లాలి పాటకీ, మనకీ ఉన్న అనుబంధం మాటల్లో చెప్పలేము.. అమ్మ తరవాత మనతో అంతగా మమేకమైనది అమ్మ పాడే లాలేనేమో. ఈ భూమి మీద మనలో చాలా మంది ప్రయాణం "జో అచ్యుతానంద" అనో "రామా లాలీ" అనో మొదలవుతుందంటే అతిశయోక్తి కానే కాదు. "నువ్వు నాకు నచ్చావ్" సినిమాలో చెప్పినట్టు ఇలా అంటే ఇలా నే కాదు.. మన తెలుగు వారికి ఇలా అయితే.. ఇతర భాషల వారికి వారి, వారి జోల పాటలతో అన్నమాట. :)
"జో అచ్యుతానంద" అన్నది అన్నమాచార్య కృతి అని చాలా రోజుల వరకూ నాకు తెలియదు.. ఎవరో అమ్మలే కనిపెట్టి ఉంటారు అనుకునేదాన్ని.. నిజంగా చాలా మంచి కీర్తన. 'రామా లాలీ' అనే పాట నిజంగా శ్రీ రాముడికి అతని తల్లులు పాడారో, లేదో తెలియదు. కానీ పౌరాణికాలని అత్యంత అద్భుతంగా తెరకెక్కించే మన సినిమాలలో చూపిన విధానం నా మనసుకెంతో హత్తుకుపోయింది. పైనుంచీ వేళ్ళాడే బంగారుగొలుసుల ఉయ్యాలలూ, వాటిల్లో చిన్న చిన్న పట్టు పంచెలు కట్టుకుని, ముత్యాల హారాలు వేసుకుని, చంద్రవంక లాంటి బొట్లు పెట్టుకుని ముద్దుగా, బోసి నవ్వులు నవ్వుతున్న నలుగురు పిల్లలూ.. రామాలాలీ పాడుకున్నప్పు డల్లా కళ్ళ ముందు కదులుతూనే ఉంటారు. ఆ తరవాత అనేక చిత్రాలలో రకరకాల లాలి పాటలూ, జోల పాటలూ వచ్చాయి.. ఎన్నో మంచి పాటలు.. మర్చిపోలేని పాటలు. అలాంటి మూడు పాటల గురించే ఇదిగో ఈ చిన్న టపా.. మూడు పాటలనీ స్వరపరిచినది శ్రీ ఇళయరాజా కావడం విశేషం.. ఇది పూర్తి చేసేవరకూ నేనూ గమనించలేదీ విషయం.
1. లాలీ లాలీ : ఈ మధ్యన వచ్చిన లాలి పాటల్లో అగ్ర స్థానాన్ని పొందిన పాటల్లో ఇది తొలి వరసలో ఉంటుంది అని చెప్పడం అతిశయోక్తి కాదు. డా. సినారె కలం నించి జాలువారిన ఈ పాట ఎంత సరళంగా ఉంటుందో, అంత మధురంగా వినిపిస్తుంది.. లాలి పాట పాడి బిడ్డని నిద్రపుచ్చే ప్రతీ తల్లీ తన బిడ్డ వటపత్రశాయి అనే అనుకుని వరహాల లాలి పోస్తుంది, ఈ పాట పల్లవిలో అలాంటి రత్నాల లాలులూ, ముత్యాల పగడాల లాలలూ పోస్తారు సినారేగారు.
మొదటి చరణం లో బిడ్డ లోకాలనేలే పరమాత్ముడైనా అమ్మ జోల వినకుండా పెరగడు అన్న భావాన్ని ధ్వనింప చెయ్యడమే కాక ఎంత పెరిగినా పిల్లవాడు తల్లి కంటికి పసిపాపే సుమా! అన్న భావన వినిపిస్తారు. కళ్యాణ రామునికి కౌసల్య లాలీ.. యదువంశ విభునికి యశోద లాలీ అంటూ.. ఇదే భావాన్ని మరొక సినీ కవి ఇలా చెప్తారు. "అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కటే. అవతార పురుషుడైనా ఒక అమ్మ కు కొడుకే" అని..
ఇక రెండో చరణంలో వివిధ వాగ్గేయ కారులు తమ ఇష్ట దైవానికి ఎలా జోలలూ, లాలలూ పాడారో అని ప్రస్తావిస్తారు. అలమేలు పతికి అన్నమయ్య లాలి పాడితే, కోదండ రాముడికి కంచర్ల గోపన్న పాడాడంటారు, కర్నాటక సంగీత త్రిమూర్తులలోని శ్యామ శాస్త్రి గారినీ, త్యాగరాజ స్వామిని గుర్తుకు తెస్తారు. 'ఉత్సవ సాంప్రదాయ కీర్తనలో' త్యాగరాజస్వామి చాలా మధురమైన లాలిపాటలు రాసారు, పాడారు. "రామా శ్రీరామా లాలీ", ఉయ్యాలలూగవయ్యా", "మల్లెపూల పాన్పు మీద" లాంటివి.
సుమధురంగా లయ రాజు 'ఇళయరాజా' గారు స్వరపరచిన ఈ పాటని మధురగాయని శ్రీమతి పీ. సుశీల గారు కమనీయంగా, వీనులవిందుగా పాడారు
సుమధురంగా లయ రాజు 'ఇళయరాజా' గారు స్వరపరచిన ఈ పాటని మధురగాయని శ్రీమతి పీ. సుశీల గారు కమనీయంగా, వీనులవిందుగా పాడారు
ఇక చిత్రీకరణ గురించి చెప్పనే అక్కరలేదు. కాళ్ళమీద పడుక్కోబెట్టుకుని నలుగు పెట్టి స్నానం చేయించడం, సాంబ్రాణి పొగ వేసి ఉయ్యాలలూపడం, గొడుగు పెట్టి మరీ నిద్ర పుచ్చడం అన్నీ ఎంతో సహజంగా ప్రతీ ఇంట్లో జరిగేవే అన్నట్టుగా చూపిస్తారు. ఎంతో సాత్వికమైన అభినయాన్ని కనపరుస్తారు శ్రీమతి. రాధిక.
చిత్రంలో మొదట తల్లి పాడిన లాలి పాటను తెలుగు వారందరూ గర్వపడే ప్రముఖ కవి, జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత డాక్టర్. శ్రీ. సి. నారాయణ రెడ్డి గారు రాస్తే, చివరలో కధానాయక మరణించే సన్నివేశంలో వచ్చిన చిన్న కొనసాగింపు శ్రీ సిరివెన్నెల గారు రాసారు. ఈ సినిమా విడుదలైన తరవాత పుట్టిన తెలుగు పిల్లలందరూ ఈ జోల పాట చెవులా రా విని, కళ్ళనిండా నిద్ర పోయి ఉంటారు అన్నది చాలా నిజం.
చిత్రంలో మొదట తల్లి పాడిన లాలి పాటను తెలుగు వారందరూ గర్వపడే ప్రముఖ కవి, జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత డాక్టర్. శ్రీ. సి. నారాయణ రెడ్డి గారు రాస్తే, చివరలో కధానాయక మరణించే సన్నివేశంలో వచ్చిన చిన్న కొనసాగింపు శ్రీ సిరివెన్నెల గారు రాసారు. ఈ సినిమా విడుదలైన తరవాత పుట్టిన తెలుగు పిల్లలందరూ ఈ జోల పాట చెవులా రా విని, కళ్ళనిండా నిద్ర పోయి ఉంటారు అన్నది చాలా నిజం.
2. లాలిజో..లాలిజో : సాధారణంగా లాలి పాటలు అమ్మలు పాడినట్టే చూపిస్తారు మన చిత్రాలలో ఎందుకంటే నిజ జీవితంలో కూడా అలాగే జరుగుతుంది కనక. నాన్నలు పాడే లాలి పాటలు లేవని కాదు కానీ అవి సాధారణంగా సెంటిమెంట్ పెంచడానికి వాడుతూ ఉంటారు.. ఉదా: సినిమాలలో తల్లి లేని పిల్లలకిల తండ్రులు పాడుతూ ఉండడం అలాంటివి అన్నమాట. ఐతే 'ఇంద్రుడు -చంద్రుడు 'సినిమా లోని ఈ పాట చాలా ప్రత్యేకమైనది అని నా అభిప్రాయం. ఇది కేవలం తండ్రి పాడే జోల మాత్రమే కాదు, తాను గతంలో చేసిన తప్పులు తెలుసుకుని భార్యనీ, పెద్ద పిలల్లనీ క్షమించమని అడగలేని పరిస్థితులలో అందరికంటే చిన్నపిల్లకి చెప్తున్నట్టుగా తనకి తనే చెప్పుకునే మాటల్లాంటి పాట ఇది.
పల్లవి లో' పారిపోనీకుండా పట్టుకో నా చేయి ' అంటూ తనకి తనవారైన వారితోనే ఉండాలన్న్న బలమైన కోరిక ని చెప్తాడు. అంతేకాదు బుద్దిగా కాపురం చేసుకుంటున్న ఒక పావురం ఎలా గతి తప్పిందో చెప్తాడు.
మొదటి చరణం లో దానిని కొనసాగిస్తూ.. మాయని నమ్మి, బోయవాడిని కోరిన ఆ పావురం దాపునే ఉన్న ముప్పును ఎలా చూసి, తెలుసుకొని గండాన్ని తప్పించుకుంది ( కనీసం తప్పించుకున్నాను అని అనుకుంది ) అంటూ.. ఇంటిలో చోటుందా చెప్పవే పాపాయి అని కూతుర్ని దీనంగా అడుగుతాడు. తన ఇంట్లో తనకి చోటు లేదనీ, ఉండదనీ కాదు, ఆ చోటు తనదే అని చెప్పుకోగల అర్హత తనకి నిజంగా ఉందా అన్నది భావన కావచ్చు.. శాస్త్రి గారి కలంలోంచి రాని భావన ఉంటుందా? చిన్న, చిన్న పదాలతో గొప్పభావాలని తట్టి లేపడమే ఆయన ప్రత్యేకత.
రెండో చరణంలో ఇప్పటి వరకూ పావురం పేరున చెపుతున్నది కధ తనదే అని ఒప్పుకున్నట్టుగా సాగుతుంది. పిల్లలూ , ఇల్లాలూ తనవల్ల గుండెల్లో బండలు మోస్తూ ఎంత క్షోభ పడ్డారో, నేరం తాను చేస్తే అభం , శుభం తెలియని వారు ఎలా శిక్ష ని అనుభవించారో అని బాధ పడతాడు. దానికి పరిహారంగానే "తండ్రినే నేనైనా దండమే పెడుతున్నా నంటాడు. తల్లిలా మన్నించూ, మెల్లగా దండించూ.". అంటాడు. "ఏ తల్లికైనా మెల్లగా మాత్రమే దండిచడమే తెలుసు.". అని అభిప్రాయమేమో. అందుకే.. తను చేసిన తప్పులకి అమ్మ పెద్ద మనసుతో ఇచ్చే మెల్లని దండన సరిపోదనో, ఏమో.. తరవాత "కాళి లా మారమ్మా, కాలితో తన్నమ్మా" అంటూ . అప్పుడైనా పెడదారి పట్టిన నా 'బుద్ధిలో లోపాలు దిద్దుకోగలనేమో 'అని కుమిలిపోతాడు. కంటతడి పెట్టించే సాహిత్యం, అభినయం.
ఒక చిన్న పాటలో చిత్ర కధనంతా ఇమిడి పోయేలా చెయ్యడం శ్రీ సిరివెన్నెల గారికి వెన్నతో పెట్టిన విద్య. అది ఇందులో ఆద్యంతమూ కనబడి, వినబడుతుంది.. సమయానికీ, సందర్భానికీ తగ్గట్టు రాసిన ఈ మాటలు తప్ప , మరేమీ ఇక్కడ నప్పనే నప్పవు అన్నట్టు గా సాగే పాట ఇది. దానికి జతగా తోడైన మరో రెండు మణి భూషణాలు.. ఒకటి స్వరజ్ఞాని రాజా గారి సంగీతం రెండోది ఆ పాత్ర ధరించిన శ్రీ కమల్ హాస నే పాడారేమో అన్నంత గొప్పగా ఆలపించిన గాన గంధర్వుడు శ్రీ బాలు గారి గానం.దానికి తోడేమో అనితరసాధ్యమనిపించే కమల్ హాసన్ గారి అభినయం. మొత్తమ్మీద మరిచిపోలేని మధుర గీతం..
౩. ఓ పాపా లాలి: అమ్మలూ, నాన్నలూ తమ చిన్నారులకి పాడే లాలి పాటలు చాలా కమనీయంగానూ, కామన్ గానూ ఉంటాయి అని ముందే చెప్పుకున్నాం కదా. అల్లన్తికోవకి చెందని, ఇది ఒక ప్రత్యేకమైన పాట, తన ప్రేయసికి ప్రియుడు పాడే పాట గానే మాత్రమే కాదు , సందర్భానికి తగ్గట్టుగా మధురంగా వినిపించే పాట ఇది. ప్రముఖ దర్శకుడు శ్రీ మణి రత్నం గారు దర్సకత్వం వహించిన ఒకే ఒక్క తెలుగు సినిమా ( ఇప్పటివరకూ) "గీతాంజలి" చిత్రంలోది. మరణానికి చేరువలో ఉన్న తన స్నేహితురాలికి మిగిలి ఉన్న కొద్ది రోజులూ ఏ రకమైన కలతలూ, కన్నీళ్ళూ లేకుండా హాయిగా గడవాలని తపన పడే ఒక ప్రేమికుడు అదే విషయాన్ని ప్రకృతికి కూడా వినిపించడం ఈ పాట నేపధ్యం.
తొలిగా పల్లవిలోనే 'ఈ జన్మకంతా సరిపడేలా లాలి' పాడనా అంటూ ప్రారంభమవుతుంది. మొదటి చరణం లో గాలిని కూడా సన్నగా వీచమని అడుగుతాడు.. గుండె సవ్వడి కూడా సన్నగా వినిపిస్తే బావుంటుంది అనుకుంటూ, జీవితంలో ఏమీ చూడని, అనుభవించని, కన్న కలలారని పసి పాపకి తడి నీడలు పడేలా కన్నీళ్ళతో నింప వద్దని చేపల్లాంటి ఆమె కళ్ళని బ్రతిమాలుతాడు. అన్నింటికీ ఒకే అర్ధం.. ఆమె కి మిగిలిన జీవితాన్ని ప్రశాంతంగానూ, సంతోషంగానూ ఉండేలా చూడాలని చెప్పడం.
రెండో చరణంలో కూడా దాదాపుగా ఇదే భావాన్ని మరికొన్ని మధురమైన మాటలతో పొందుపరిచారు. మేఘాన్ని ఉరమద్దంటూ, కోకిలమ్మని తన పాట పాడమంటాడు, తీయని తేనెలు చల్లమంటాడు. ఇరు సందెలు కదలాడే ఎద ఊయల ఒదిలో తనను దాచుకున్నాను, అంటూ, తరవాత లైనులో సెలయేరుల అలా పాట కూడా వినిపించనంత ప్రసాంతత లో దాచుకున్నాను మీరు కూడా అలాగే ఉండనివ్వండి అని చలి ఎండకీ, సిరి వెన్నెలకి మనవి చేస్తాడు. ఇక్కడ ఇరు సందె లు కదలాడే ఎద అంటే జననమూ మరణమూ అనే రెండు సందెలూ అనుకుంటాను నేను, ఎద కదలికల ఫలితమే కదా ఏ సందైనా. సినిమా కధ ప్రకారం గా నాకలా అనిపించిందేమో..
మహాకవి శ్రీ వేటూరి రాసిన ఎన్నో మధురమైన గీతాలలో ఇది ఒకటి. పాటంతా ఒకే భావాన్ని వివిధ రకాల మాటలతో, అనుభూతి చెదరకుండా చాలా చక్కగా చెప్తారు. బంగారానికి పరిమళం అబ్బినట్టుగా ఉండే ఇళయరాజా గారి సంగీతం, బాలూ గారి గానం పాట భావాన్నీ, మూడ్ ని ప్రతిబింబిస్తాయి. మంచుపూల మధ్యన, ఎంతో మృదువుగా చిత్రీకరించిన మంచి పాట ఇది. ఈ చిత్రం విడుదల అయ్యాకా "గీతక్కా", "ఏం?" లాంటి మాటలు ఎంత ప్రాచుర్యం పొందాయో అంతకు రెట్టింపు పేరు పొందాయి ఈ చిత్రం లోని పాటలు..
మహాకవి శ్రీ వేటూరి రాసిన ఎన్నో మధురమైన గీతాలలో ఇది ఒకటి. పాటంతా ఒకే భావాన్ని వివిధ రకాల మాటలతో, అనుభూతి చెదరకుండా చాలా చక్కగా చెప్తారు. బంగారానికి పరిమళం అబ్బినట్టుగా ఉండే ఇళయరాజా గారి సంగీతం, బాలూ గారి గానం పాట భావాన్నీ, మూడ్ ని ప్రతిబింబిస్తాయి. మంచుపూల మధ్యన, ఎంతో మృదువుగా చిత్రీకరించిన మంచి పాట ఇది. ఈ చిత్రం విడుదల అయ్యాకా "గీతక్కా", "ఏం?" లాంటి మాటలు ఎంత ప్రాచుర్యం పొందాయో అంతకు రెట్టింపు పేరు పొందాయి ఈ చిత్రం లోని పాటలు..