్ళక్రిందట ఒక చిన్న మొక్కగా మొదలయి నేడు ఒక మహా సంస్థ గా విస్తరించి ఉప్పు మొదలు కార్లవరకూ అదీ ఇదీ అని లేకుండా అన్నింటినీ ఒకే రకమైన అంకితభావంతో, అత్యంత ప్రతిష్టాత్మకంగా తయారు చేస్తూ మన దేశానికే మకుటాయమానంగా నిలిచిన సంస్థకి తర్వాత అధినేత ఎవరు? 2012 లో తన 75 ఏళ్ళ వయసులో పదవీ విరమణ చేయడానికి నిర్ణయించిన ఆ మహానాయకుడి ని ఎవరు అనుసరించగలరు? ( అధిగమించడమనే సమస్య ఇంకా రానే లేదు) జే.ఆర్.డీ టాటా నించి 1991 లో పగ్గాలు చేపట్టిన నాటినించీ ఇప్పటివరకూ ఎన్నో విజయాలని తన ఖాతాలో వేసుకుని తిరుగులేని నాయకుడిగా నిలిచిన రతన్ నవల్ టాటా కి నిజమైన వారసుడు ఎవరు అనేవి ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్నలు. బోర్డ్ నాయకుడిగా ఎవరిని ఎంపిక చేస్తుంది? దగ్గరబంధువులనా? లేక పార్శీ పరివారాలలోంచి ఒకరిని ఎంపిక చేస్తుందా? ఆ అవకాశం అసలు భారతీయుడిని వరిస్తుందా? లేక విదేశీయులని కూడా పరిగణిస్తారా? ( పరిగణిస్తామని అన్నారు కదా)



శ్రీ రతన్ టాటా ఇప్పటి వరకూ సాగించిన యాత్రలో విజయాలే అత్యధికం. దాదాపు 300 చిన్న చిన్న కంపెనీలుగా ఉన్నా టా టా సామ్రాజ్యాన్ని ఒక పద్దతిగా, ప్రణాళికా బద్ధంగా నిర్మించుకుంటూ, నిర్ణాయాత్మకమైన మార్పులు చేసుకుంటూ వచ్చారు. ఈ రోజు టాటా సామ్రాజ్యంలో 98 సంస్థలు ఉన్నాయి, వీటిలో భారత దేశంలో సాఫ్ట్ వేర్ రంగంలో మొదటిదైన సంస్థా, కార్లలో రెందో స్థానంలో ఉన్న సంస్థా కూడా ఉన్నాయి. రతన్ టాటా ఏది చేసినా సఫలమే , టా టా వారు ఏది చేసిన సంచలనమే అన్న స్థాయికి సంస్థని తీసుకు వచ్చారు. సామాన్యుడికి కూడా అందుబాటులో ఉన్న నానో కారు రూపొందించడమన్న తన కలని నిజం చేసుకున్నా, అధికంగా విదేశీ కంపెనీలని కొనుగోలు చేసినా ( టెట్ లీ టీ, కోరస్ స్టీల్, జాగ్వార్ లాండ్ రోవర్ వగైరాలు) అది ఆయనకున్న సమర్ధతా, నియమబధ్ధత వల్లనే. ఆయన చేసిన విదేశీ కొనుగోళ్ళు తొలుత ఒకింత మిశ్రమ స్పందనకు గురి అయినా తరవాత లాభాలనే ఆర్జించి పెట్టాయి అన్నది నిజం. ఆయన కున్న ప్రణాళికా బద్ధత, దూర దృష్టి చాలా స్పష్టమైనవి. ఆయన తరవాత అధిపతిగా వచ్చేవారు ఇవన్నీ అంతే చాకచక్యంగా నిర్వహించేవారు అయి ఉండాలి అన్నది నిర్వివాదాంశం.

ఈ విషయం మీద 'ద ఎకానమిస్ట్' పత్రికలో (ఆగస్ట్ 14-20, 2010) లో ఒక వ్యాసం చదివాను. వ్యాసకర్త ఇలా అంటారు.. రతన్ టాటా కి వారసుడిగా వచ్చే వ్యక్తి కొత్త సంస్థలని కొనుగోలు చేసేకంటే ముందు ప్రస్తుతం ఉన్న సంస్థలన్నీ సజావుగా, మెరుగ్గా పనిచేసేటట్టుగా చూడాలి. ఎందుకంటే ప్రజల దృష్టిలో టాటా వారికున్న మంచిపేరుని కొనసాగించడమూ, వీలున్నప్పుడల్లా పెంపొందించడం చాలా ముఖ్యమైన బాధ్యతలు. అంతే కాక టాటా వారు కొనసాగిస్తున్న పలు సామాజిక సహాయ కార్యక్రమాలు అన్నీ సజావుగా కొనసాగేలా చూడాలి. ఇలా అధికారికంగా ప్రకటన చేసి తర్వాత అధినేతని వెతకడం ఒక చక్కని ప్రయత్నంగా అభివర్ణించారు, ఎందుకంటే భారత దేశంలో ఒక అధినేత ఎలా ఎన్నుకోబడతాడన్నది ఎప్పుడూ వెల్లడి కాని రహస్యంగా ఉండిపోతుంది కనక అంటారు. ఇంటర్నేషనల్ బిజినెస్స్ స్కూల్ కి చెందిన కవిల్ రామచంద్రన్ గారు టాటా వారి ఈ పద్ధతిని ఒక సమున్నతమైన సాంప్రదాయంగా కొనియాడాతూ ఇదే పద్దతిని సౌత్ ఈస్ట్ ఆసియా లోని మిగతా దేశాలుకూడా అవలంబిస్తే బావుంటుంది అని అన్నారు. అయితే ఆ వ్యక్తి ఎవరు అవుతారు? అనేది చాల ఉత్సుకభరితంగా మారింది. అంత గొప్ప నాయకుడినీ, " జెంటిల్మాన్ ఎక్స్ట్రా ఆర్డినైర్ " గా ప్రసిద్దుడైన వ్యక్తికి వారసుడవడం అంత సులభం కాదు కదా. అదన్నమాట విషయం.
చివరగా ఒక విషయం చెప్పి ముగిస్తాను. సూపర్ స్టార్ రజనీకాంత్ గారి సినిమా శివాజి లో ఒక డైలాగ్ ఉంది. " ఆరు తర్వాత ఏడురా, శివాజీ తర్వాత ఎవడురా? అని. ఈ అనువాద సంభాషణ విన్న వెంటనే చాలా విచిత్రంగా అనిపించినా ఆలోచిస్తే నిజమే కదా అనిపించింది.. ఆరుతర్వాత ఏడు వచ్చినంత సులువు కాదు కదా ఒక గొప్ప నాయకుడి తర్వాత మరొకరు రావడమన్నది.. ఇక్కడ సినిమాలో శివాజీ పాత్రనుద్దేశించి రాసినా, రతన్ జీ వంటి మహానాయకుడి వారసుడిగా పీఠమెక్కడం నిజంగానే చాలా గొప్ప బాధ్యత.. రాగల కాలమే కాగల నాయకుడిని నిర్ణయించాలి.. అంతవరకు.. జయ హో రతన్ జీ..

Wednesday, August 18, 2010

తోడుగా నడిచే తోబుట్టువులు.

ఒక అమ్మ పిల్లలందరూ ఒకేలా ఉండరు.. ఎంత అక్కాచెళ్ళెళ్ళయినా, అన్నదమ్ములైనా ఒక్కలా ఉంటారా, ఒక్కటే చేస్తారా? ఇలాంటి మాటలూ, ప్రశ్నలూ మనం తరుచూ వింటూనే ఉంటాము. ఒక చేతివేళ్ళూ ఒక్కలా ఉండవు, ఒక్క తల్లి పిల్లలూ ఒక్కలా ఉండరూ అని కూడా అంటారు. అన్నదమ్ములూ, అక్కచెళ్ళెల్లూ ఒకేలా ఉన్నా లేకపోయినా ఒకే రంగంలో కలిసి రాణించిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. పైన చెప్పిన ప్రశ్నలని గురించి ఆలోచిస్తుంటే ఈ ఆలోచన వచ్చి అలాంటివారిలో కొందరిగురించి రాయాలని అనిపించింది. ఇది చదివి మీరు కూడా కొన్ని ఉదాహరణలు చెప్తే బావుంటుంది. ముందుగా సంగీతరంగాన్ని ప్రస్తావిస్తాను. తొలుతగా కర్నాటక సంగీతరంగం.

1. హైదరాబాద్ బ్రదర్స్ : కర్నాటక సంగీత రంగంలో ప్రముఖ స్థానాన్ని అలంకరించిన హైదరాబాద్ బ్రదర్స్ గా ప్రసిద్ధులైన డి. శేషాచారి, డి. రాఘవాచారి గార్లు దేశ విదేశాలలో అనేక కచేరీలు చేసిన విద్వాంసులు. ఏన్నో అవార్డులనీ, రివార్డులనీ అందుకున్నారు. తొలుత వారి తండ్రిగారైన లేటు సంగీత విద్వాన్ శ్రీ. రామానుజాచార్యుల వారివద్దా, తల్లిగారైనా శ్రీమతి సులోచనాదేవి గారి వద్దా శిక్షణ ప్రారంభించి తరవాత వారు తమదైన ప్రత్యేక శైలిని అవలంబించి ఎంతో ప్రాచుర్యాన్ని పొందారు.

2. హైదరాబాద్ సిస్టర్స్: హైదరాబాద్ సిస్టర్స్ గా ప్రసిద్ధులైన శ్రీమతి లలిత, శ్రీమతి హరిప్రియ కూడా ఎంతో పేరు గలిగిన సంగీత కళాకారిణులు. వీరు లేటు శ్రీ టీ. పద్మనాభన్ గారి దగ్గర శిక్షణ పొందారు, దేశంలో అన్ని ప్రముఖ సభలలోనూ, విదేశాలలోనూ కూడా ఎన్నో కచేరీలు నిర్వహించారు. మన తెలుగు తేజం శ్రీ రామ చంద్ర వీరిలో హరిప్రియగారి శిష్యుడు కూడా.


హైదరాబాద్ సిస్టర్స్



3. బాంబే సిస్టర్స్: శ్రీమతి శీ. సరోజ, శ్రీమతి శీ. లలిత గార్లు కూడా చాలా ప్రముఖులైన సంగీత విద్వాంసులు. వీరు హెచ్. ఏ. ఎస్ మణీ, ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్ మొదలైన వారి వద్ద విద్యనభ్యసించారు. అనేక కచేరీలు చేసారు.

బాంబే సిస్టర్స్


4. శూలమంగళం సిస్టర్స్: శూలమంగలం జయలక్ష్మి, రాజ్యలక్ష్మి గార్లు శూలమంగలం సిస్టర్స్ గా, యుగళ గానానికి ( ఇద్దరు చేసే కచేరీలకి) ఆద్యులుగా చెప్పబడతారు. వీరిద్దరి బాటలోనే ఆ తరవాత రాధా-జయలక్ష్మి ( కజిన్స్), బాంబే సిస్టర్స్ మొదలైన వారు పయనించారు అని చెప్పుకోవచ్చు.

శూలమంగళం సిస్టర్స్


రాధా-జయలక్ష్మి


5. రంజని- గాయత్రి: ఈ ఇద్దరు సోదరీమణులు వోకల్ మరియూ వయొలీన్ వాదనలోనూ సుప్రసిద్దులు. టీనేజ్ నుంచే వీరిద్దరూ వయొలీన్ ప్రదర్శనలు ఇచ్చేవారు. అంతేకాక ఎంతో మంది ప్రముఖులకి పక్కవాయిద్యంగా కూడా వయోలీన్ సహకారం అందించారు. ఆ తర్వాత వోకల్ కచేరీలు కూడా ప్రారంభించి అందులో కూడా ప్రాచుర్యాన్ని పొందారు.

రంజని- గాయత్రి


6. ప్రియా సిస్టర్స్: ఫ్రియా సిస్టర్స్ గా సుపరిచుతులైన హరిప్రియ, షణ్ముఖప్రియ కూడా ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసులు. రాధా-జయలక్ష్మి గార్ల శిష్యులైన వీరిద్దరూ కూడా చిన్ననాటినించే ప్రతిభ కనపర్చిన వారు. వీరు ఇప్పుడు టీ. ఆర్ సుబ్రమనియం గారి శిష్యులు. ప్రియా సిస్టర్స్ కూడా ఎన్నో కచేరీలు చేసి ప్రశంసలూ, పురస్కారాలూ పొందారు.

ప్రియా సిస్టర్స్



7.మల్లాది బ్రదర్స్: మల్లాది శ్రీరాంకుమార్, మల్లాది రవికుమార్ మల్లాది బ్రదర్స్ గా ప్రసిద్దులు. మొదట వారి తాతగారూ, తండ్రిగార్ల దగ్గర శిక్షణ ప్రారంభించిన వీరు తర్వాత నేదునూరి కృష్ణమూర్తి గారు, వోలేటి వెంకటేశ్వర్లు గారు, శ్రీపాద పినాకపాణి గారు వంటి మహానుభావుల వద్ద విద్యాభ్యాసం చేసి త్యాగరాజ కృతుల ఆలాపనలో ప్రముఖులుగా నిలిచారు. ఎన్నో కచేరీలు చేసారు.


మల్లాది బ్రదర్స్



8. మైసూర్ బ్రదర్స్: సుప్రసిద్ధ వయొలీన్ విద్వాసుంలైన శ్రీ. మంజునాధ్, శ్రీ. నాగరాజ్ అత్యంత పేరు ప్రఖ్యతులు కలిగిన వయొలీన్ విద్వాసులు. వీరి ప్రతిభగురించి కానీ, వారి ప్రత్యేకతలని గురించి కానీ ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచవ్యాప్తంగా ఎంతో కీర్తినార్జించిన ప్రముఖులు వీరు. కలిసి ప్రదర్శనలిస్తూనే, ప్రముఖులకి పక్కవాయిద్య సహకారాన్ని కూడా అందిస్తారు.

మైసూర్ బ్రదర్స్



9.మాండలీన్ సిస్టర్స్: మాండలీన్ మీద సురాగాలు పలికించే ఈ ఇద్దరు చిన్నారులు శ్రీఉష, శిరిష అనతికాలంలోనే ఎంతో పేరు తెచ్చుకున్నారు.


మాండలీన్ సిస్టర్స్


10.రుద్రపట్నం బ్రదర్స్: రుద్రపట్నం బ్రదర్స్ గా ప్రముఖులైనా ఆర్.ఎన్. త్యాగరాజన్, ఆర్. ఎన్ తారానాథన్ గార్లకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. వీరు ప్రముఖు విద్వాసులవద్ద సంగీతాన్ని నేర్చుకున్నారు. వారిలో ప్రముఖ వయోలీన్ విద్వాసుంలు శ్రీ. టీ. చౌడయ్య గారు కూడా ఉన్నారు. మూడు తరాల సంగీత సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న ప్రముఖులు వీరిద్దరూ.

రుద్రపట్నం బ్రదర్స్


వీరు మచ్చుకి కొందరు మాత్రమే. ఇంకా ఎందరో ఇలాంటి వారు ఉన్నారు. ప్రతిభావంతులైన బిడ్డల వల్ల తల్లి తండ్రులకి కలిగే ఆనందమూ, గౌరవమూ ఎంత ఆహ్లదాన్ని కలిగిస్తాయో మనందరికీ తెలుసు. అది ఒకటికి రెండితంలైతే.. ఆ భావాన్ని చెప్పడానికి మాటలుండవేమో.. వీరి తల్లితండ్రులు నిజంగా ధన్యులు..


వీరిలో కొందరిని ప్రత్యక్షంగా చూసే అవకాశమూ, వారి అమృతగానాన్నీ, వాయిద్య విన్యాసాలనీ వినగలిగే అదృష్టం మాకు దొరకడం నిజంగా గొప్ప వరం.


ఇతరరంగాలలోని ప్రముఖ అక్కచెళ్ళెళ్ళూ, అన్నదమ్ముల గురించి మరొక టపాలో. ఇక్కడ నేను ప్రస్తావించని కళాకారులగురించి తప్పకుండా చెప్పండి.

నగుమోము గనలేని నాజాలి తెలిసి నన్ను బ్రోవగ రాదా శ్రీరఘువర నీ...