కొన్ని రాగాలూ, కొన్ని కీర్తనలూ మొదటి సారి వినగానే ఎప్పటినించో తెలిసిన వాటిలా అనిపిస్తాయి.మరెంతో కాలం గుర్తుండిపోతాయి. దానికి ప్రత్యేకమైన కారణాలు అక్కరలేదు అనిపిస్తుంది నాకు. ఆ యా రాగాలలోనూ, కీర్తనలలోనూ ఉన్న గొప్పదనం అది అనుకుంటాను నేను. కర్నాటక శాస్త్రీయ సంగీతం అంటే వల్లమాలిన ఇష్టం, అభిమానమూ తప్ప మరే గొప్ప అర్హతలూ నాకు లేవు.. అయినా సాహసించి ఒక రాగాన్ని గురించి అందులో స్వరపరిచిన కొన్ని కీర్తనలూ, పాటలగురించీ చెప్పాలని ఈ ప్రయత్నం.. ఇది చదివిన మిత్రులు ఇంకా వివరాలు నాకు తెలియచేస్తే చాలా సంతోషిస్తాను.
'శ్రీ నీలోత్పలనాయికే 'అన్న ఈ కీర్తన మొదటిసారి యూ ట్యూబ్ లో విద్వాన్. శ్రీ. టీ. ఎం. కృష్ణ పాడగా విన్నాను. మొదటిసారి వినడంతోనే ఈ రాగం ఎంతో గొప్పగా అనిపించింది. తర్వాత సంగీత శిరోమణి శ్రీ. బాల మురళీకృష్ణ గారు పాడినది విన్న తర్వాత అయితే ఇంక చెప్పనక్కరలేదు. అప్పటినించీ ఎన్ని సార్లు విన్నామో లెక్కలేదు. కార్లో, ఇంట్లో, సి.డీలో, కంప్యూటర్లో.. ఇలా లెక్కలేనన్నిసార్లు.విన్న ప్రతీసారి మరింత బాగా, గొప్పగా అనిపిస్తుంది.
అందువల్లనే ఈ రాగాన్ని గురించి మరికొన్ని వివరాలు తెలుసుకోవాలని అనిపించింది. ఈ రీతిగౌళ రాగం 22 వ మేళకర్త రాగమైన ఖరహరప్రియ రాగానికి జన్య రాగం. ప్రస్తుతం రీతిగౌళగా ప్రసిద్ధి చెందినా ఈ రాగం యొక్క అసలు పేరు నారీ రీతిగౌళ. ఆనందభైరవి, శ్రీరంజని రాగాలకి చాలా దగ్గర పోలికలతో ఉన్నా, ఆరోహణలో 'ని, ని, స' అనే స్వరప్రయోగం ఈ రాగానికి ప్రత్యేకమైన ముద్రని చేకూరుస్తాయి.
శ్రీ ముతుస్వామి దీక్షితార్ రచించిన 'శ్రీ నీలోత్పల నాయికే' అన్న కృతితో పాటు, త్యాగరాజస్వామి రచించిన 'నన్ను విడచి కదలకురా', బాలే బాలేందు భూషిని, ద్వైతము సుఖమా లాంటివి, స్వాతి తిరుణాల్ కృతి 'జనని నిను వినా' లాంటివెన్నో ఈ రాగం లో ఉన్నాయి.
శ్రీనగర నాయిక అయిన పార్వతీ దేవిని స్తుతిస్తూ సాగే ఈ కీర్తనలో దీక్షితార్ అనేకవిధాలుగా దేవిని ప్రస్తుతిస్తారు. నీలి కలువ పువ్వులో ఉద్భవించిన నాయిక అయిన ఆ జగదంబికని కోరిన వరాలిచ్చే దేవతగా వర్ణిస్తారు.
పల్లవి: శ్రీ నీలోత్పల నాయికే..జగదంబికే.. శ్రీ నగర నాయికే... మామవ వరదాయికే..
దీన జనుల పట్ల అపారమైన దయా, జాలి లాంటి లక్షణాల వల్ల అపరిమితమైన గౌరవం పొందినదట పార్వతీ దేవి . విశ్వ గురువులూ, ఆచార్యులూ ఇతర ప్రముఖులూ ఈ జగత్తు సృష్టికీ, విశ్వవ్యాప్తికీ మూలకారణంగా అభివర్ణించిన శక్తిస్వరూపిణి . సాక్షాత్తూ భైరవుడి చేతనే కొలవబడి నదట. ఎల్లప్పుడూ ఆనందంతోనూ, ఉల్లాసంతోనూ ఉండే ఈ పర్వతరాజ తనయ సుమ బాణదారి శత్రువు అయిన శివుని వల్ల కీర్తించబడినది.అంతే కాదు జ్ఞాన మనే సముద్రంలో అమృతం వంటిది అంటారు.
చరణం: దీన జనార్తి ప్రభంజన రీతిగౌరవే, దేశిక ప్రదర్శిత చిద్రూపిణీ నటభైరవే.
ఆనందాత్మానుభావే అద్రిరాజ సముద్భవే.... సూన శరారి వైభవే జ్ఞాన సుదార్నవే శివే .. {శ్రీ}
అన్నిరకాల సంకల్పాలనే కాదు, వికల్పాలను కూడా తీర్చగలిగే శక్తివి నీవు అంటారు.ఎంతో గొప్పవారైన వారు కూడా సేవించే ఆదిశక్తివి నీవు, ఆదిగురువులకు కూడా శక్తినీ, స్పూర్తినీ ఇచ్చే తల్లివి, సమస్త సంకటాలను తీర్చే దానివి, గురుగుహుడికి ( దీక్షితార్) ఎంతో అనుకూల మైనదానివి. సృష్టి, స్థితి లయలకు మూల కారణమైన దానివి..నీ మహిమలచేత, గొప్పదనం చేత త్యాగరాజ స్వామిని మైమరపించినదానివి..బంగారు వలువ ధరించిన కృపామయమైన మనసు కలిగిన శంకరివి. కలువరేకులవంటి విశాల నేత్రాలు కలిగి, పద్మ రాగ మణి మాలతో శోభిల్ల్లుతూ శంకరునితో కీర్తించ బడుతూ, సదా సుమధురమైన సంగీతంతో విరాజిల్లే శారదవి అని కీర్తిస్తారు.
చరణం: సంకల్ప వికల్పాత్మక చిత్తవృత్తి జాలే, సాధు జనారాధిత సద్గురు కటాక్ష మూలే
సంకట హర ధురీణాతర గురుగుహానుకూలె, సమస్త విశ్వోత్పత్తి స్థితి లయాదికాలే
విటంక త్యాగరాజ మోహిత విచిత్రానుకూలె, శంకరి కృపాల వాల హటకా మయ చేలే
పంకజ నాయన విశాలే పద్మరాగ మణిమాలే, శంకర సన్నుత జాలే, శారదా గాన లోలె.. {శ్రీ}
ఎంతో భావోద్వేగంతో, అమ్మవారిని అణువణువూ ప్రస్తుతిస్తూ సాగే ఈ కీర్తన చాలా, చాలా బావుంటుంది. శ్రీ ముత్తు స్వామి దీక్షితార్ ఎప్పటిలాగే రకరకాలుగా అమ్మవారిని ప్రస్తుతిస్తూ, సంస్కృతంలో రాసిన గీతం ఇది.ఎన్ని సార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది. శ్రీ బాలమురళి పాడిన కీర్తన ఇదిగో. శ్రీ టీ.ఎం. కృష్ణ పాడినది ఇక్కడ
ఇదే రాగంలో చేసిన 'నన్ను విడచి కదలకురా' అన్న త్యాగరాజ కృతి కూడా ఎంతో బావుంటుంది..నాకు చాలా ఇష్టం. ఇది నేను మొదటి సారి విద్వాన్. శ్రీ సంజయ్ సుబ్రహ్మణ్యం గారి కచేరీ లో విన్నాను. ఆ తర్వాత మహా విద్వాన్. మహారాజపురం సంతానంగారిది, భక్త పోతన సినిమాలో చిత్తూరు నాగయ్యగారు పాడినదీ కూడా.. అన్నీ బావుంటాయి.
ఇక ఈ రాగం లో చేసిన కొన్ని సినిమా పాటలు.
1 . శేష శైలా వాస.. శ్రీ వెంకటేశా.. వెంకటేశ్వర మహాత్మ్యం (పల్లవి)
2 . రామా కనవేమిరా..... స్వాతి ముత్యం
3. కొంటె చూపుతో.. అనంతపురం 1980
4 . అందాల రాక్షసివే- ఒకే ఒక్కడు
4 . అందాల రాక్షసివే- ఒకే ఒక్కడు