Thursday, March 31, 2011

వచ్చిన భాష.. రాని భాష..?

వచ్చిన భాష ఏది? రాని భాష అంటే ఏమిటి? ఈ విషయం నాకు అర్ధం కావడం లేదు ఈ మధ్యన. కన్ప్యూసింగ్ గా ఉంది కదూ.నాకు తెలిసిన  భాషలో అర్ధం అయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తాను. మనం చాలా సార్లు ఈ ప్రశ్నని ఎదుర్కొంటూ ఉంటాము, చాలా సార్లు అప్లికేషన్ లలో కూడా రాయవలసి ఉంటుంది కూడానూ. అందుకని దీని సంగతి తెలుసుకుంటే మంచిది కదా, అని అనిపించి ఇలా ఇది రాసేస్తున్నానన్నమాట. 

        



          మన  తెలుగువారికి తెలుగు వచ్చిన భాష అనుకుందామా,  అంటే ఈ మధ్యన అది నిజంలా అనిపించడం లేదు. 'వాచ్ చేస్తున్నారా?', బాత్ తీసుకున్నారా? ఒకసారి డ్రాప్ ఇన్ అవ్వండి మీరు,   మా ఇంటికి.. చాలా పుల్ డౌన్ చేసారు రీసెంట్ గా  ఇలాంటివన్నీ వింటుంటే.. ఇవి తెలుగు వాక్యా లేనా?  అనిపిస్తోంది , , నిజం.. సినిమాలలో సంభాషణాలు కూడా ఇలాంటివే రాస్తున్నారు కూడాను.
చిన్నప్పుడు మా నాన్నగారు అనేవారు. ఈ మధ్యన అందరూ ఇంగ్లీష్ మీడియం పిల్లలు.. వీళ్ళకి పాపం ఇంగ్లీష్ పూర్, హిందీ నిల్, తెలుగు వీక్ అని.. నిజంగానే అలా కనిపిస్తోంది.. . పైన చెప్పిన లాంటి తెలుగూ ఇంగ్లీషూ కాని మరికొన్ని వాక్యాలు చూడండి.

  • నేను అలాంటి నకరాలు అస్సలు స్టాండ్ చెయ్యలేను ( I can't stand such antics అని అర్ధం చెప్పుకోవచ్చేమో)
  • నేను విండో ప్లేస్ కోసం చాల పర్టికులర్ 
  • నాకు చైల్డ్ హుడ్ నించీ మేన్గో లంటే లైకింగ్ ఎక్కువ
  • నేను రోజూ ఆఫీస్ కి వెళ్ళడానికి బస్ తీసుకుంటావా? ఇలాంటివన్నమాట. 
ఇవి తెలుగు వాక్యాల్లా కనిపించే పూర్తిగా తెలుగు కాని వాక్యాలు.. 
ఇప్పుడు ఇంకోరకం చూద్దాం.
  • I went by bus. car means very costly. why unnecessary burden therefore - ఐ వెంట్ బై బస్. కార్ మీన్స్ వెరీ కాస్త లీ.   వై.. అన్ నేసేసరీ బర్డెన్ దేర్ఫోర్.. ( అంటే.. కార్ ఐతే ఎక్కువ ఖరీదు అవుతుంగి కదా అని బస్ లో వెళ్లాను.. అనవసరమైన భారం ఎందుకు అని కాబోలు)
  • Morning, morning big fight in my house between mrs. and me. మార్నింగ్ మార్నింగ్ బిగ్ ఫైట్ ఇన్ మై హౌస్ బిట్వీన్ మిసెస్ అండ్ మీ.. ( పొద్దున్నే మా ఇంట్లో నాకు మా ఆవిడకీ పెద్ద గొడవ) 
  • The street gundas damaged all the property.. what else work they have? ది స్ట్రీట్ గుండాస్ డేమేజేడ్ ఆల్ ది ప్రాపర్టీ ..  వాట్ ఎల్స్ వర్క్ దీ హావ్? ( ఇంకేం పని ఉంది వారికి అనే అర్ధం)
  • We have kept the god during the ganesh navaratri. We will leave him on fifth day. వి హేవ్ కెప్ట్ ది గాడ్ డ్యూరింగ్ గణేష్ నవరాత్రి.. వి విల్ లీవ్ హిం ఆన్ ఫిఫ్త్ డే. ( వినాయకుడిని పెట్టాము, ఐదో రోజున విసర్జిస్తాము/నిమజ్జనం చేస్తాము)
  • Now where he is? నౌ వేర్ హీ ఇస్ ( అబీ కహా హాయ్ వో? అన్నమాట) 
ఇలాంటివి.. ఇవి ఇంగ్లీష్ లా కనిపించే ఇంగ్లీష్ కాని వాక్యాలు.. 
వీటిల్లో మన మాతృభాష ప్రభావం ఎంత ఉంటుందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది..  ఎంత అలవోకగా, సునాయాసంగా మనం ఇలాంటివి మన రోజు వారీ పనులలో వాడేస్తూ ఉంటామో. ఎవరో విదేశీయులు వీటిని అర్ధం చేసుకోలేక కష్టపడినప్పుడు మనకర్ధం అవుతుంది.. విదేశీయులంటే గుర్తు వచ్చింది.. ఆ మధ్య మా అమెరికన్  కొలీగ్ ఒకా విడ  ఇక్కడకి వచ్చినప్పుడు టాక్సీ ఎక్కింది.. వాళ్ళిద్దరికీ మధ్యన సంభాషణ ఇలా జరిగిందిట. ఇలా విదేశీయులు వచ్చినప్పుడు కావేరీకో, కాటేజీ ఎంపోరియం లకో, బట్టలకైతే ఫాబ్ ఇండియా కీ తీసుకెళ్లడం టాక్సీ వాళ్ళకీ అలవాటే.. 

అక్కడ ఇంకో డ్రైవర్ కనపడితే ' బ్రదర్ ఎలా ఉన్నావు? అని అడిగాడుట ఇతను కన్నడం లో..
ఆవిడ బ్రదర్ అన్న మాట విని.. ఆతను మీ బ్రదరా? అని అడిగిందిట..
దానికి మన డ్రైవర్.. నాట్ ఓన్. కజిన్ బ్రదర్.. అన్నాడుట.. ఆవిడకి అర్ధం కాలేదు.. ఓన్ బ్రదర్ అంటే? అందిట.  ఇతనికి అంతకంటే చెప్పడానికి రాలేదు. మెల్లిగా తన పిన్ని కొడుకు అని చెప్పాడుట..
వాళ్ళ మదర్ కి వంట్లో అసలు బాగాలేదు.. అందుకే పలకరించాను అని చెప్పడానికి.. హిస్ మదర్ సీరియస్ అన్నాడుట.
దానికావిడ సీరియస్ అబౌట్ వాట్ అంది.. అది అతనికి అర్ధం కాలేదు.. హాస్పటల్, కేన్సర్ ఇలాంటి పొడి మాటలతో ఆవిడకి కొంచం అర్ధం అయ్యేట్ల చెప్పాడు.
ప్లీజ్ డోన్ట్ మిస్టేక్ మీ.. ఐ నో.. లిటిల్ లిటిల్ ఇంగ్లీష్ అన్నాడుట.. ఆవిడ మర్నాడు మా అందరికీ చెప్పి నవ్వి, అతని ఉత్సాహాన్నీ, అర్ధం అయ్యేలా మాట్లాడాలన్న సంకల్పాన్నీ ఎంతో  మెచ్చుకుంది..ఇక్కడ ఆతను మాట్లాడినవన్నీ అందరూ రోజువారీగా మాట్లాడేవే.. 'ప్లీజ్ డోంట్ మిస్టేక్ మీ' తో సహా.. :)
కొన్ని మాటలు వాడగా వాడగా రైటయిపోతాయి..  మనుగడ లోకి వచ్చేస్తాయి.. ముందు లేకపోయినా.. ఉదా; prepone, updation, googled ఇలాంటివి.. 


భాష గురించి మాట్లాడటం మొదలు పెట్టాకా T.V.. . వాళ్ళగురించి మాట్లాడకుండా ఎలా? మొన్నెప్పుడో ఒక వంటల ప్రోగ్రాం లో బామ్మ వంట, తాతమ్మ వంట అంటూ ఒక విభాగంలో అక్కరలేని ఓవర్ ఆక్షన్ చేస్తున్న యాంకరమ్మ ఒకావిడ ని అడిగింది.. బామ్మా, ( అక్కడ వంట చేస్తున్నావిడకి గట్టిగా మాట్లాడితే అరవై ఏళ్ళు ఉండకపోయినా సరే మాటకి ముందో బామ్మా, వెనకో బామ్మా చేర్చి  మాట్లాడుతూ ఉంటారు ఈ పిల్లలు) మీ కెందరు  పిల్లలు? ఎక్కడుంటారు? అని అడిగింది
దానికి .. ఇద్దరు కొడుకులూ,, ఒక కూతురు.. అన్నారావిడ .
వాళ్ళంతా ఎక్కడ ఉంటారు? మీ దగ్గరేనా? ఈవిడ ప్రశ్న
దానికా పెద్దావిడ..కొడుకులు హైదరాబాదో అని  ఏదో చెప్పి .. వాళ్ళింట్లో వాళ్ళు.. మా ఇంట్లో మేము.. ఉన్నాము.. అవసరమైనప్పుడు మేము వెళ్తాము, వాళ్ళు వస్తారు అన్నారు..
అంతేనా? హ హ హ.... ఇండివిడ్యువాలిటీ అన్నమాట.. డిపెండబుల్ కాదు అన్నమాట మీరూ, తాతగారూ.. అని అక్కర్లేని వెర్రి నవ్వుతూ  అంది ఆ అమ్మాయి...
ఆ అమ్మాయికి dependents కీ, dependable కీ తేడా  తెలీదా? ఒక వేళ కార్యక్రమం  చక్కగా చెయ్యాలనే ఆత్రం తో పొరపాటున అన్నా తరవాత ఎడిటింగ్ సమయంలోనైనా గమనించరా? అనుకున్నాను.
ఇలాంటివే.. గార్నీష్ కి, కంఫర్ట్ గా చేస్తారా? రిలాక్సా? రియల్ ఆ? లాంటివి..ఇతర కార్యక్రామాలో ఇంకా బోలెడన్ని ఇలాంటివే. 

ఇలాంటి రకరకాలు చూసాకా నాకు వచ్చిన సందేహం ఇదన్నమాట.. మనకి వచ్చిన భాష ఏది? రాని భాష ఏది? అన్నీ వచ్చీ రాని భాషలేనా? వస్తూ వస్తూ ఉన్న భాషలేనా? రాకుండానే వచ్చాయి అనుకున్న భాషలా అని.. మా అబ్బాయేమో.. గుడ్ మా. హైబ్రిడ్ లేన్గ్వేజేస్ అంటున్నాడు మరి.. మీరేమంటారు? ఇలాంటి ఉదాహరణలు మీ దగ్గర కూడా ఉంటే నాతొ పాటు అందరికీ చెప్పేయండి. ఓ పని అయిపోతుంది..


P.S: ఇది ఇప్పుడు వినబడుతున్న భాషా వ్యవహారాన్ని చూసి రాసినదే కానీ ఎవరినీ ఉద్దేసించి కాదు.
     

Tuesday, March 29, 2011

భూదేవి కొక్క గంట...

          వేల దేశాలలో, లక్షల కొలదిగా ఉన్న ఊర్లలో కోట్లాదిమంది ప్రజలని, వారి భారాన్నీ మోస్తున్న భూదేవి కి ఏడాదికి ఒక్క గంట మనవంతు కృతజ్ఞత ప్రకటించడం, ధన్యవాదాలు చెప్పడమే ఈ ఎర్త్ అవర్ అని నా అభిప్రాయం. అది  అమలుపరచడం అంత కష్టమా? కానిపనా? ఏమో మరి.
       మా అపార్ట్మెంట్  లో ఉన్న 144 ఇళ్ళల్లో ఉన్న కొంతమంది ఉత్సాహవంతులం ఈ భూమి గంటను  మనందరం తప్పకుండా పాటించాలి అని నిశ్చయిన్చేసుకున్నం . అంతే కాదు,  మంచి మాట అందరికీ చెప్తే మంచిది కదా అని ఒకరంటే సరే అంటే సరే అనుకున్నాం. ఉన్న ఎనిమిది అంతస్తులనీ మాలో మేము సమానంగా పంచుకుని అందరికీ వీలయితే పర్సనల్ గా లేకపోతె ఇంటర్ కాం ద్వారానూ చెప్పి, దీనికి మనవంతు సహాయం చెయ్యాలని మా సంకల్పం. మాలో ఒకరు తయారు చేసి తెచ్చిన నోటీసులు అన్ని లిఫ్టు లలోనూ, నోటీసు బోర్డు లలోనూ  పెట్టాము. ( ఒక వైపు రాసిన కాగితాలే వాడాము సుమండీ). అపార్ట్మెంట్ యాహూ గ్రూప్ లో మెసేజ్ లు పంపించాం. ఇంక మిగిలింది వీలైనంత మందికి చెప్పడం.

         మొదట నేను ఫోన్ చేసిన ఒక ఫ్లాట్ ఆతను.. 'తప్పకుండా చేద్దాం అండీ, మనం ఇలాంటివన్నీ చాలా శ్రద్దగా పాటించాలి. గుర్తు చేసినందుకు మీకు థాంక్ యూ.. అన్నారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. మన ప్రయత్నాన్ని మెచ్చుకోవడమే కాదు, వారు అందులో పాలు పంచుకుంటాము అన్నందుకు.
       తరవాత ఇంకొకాయన 'మనందరం ఒక గంట ఆపేస్తే ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి పెరిగిపోతుందా?' అని వ్యంగ్యంగా అడిగారు. దానికి నాకు కొంత కోపం వచ్చిన మాట నిజం.. పెరగక పోయినా కనీసం మిగులుతుంది కదా అని ఫోన్ పెట్టేసాను.
         మరికొందరు మెచ్చుకున్నారు. కొందరేమో.. "మేడం మాకూ తెలుసు దీని గురించి.. మేమూ బాధ్యతా గల పౌరులమే.. మీరు  పని కట్టుకుని గుర్తుచేసెంత శ్రమ తీసుకోక్కరలేదు" అన్నారు. నాకు ఏమనాలో తెలియలేదు. "ఇలా మేమందరం ఒక గ్రూప్, ఈ మెసేజ్ అందరికీ చెప్పాలని మా ప్రయత్నం. మీరు మాలాగే ఆలోచిస్తున్నందుకు సంతోషం" అని చెప్పాను.
            మా గ్రూప్ లో మిగతావారికి కూడా ఇలాంటి అనేక రకాలైన అనుభవాలు ఎదురయ్యాయి. "గవర్నమెంట్ ఎలాగూ పవర్ కట్ విధిస్తోంది, అప్పుడు ఎన్నో గంటలు ఇస్తున్నాం, ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇవ్వక్కర్లేదు" అని కొందరంటే, "నాలుగేళ్ళకొకసారి వస్తుంది, క్రికెట్ మాచ్ చూడక్కరలేదా?" అని కొందరు అన్నారుట. ఇలా ఒక అరగంట ప్రయతించి వీలున్నంత వరకూ చెప్పాం. తరవాత ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళది అని వదిలేసాం. మొత్తానికి 75 % ఇళ్ళల్లో పాటించారని తృప్తి పడ్డాం.
        ఏ విషయం మీదైనా భిన్నాభిప్రాయాలు ఉండడం సహజం. ఉండాలి కూడా. కానీ ఇలాంటి వాటిల్లో కాదేమో. ప్రపంచమంతా కేవలం సంవత్సరానికి ఒక్క గంట కరంట్ వినియోగం మానేస్తే ( కనీసం వీలైనంత వరకూ తగ్గిస్తే) జరిగే మేలు మనందరికీ తెలుసు. అలాంటప్పుడు అది పాటిస్తే మనకి వచ్చే పెద్ద నష్టం ఏమంటుంది?
         ఇది మనకి ప్రత్యక్షం గా ఇప్పటికిప్పుడు కనిపించే మేలు కాకపోవచ్చు. కానీ దీర్ఘకాలంలో ఇలాంటి వెన్నో మనం క్రమం తప్పకుండాపాటించ డాన్ని  బట్టే మన మనుగడా, జీవిత విధానం ఆధారపడి ఉంటుంది అనేది కాదనలేని సత్యం. మన చేతిలో డబ్బు ఉండవచ్చు, కానీ కొనడానికి వనరులు లేకపోతే ఏం లాభం? వనరులు ఉన్నప్పుడు వివేకంగా వాడుకోకపోతే తరవాత ఎవరిని ఏమీ అనలేము. అది కోట్లకి పడగలెత్తి నెలకి లక్షల రూపాయల విధ్యుత్ కాల్చే కోటీశ్వరులైనా, కామన్ మాన్ అయినా సరే.. ఇది అందరూ పాటించవలసిన సూత్రం. నడుచుకోవలసిన మార్గం. లేకపోతే మన తరవాత తరం వారు కార్ల బదులు ఎడ్ల బళ్ళూ, జటకాలూ కొనుక్కోవాలి. తప్పదు.
          

తీయగా పాడే చిన్నారులు..

          బాలూ గారు నిర్వహించిన అన్ని పాటల కార్యక్రమాలనీ విడవకుండా చూడడం నాకు చాలా ఇష్టం. ఈ టీ వీ లో ప్రస్తుతం ప్రసారమవుతున్న చిన్నారుల ధారావాహికం 'పాడుతా తీయగా' చిన్నారుల చక్కని గాత్రాలతో, సరదాగానూ, సంస్కారవంతగానూ సాగే బాలూ గారి వ్యాఖ్యానంతో ఎంతో కమనీయంగా సాగుతోంది. అనవసరమైన డ్రామాలు కానీ, అక్కరలేని వ్యాఖ్యలు కానీ ఉండవు.
          .   వయసు లో చిన్నవారైనా, ప్రతిభలో ఏంతో  పెద్దవారిలా, చాలా అనుభవమున్నవారిలా పాడే ఆ చిన్న పిల్లలని చూస్తుంటే ముద్దుగా అనిపిస్తుంది,  మనసంతా ఏంటో చెప్పలేనంత సంతోషంతో నిండిపోతుంది.  కష్టమైన పాటలు నేర్చుకోవడమే కాదు, చాలా సార్లు పుస్తకం అవసరం లేకుండానే అలవోకగా పాడేస్తారు  వాళ్ళు. ప్రస్తుతం ఫైనల్ ఎపిసోడ్ లు జరుగుతున్న ఈ కార్యక్రమంలో లక్ష్మీ మేఘన, రాఘవేంద్ర, అంజనీ నిఖిల, గణేష్ రేవంత్ లు చిచ్చర  పిడుగుల్లా పాడుతున్నారు. అందరిదీ తలో రకమైన విలక్షణమైన శైలి.  ప్రతీ వారమూ నువ్వా, నేనా అన్నట్టుగా కనిపిస్తారు. చిన్న చిన్న తప్పులు చేస్తే చెయ్యవచ్చు గాక, వారందరూ పాడే విధానం మాత్రం చక్కగా ఉంటుంది.
            పాట ఎంత బాగా పాడతారో,  అంతే చక్కగా తోటివారికి అవసరం అయినప్పుడు తమ గళాన్ని కోరస్ గా పంచుతారు. అన్నింటికంటే నన్ను ఆకట్టుకునేది వారి పసితనం, అమాయకత్వం. ప్రతీవారం 'ఉజాల' వారిచ్చే 'ఉత్తమ గాయకుడు/గాయని బహుమతి అమ్డుకునేప్పుడు వారు కనబరిచే సంతోషం, హావభావాలు ఎంతో ముచ్చటగా ఉంటాయి. సొట్టలు పడుతున్న చిన్న బుగ్గల మీద విరిసిన ఆ నవ్వులు మళ్ళీ చూడాలని అనిపిస్తుంది. అలాగే పొరపాటున ఏదైనా తప్పు చేస్తే గభాల్న నాలుక కరుచుకుంటూ,  భుజాలెగరేసి అందరినీ పరీక్షగా చూడడంలాంటివి కూడా .
       ఇవన్నీ ఒక ఎత్తు బాలుగారితో మాట్లాడేటప్పుడు వారిచ్చే సమాధానాలు మరొక ఎత్తు. 'గణేష్ రేవంత్' బాలు గార్ల మధ్యన నడిచే సరదా సంభాషణ అందులో ఒకటి. ఆయన కవ్విస్తున్నట్టుగా ఏదో ఒకటి అనడం, దానికి ఆ అబ్బాయి తడుముకోకుండా, కొద్దిగా భయం భయంగానే సమాదాలు చెప్పడమూ.  అలాగే.. 'ఎన్నేళ్ళుగా సంగీతం నేర్చు కుంటున్నావు?  అని అడిగితె  నేను ఎల్.కే.జీ లో ఉన్నప్పటినించీ అంది లక్ష్మీ మేఘన . దానికి ఆయన నువ్వు ఎల్.కే.జీ ఎప్పుడు చదివావో నాకెలా తెలుస్తుంది ? అంటే ఇప్పుడు నేను సిక్స్త్ అంది ముద్దుగా,  అంటే మీరు లెక్కపెట్టుకోండి ఎన్నేళ్ళ నించీ  నేర్చుకున్తున్నానో  అన్నట్టు.. ఇలాంటివి పిల్లల్లో ఉన్న అమాయకత్వాన్నే, నిజమైన పసితనాన్నీ చూపిస్తాయి.
      చేత ఉలి ని పట్టి శిల్పాలని చెక్కిన శిల్పి  బాలుగారు. ఈ గాన గంధర్వ జక్కన్నగారి కార్యక్రమం  'పాడుతా తీయగా, పాడాలని ఉంది' ల  నించి వచ్చిన ఎందరో గాయనీ గాయకులూ ఎంతో పేరు తెచ్చ్సుకున్న ప్రముఖులయ్యారు. అలాగే ఈ చిన్నారులు కూడా రాణిస్తారు. అందులో సందేహం లేదు. ఇలాంటి మరిన్ని మంచి కార్యక్రమాలు ముందు ముందు కూడా రావాలని ఆశిద్దాం.
           

Tuesday, March 8, 2011

మహిళలూ- మణిదీపాలు (8 )

భారత రత్నాలు:   ముందుగా నా స్నేహితురాళ్ళందరికీ  నూరవ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. గత వారం రోజులుగా వివిధ రంగాలులో విఖ్యాతి గాంచిన భారతీయ మహిళలగురించి రాస్తూ ఉంటే ఎంతో ఉత్సాహభారితంగానూ, ఉద్వేగభరితంగానూ అనిపించింది. ఎక్కడ,  ఎవరితో మొదలుపెట్టి ఎక్కడ ముగించాలో కూడా తెలియలేదు. కొన్ని నెలలు కొనసాగితే ఇలాంటి ఎందరో  ధీరవనితలకి న్యాయం చేసినట్టు అవుతుందేమో అనిపించింది. ఇక ఈ రోజు కొసమెరుపు ..... ఎవరిగురించి రాద్దామా? అని ఆలోచిస్తూ ఉంటే అరుదైన మన ఈ ఐదుగురు  భారత రత్నాలు మనసులో మెదిలారు. ఇలాంటివారిని మరలా  గుర్తు చేసుకోవడం కంటే నా ఈ టపాల క్రమానికి సార్ధకత వేరే ఉంటుందా ?అనిపించింది..అందుకే ఈ పోస్ట్ ఇలా....
1 . మదర్ థెరీసా : మానవతకీ, పేదల, దీనుల సేవకీ తిరుగులేని  మారుపేరుగా, ప్రపంచ వ్యాప్తంగా  ప్రేమనీ, సేవ తత్పరతనీ పంచిన కరుణామయిగా అందరి మనసుల్లోనూ చిరస్మరణీయురాలు  మదర్ థెరీసా. ఎక్కడో ఆల్బేనియా లో పుట్టి (26 ఆగస్ట్, 1910 ) , ఆ తరవాత భారతీయ పౌరసత్వం పొంది కోల్ కత్తా లో 'మిషనరీస్ అఫ్ చారిటీ' అనే సంస్థని స్థాపించి వారూ, వీరూ అని తేడా లేకుండా పేదలూ, రోగులూ, దీనులూ, అన్నార్తుల సేవలో నలభై ఐదు సంవత్సాలకు పైగా గడిపిన మానవతామూర్తి మదర్. అందుకే ఆమెకు పోప్ 'సెయింట్ హూడ్'  ప్రకటించారు. ఆమె గరిపిన సేవకూ, చూపిన కరుణకూ ఆమెకు దక్కని పురస్కారం లేదు. నోబుల్ శాంతి బహుమతి తో సహా అన్నీ అమ్మకు లభించాయి. భారత ప్రభుత్వం కూడా 1980 లో మన దేశంలోనే అత్యంత ప్రతిష్టాకరమైన 'భారత రత్న' పురస్కారాన్ని  ప్రకటించి తనను తానే గౌరవించుకుంది. ఏనాడూ తనకోసం కాక పరసేవ లోనే జీవితమంతా  గడిపిన  మదర్   5 సెప్టెంబర్ 1997 న పరమపదించారు.
2 .శ్రీమతి  అరుణా అసఫ్ ఆలీ :  పేరెన్నిక గన్న స్వాతంత్ర సమర  యోధులైన మహిళలలో అరుణా అసఫ్ ఆలి అత్యంత ప్రముఖులు. పంజాబ్ లోని కాల్కా లో జూలై 16 , 1909 న అరుణా గంగూలీ గా జన్మించిన అరుణ క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా ముంబాయ్ లోని గోవాలియా టాంక్ మైదానం లో భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసిన మహిళగా చిరస్మరణీయురాలు. స్వాతంత్రోద్యమ కాలంలో ఉప్పుసత్యాగ్రహం లోనూ, క్విట్ ఇండియా ఉద్యమంలోనూ అరుణ చూపిన సాహసమూ, నాయకత్వ ప్రతిభా భారత స్వాతంత్ర చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోతాయి అనడం లో సందేహం లేదు. భారత ప్రభుత్వం అరుణా  ఆసఫ్ ఆలీ కి ఆమె మరణానంతరం (జూలై 29 , 1996 ) 1997 లో వీరికి 'భారత రత్న" పురస్కారాన్ని ప్రకటించింది. 'క్విట్ ఇండియా ' ఉద్యమానికి మారుపేరుగా నిలిచిన 'శ్రీమతి అరుణా అసఫ్ ఆలీ' సేవలకి సరి అయిన నివాళి ఇది.
3 . శ్రీమతి ఇందిరా ప్రియదర్శినీ గాంధీ : పరిచయం  అక్కరలేని పేరు ఇది. మన దేశపు తొలి, ఆ మాట కొస్తే ఏకైక మహిళా ప్రధాని గానూ, తిరుగులేని నాయకురాలుగానూ చరిత్ర పుటల్లో ఎప్పటికీ నిలిచిపోయే  ఈ స్త్రీ మూర్తిగురించి  కొత్తగా చెప్పబూనడం సాహసమే. నాలుగు విడతలుగా మొత్తం పదహారు సంవత్సారు ఆమె దేశాన్ని ఏలారు. మొదటినించీ రాజకీయ కుటుంబంలో పుట్టి (నవంబర్ 19 , 1917 ) పెరిగిన ఆమె రాజకీయాలలో రాణించడం ఎంతో సహజం గా జరిగినట్టు అనిపించినా దీనివెనక నిజానికి ఉన్నది అలుపెరుగని దీక్షా, కార్య దక్షతా. భయమనేది ఎరుగని నాయకురాలుగా పేరు తెచ్చుకున్నారు ఆమె. ఎమర్జెన్సీ, ఆపరేషన్ బ్లూ స్టార్ వంటి నిర్ణయాల వల్ల ఆమె తీవ్రమైన విమర్శలను ఎదురుకోవలసి వచ్చింది, చివరకు ఆమె భద్రతా సిబ్బంది చేతిలోనే అకోబార్ 31 , 1984 న దుర్మరణం పాలయ్యారు. భారత ప్రభుత్వం ఆమెకు 1971 లో నే 'భారత రత్న' పురస్కారాన్ని ప్రకటించింది. 
4 . శ్రీమతి. ఎం. ఎస్. సుబ్బులక్ష్మి: ఏ గొంతు వినబడితే కానీ దేవుళ్ళకి సైతం తెల్లవారదో, ఏ పాట వినపడితే ప్రతీ గుండె సప్త స్వరాల,  సరాగాలతో పులకరించి పోతుందో ఆ గొంతుకీ, ఆ గానామృతమూర్తికీ ఒక పేరు పెడితే ఆ పేరు ఎం. ఎస్. సుబ్బులక్ష్మి. దేశంలోనే 'భారత రత్న' పొందిన మొట్టమొదటి  గాయకురాలుగా చరిత్ర సృష్టించి, అజరామరమైన గానాన్ని మనందరికీ పంచిన ప్రఖ్యాత విదుషీ మణి, శ్రీమతి  మదురై షణ్ముఖ వదివు  సుబ్బులక్ష్మి. 'భజ గోవిందం' అని గోవింద నామాలు పాడినా, 'విష్ణుం జిష్ణుం' అంటూ విష్ణు సహస్ర నామాలు ఆలపించినా అది అనితరసాధ్యం అనిపించడం కేవలం ఆవిడకే సాధ్యం, సొంతం. నిండైన విగ్రహం, భారతీయ సాంప్రదాయత ని అణువణువునా ప్రతిబింబిస్తూ ఉండేలా వేష ధారణా ,మాటే మంత్రం లా ధ్వనించే గాత్రమూ.. వెరసి ఆమె పాడుతుంటే సాక్షాత్తూ అమ్మవారే పాడుతున్నట్టు అనిపించడం అందరికీ అనుభవమే. భారత ప్రభుత్వం వీరికి 1998 లో భారత రత్న ప్రకటించింది, శ్రీమతి ఎం. ఎస్ 11 డిశంబర్ 2004 న పరమపదించారు.
5 . కుమారి లతా దీనానాధ్ మంగేష్కర్:  భారత దేశ సినీప్రపంచపు గాన కోకిలగా గత అరవై సంవత్సరాలకు పైగా అశేష ప్రజానీకాన్ని తన మధురగానంతో ఓలలాడిస్తున్నమధుర గాయని లతా మంగేష్కర్.  వీరు ఇండోర్ లో సెప్టెంబర్ 29 , 1929 న జన్మించారు. వీరి తండ్రీ, సోదరుడూ, చెల్లెళ్ళూ అందరూ గాయకులే కావడం విశేషం. ఎన్నో  భారతీయ భాషలలో 25000 పైగా పాటలు పాడిన ఘనత ఆమెదే .ఎం. ఎస్ సుబ్బులక్ష్మి గారి తర్వాత 'భారత రత్న' పొందిన రెండో గాయని లతా మంగేష్కర్. ఎనభై ఒక్క సంవత్సరాల వయసులో కూడా ఇప్పటికీ అదే మాధుర్యంతో, తరగని ఉత్సాహంతో పాడతారు ఆమె. ఈ కోకిలకి భారత ప్రభుత్వం 2001 లో 'భారత రత్న' పురస్కారాన్ని ప్రకటించింది.

ఒకరా, ఇద్దరా? ఇలా రాసుకుంటూ పొతే ఎంత మందో, ఎనలేని పేరు ప్రఖ్యాతులు పొందినవారే కానక్కరలేదు.. గోరుముద్దలు తినిపిస్తూ, బుజ్జగించే అమ్మా,కమ్మగా కధలు, కబుర్లూ చెప్పే అమ్మమ్మా, నాన్నమ్మా,అత్తలూ, అత్తగార్లూ,  తోడుగా నడిచే తోబుట్టువులూ, ఎప్పుడైనా నేనున్నాను అని పలికే స్నేహితురాళ్ళూ, సహోద్యోగినులూ, టీచర్లూ, ప్రొఫెసర్లూ,  పై అధికారులూ, .. తరచి తరచి చూస్తె ప్రతీ ఒక్కరినించి మనం ఎంతో కొంత నేర్చుకుంటూనే ఉంటాము కదా... స్ఫూర్తి పొందుతూనే ఉంటాము కదా.. అలా అనేక విధాలుగా, వివిధ సమయాలలో మనకు సహకరించి, మన జీవితాలని  స్పృశించిన స్త్రీ మూర్తులందరికీ  అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
                     ఎందరో మహిళా మణిదీపాలు.. అందరికీ ప్రేమపూర్వక అభివందనాలు..

Monday, March 7, 2011

మహిళలూ- మణి దీపాలు (7 )

కిరణ్ బేది (బేడి) : ఈ పేరే ఒక సంచలనం అప్పటికీ, ఇప్పటికీ కూడా. మన దేశపు తొలి ఐ.పీ.ఎస్ ఆఫీసర్ గా 1972 లో చరిత్ర సృష్టించారు ఆమె. పంజాబ్ లోని అమృత్ సర్ లో జూన్ 9 , 1949 వ సంవత్సరం లో ప్రకాష్ మరియు ప్రేమ పెషా వరియా దంపతుల రెండవ కుమార్తెగా జన్మించారు కిరణ్. చదువుతో పాటు ఆటలలో కూడా ఎంతో ప్రతిభ కనపరిచిన కిరణ్ టెన్నిస్ మీద ఎంతో  మక్కువ కనపరిచే వారు.. అంతే  కాదు,  టెన్నిస్ లో అనేక చాంపియన్ షిప్  లు గెలుచుకున్నారు కూడా.  అమృతసర్ గవర్నమెంట్ కాలేజీ నుంచీ బి.ఏ పట్టానీ, పంజాబ్ యూనివర్సిటీ నించి ఎం.ఎ పట్టానీ పొందారు. చదువు పూర్తీ కాగానే రెండు సంవత్సరాలు అమృత సర్ లోని ఖాల్సా కాలీజీ లో లెక్చరర్ గా పనిచేసిన ఆమె 1972 లో  కేవలం తన పట్టుదల కారణంగా చేరారు. ఎంచుకున్న ఏ పనిలోనైనా అద్వితీయంగా ఉండడమే ఆమె నైజం.
            ఉద్యోగరీత్యా ఆమె నిర్వహించినాన్ని కష్టతరమైన బాధ్యతలు అన్నీ ఇనీ కావు. డిల్లీ  లో ట్రాఫిక్ పోలీస్ కమీషనర్ గా, మిజోరం లో డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ గా, చండీఘర్ లెఫ్టినెంట్ గవర్నర్ కి  సలహాదారుగా, డైరక్టర్ జనరల్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అనే ఐక్య రాజ్య సమితికి చెందిన సంస్థ లోనూ ఎన్నో గురుతరమైన బాధ్యతలు నిర్వహించారు. ముఖ్యంగా పోలీస్ అడ్వైసర్ గా ఐక్య రాజ్య సమితి శాంతి పరి రక్షణ లో ఆమె వహించిన బాధ్యతకి ఆమెకి  యూ. ఎం మెడల్ బహూకరించారు. అధికార పరిరక్షణలో ఆమె ఎవరినీ పట్టించుకునే వారు కాదు, ఎంతో ధైర్య సాహసాలతో తనకప్పగించిన బాధ్యతను నిర్వర్తించేవారు. ఈ లక్షణమే ఆమె కు 'క్రేన్ బేడి' అనే బిరుదు ని కూడా కట్టబెట్టింది, కారణం అప్పటి ప్రధాని  శ్రీమతి. ఇందిరా గాంధి అధికారిక అమెరికా పర్యటనలో ఆమె  కార్ ని సరి ఐన చోట పెట్టలేదని కిరణ్ బేడి తొలగించడమే. 
     సుదీర్ఘమైన ఆమె ఉద్యోగ జీవితం లో ఆమె సలహాలూ, సూచనలూ ఎన్నో ముఖ్యమైన నిర్ణయాల అమలు కు తోడ్పడ్డాయి. అంతే కాదు, తీహార్ జైల్లో ఆమె ప్రవేశ పెట్టిన యోగా, విపాసనా ప్రాణాయామం, ఖైదీలకు చదువు వంటి  ఎన్నో సంస్కరణలు ఆమెకు రామన్ మెగసెసే అవార్డు తెచ్చిపెట్టాయి. ఒక పక్క ఇంత  బాధ్యాతాయుతమైన, కష్టమైన  ఉద్యోగాలు నిర్వహిస్తూనే 1988 లో డిల్లీ యూనివర్సిటీ నించి లా డిగ్రీనీ, 1993 లో డిల్లీ ఐ ఐ.టీ లోని  పొలిటికల్ సైన్స్ లో డాక్టరేట్ డిగ్రీ నీ కూడా పొందారు.  అదీ ఆమె పట్టుదలకి నిదర్శనం, జైలు సంస్కరణలలో ఆమె అవలంబించిన మానవతా వాదానికీ, మంచితనానికీ 2005 లో గౌరవ లా డిగ్రీ ని పొందారు. పోలీస్ బ్యూరో ఆఫ్ రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ కి డైరక్టర్ జనరల్ గా ఉన్నప్పుదు ఆమె స్వచ్చంద పదవీ విరామాన్ని కోరి, పోలీస్ శాఖ నించి వైదొలగారు.
పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ఆమె పలు కార్యక్రమాలలో పాలుగొంటున్నారు. స్టార్ ప్లస్ అనే టీ. వీ చానెల్ లో ప్రసారం అయ్యే 'ఆప్ కీ కచేరీ' అనే కార్యక్రమానికి జడ్జీగానూ, వ్యాఖ్యాతగానూ వ్యవహరిస్తున్నారు. దీని ద్వారా పలు సమస్యలకి న్యాయపరమైన, చట్టపరమైన సలహాలనూ, సూచనలనూ అందిస్తారు. నవజ్యోతి అనే స్వచ్చంద సంస్థనీ,  భారతీయ జైళ్ల సంస్కరణ ల కోసం మరొక సంతని స్థాపించి వాటి కార్యక్రమాలని నిర్వహిస్తారు.
      కిరణ్ బేడి భర్త పేరు  శ్రీ. బ్రిజ్ బేడి. వీరికి సైనా అని ఒక కుమార్తె.  ఆమె తన భర్త తో కలిసి లఘు చిత్రాలూ, డాక్యుమెంటరీలు నిర్మిస్తారు.. అంతేకాక ఆమె కూడా తల్లి మాదిరిగానే సమాజ సేవలో ఎంతో ముందుంటారు.
      ఉద్యోగం అంటే కేవలం జీతం ఇచ్చే కొలువు అని ఆమె ఎన్నడూ అనుకోలేదు. నమ్మినదాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించడం మాత్రమె ఆమెకు తెలుసు.. రాజీ పడడం, వెను తిరగడం ఆమెకు తెలియనే తెలీదు. అందుకే ఆమె ఎందరో అమ్మాయిలకు స్పూర్తిగా నిలిచారు. నిలుస్తూనే ఉంటారు. మచ్చ లేని వ్యక్తిత్వమూ, ఎనలేని ధైర్య సాహసాలు కలగలిసిన శ్రీమతి బేడి మరెందరికో మార్గదర్శి కాగలరు అనడం లో ఎంతమాత్రం సందేహం లేదు. 


Sunday, March 6, 2011

మహిళలూ- మణిదీపాలు (6 )

 డా. వి.  శాంత: దాదాపు యాభై సంవత్సరాలుగా కాన్సర్ వ్యాధి నివారణ, చికిత్సల  నిమిత్తం పరిశోధనలు చేస్తూ, కాన్సర్ రోగుల సంరక్షణ   కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న వైద్య శిఖామణి డా. శాంత. ఆమె అవిరళంగా చేస్తున్న కృషి కి మెగసేసే అవార్డూ, పద్మ భూషణ్ లాంటి పురస్కారాలెన్నో ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి.
           డా. శాంత మార్చ్ 11 , 1927 వ తారీకున చెన్నై లో జన్మించారు.   ఆమె  ఎందరో విద్యావేత్తలూ, విద్యాధికులూ ఉన్న కుటుంబంలో జన్మించడం వల్ల ఆమె కి చిన్నప్పటినించీ ఎంతో ప్రోత్సాహం లభించింది  ఒక   నోబుల్ బహుమతి  విజేత, ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త  సర్. సి.వీ. రామన్  గారి సోదరుని మనవరాలు, మరొక  నోబుల్ బహుమతి విజేత, విశ్వవ్యాప్తంగా ప్రముఖులైన  శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యం చద్రశేఖర్ గారి  మేనకోడలు. డా. శాంత. చిన్నతనం నించీ ఆమెకి డాక్టర్ అవ్వాలనే కోరిక. మద్రాస్ మెడికల్ కాలీజీ నించి 1949 లో ఎం.బీ.బీ.ఎస్ డిగ్రీనీ, 1955 లో ఎం. డీ పట్టానీ పొందారు. ఎం.డీ పూర్తీ కాగానే పబ్లిక్ సర్వీస్ కమీషన్ లో వచ్చిన ఉద్యోగం కాదని డా. ముతులక్ష్మి రెడ్డి నెలకొల్పిన కాన్సర్ ఇన్స్టిట్యూట్ లో చేరారు. మూడు సంవత్సరాలు  అక్కడ ఉచితంగా పని చేసిన తర్వాత ఆమెకి నెలకు 200 రూ జీతమూ, కాంపస్ లో ఇల్లూ దొరికాయి. అప్పటినించీ ఇప్పటివరకూ ఆమె అక్కడే నివస్తిస్తున్నారు.
             డా. ముతులక్ష్మి రెడ్డి గారి కుమారుడైన డా. ఎస్. కృష్ణమూర్తి తో కలిసి 12 పడకల చిన్న హాస్పటల్ నించీ 431 పడకలతో,  దేసవ్యాప్తంగానే కాక, ప్రపంచ వ్యాప్తంగా కూడా  పేరెన్నిక గన్న కాన్సర్ ఇన్స్టిట్యూట్ గా తీర్చి దిద్దారు. వైద్యరంగం ఎంత ఆధునిక పద్దతులూ, పోకడలూ అవలంబించినా ఎప్పటికీ పేషంట్ ల విషయం లో ఎప్పటికీ మారనిది ఒకటుంది అంటారామె. ' ఎన్నో ఏళ్లుగా  కేన్సర్ కు గురి అయిన వారిలో మొదటగా కలిగేది విపరీతమైన భయం, మానసిక సంక్షోభం.ఒక డాక్టర్ వారితో ప్రేమగా మాట్లాడి, వారిలో నమ్మకాన్ని, భద్రతా భావాన్నీ కలిగించాలి.   అప్పుడే వారికి పరిస్థితులని ఎదుర్కొనే ధైర్యం కలుగుతుంది". ఈ రోజుల్లో ఇది జరగటం లేదని, అందుకే తానూ ఎప్పుడూ మెడికల్ విధ్యార్దులకీ, వైద్యులకీ ఇదే సలహా ఇస్తాననీ అంటారు.
          అంతే కాదు, "విలియం ఒస్లేర్ అనే ప్రఖ్యాత వైద్యుడు చెప్పినట్టు. వైద్యం కేవలం సైన్సే కాదు, గొప్ప కళ కూడా. స్వాంతన కలిగిస్తూ నమ్మకాన్నీ, విశ్వాసాన్నీ పెంచడం కళ అయితే, చికిత్స సైన్స్. నిజమైన డాక్టర్ ఎప్పుడూ రోగానికే కాక రోగికీ కూడా స్వాంతన చేకూర్చి చికిత్స  చెయ్యాలి అంటారు. ఈనాడు లభిస్తున్న ఆధునిక వైద్య విధానాలవల్ల పూర్వం కంటే ఎంతోమందిని ఈ వ్యాదినించి కాపాడ   గలుగుతున్నామని ఆనందం వ్యక్తం చేస్తారు.      
         వైద్య విధానాలు వ్యాపారం అయిపోతున్న ఈ రోజుల్లో వీరు ఇంకా తమ నియమాలకి కట్టుబడి కనీసం 60 శాతం మందికి ఉచితంగా వైద్యాన్ని అందిస్తారు. చికిత్సకీ, వైద్యానికీ రాజూ-పేదా అనే తేడా లేదంటారు. రోగాన్ని చాలా తోలి దశలోనే గుర్తించడం ఏంటో అవసరమని, తద్వారా నివారణ కీ, చికిత్సకీ ఎక్కువ వీలు , సమయమూ ఉంటుందని అంటారు. దీనికి ఇప్పుడు పెరిగిన శాస్త్ర పరిజ్ఞానాన్ని వాడుకోవాలని అంటారు.
              ఎనభై మూడు సంవత్సారాల వయసులో కూడా ఆమె ఎప్పుడూ వైద్యం చెయ్యడానికీ, ఆపరేషన్లు చెయ్యడానికీ కూడా ముందుంటారు. 'తమ జీవితం ఆమె తమకిచ్చిన వరం 'అని ఎందరో పేషంట్లు వినమ్రంగా చెప్తారు. "నాకేవీ హాబీలు లేవు, ఎందుకంటే టైమే ఉండదు నాకు అంటారు'. మేలుకుని ఉన్న ప్రతీ నిమిషం ఆమె కేన్సర్ వ్యాధి నివారణకీ, చికిత్సకే వెచ్చిస్తారు. అందులోనే ఆమెకి ఆనందం, ఉత్సాహం. దీనిలో అలసట లేనే లేదు, ఆలసత్వం దగ్గరకి రానే రాదు. వచ్చే ఐదేళ్ళల్లో మీరేమి చేస్తారు? అని అడిగితె 'ఇలా దీనికోసం పనిచేస్తూనే కన్నుమూస్తే చాలు 'అంటారు..
              సేవాతత్పరత అనేది చాలా అరుదైపోయిన నేటి వైద్యరంగం లో , అలాంటి స్వార్ధపూరిత వాతావరణాన్ని  సవాలు చేస్తూ తన జీవితాన్ని ప్రజలకి అంకితం చేసిన డా. శాంత ఎందరికో ఆదర్శం కావాలి. ఆమె చూపిన బాట లో ఎందరో యువతీ యువకులు కదలాలి.. కలిసి నడవాలి. ఆ మహోన్నత వైద్య శిఖామణి కి  మనందరి అభినందనలు తెలుపుదాం. భగవంతుడు ఆమెకు సంపూర్ణ ఆరోగ్య ఆయుర్దాయాలని ప్రసాదించాలని కోరుకుందాం.
             

Saturday, March 5, 2011

మహిళలూ- మణిదీపాలు (5 )

 ఇంద్ర నూయీ: ఇంద్ర కృష్ణమూర్తి నూయి.....వ్యాపార రంగంలో ఈ పేరు తెలియని వారు ఉండరు. చెన్నై లో జన్మించిన 55 సంవత్సారాల శ్రీ మతి నూయీ మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజీ నించీ డిగ్రీ చదివి, తర్వాత కలకత్తా లోని ఐ.ఐ.ఎం నించీ ఎం.బి.ఏ డిగ్రీ పొందారు. 
     చిన్నప్పుడు   ఇంద్ర తల్లిగారూ ఆమెకీ, చేల్లెలికూ ప్రతీ రాత్రి ఒక పోటీ పెట్టేవారుట, 'నేను జీవితం లో ఏమి సాధించ దల్చుకున్నాను ?' అన్న విషయం మీద ఒక  స్పీచ్ తయారుచేసి మాట్లాడాలి. ఎవరు గెలిస్తే వారికి చాక్లెట్. అలా అప్పటినించీ తమ  మీద తమకి నమ్మకమూ, జీవితంలో ఎదగాలి , ఏదో సాధించాలన్న కాంక్ష కలిగాయి వారిద్దరికీ.
చదువు పూర్తి అయిన తర్వాత జాన్సన్ అండ్ జాన్సన్ లాంటి కంపెనీలలో కొంత కాలం పని చేసాక 1978 లో ' యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ ' నించి పబ్లిక్ అండ్ ప్రైవేట్ మేనేజ్మెంట్ లో డిగ్రీ పొందారు. ఆ తర్వాత బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ లో చేరిన ఆమె ఆతర్వాత మోటోరోలా లాంటి కంపెనీలలో కీలకమైన పదవులు నిర్వహించారు.
   పెప్సికో లో 1994 లో తొలిసారిగా అడుగిడిన ఆమె తొందరలోనే ప్రెసిడెంట్ మరియు సి.ఎఫ్.ఓ గా 2011  లో ఎంపికయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ సలహాలలోనూ, వ్యవహారాలోనూ తనదైన కొత్త ఒరవడినీ, శైలినీ సృష్టించి కంపెనీ ని అభివృద్ధి పదంలోకి దూసుకుపోయేలా చేసారు. వీటిల్లో భాగమే 'ట్రోపికానా జ్యూస్ 'కంపెనీల కొనుగోలు, 'క్వేకర్ ఓట్స్' కంపెనీతో కలయికా వగైరాలు. సి.ఎఫ్.ఓ గా ఆమె బాధ్యతా చేపట్టిననాటి నించీ కంపెనీ వార్షిక ఆదాయం 72 % శాతం పెరిగింది అని బిజినెస్స్ వీక్ పత్రిక పేర్కొంది..అలా ఆమె 2007 లో 44 సంవత్సరాల పెప్సికో కంపెనీ చరిత్రలో ఐదవ సి.ఈ.వో గా బాధ్యతలని స్వీకరించారు. అప్పటినించీ విజవంతంగా తన బాధ్యతలని నిర్వయిస్తున్నారు. 
     స్వతంత్రంగానూ, సత్వరంగానూ నిర్ణయాలు తీసుకునే ఆమె నైజం ఆమె అభివృద్దికి ఎంతో దోహదపడింది, ఒక సారి నిర్ణయం తీసుకున్న ఏ  పనైనా సరే పూర్తి అయ్యేవరకూ విశ్రమించడం ఆమెకు తెలీదు. ఇటువంటి లక్షణాలే ఆమెని 25   బిలియన్ల బహుళ జాతి సామ్రాజ్యానికి అధిపతి ని చేసింది.. ఈ విషయాన్ని గురించి ఆమె ఇలా అంటారు. " రకరకాలైన వివక్షతలున్న సమాజంలో ఒక మహిళ ఉన్నత శిఖరాలని అధిరోహించడం అనేది మూడింతలు కష్టమనీ, దానికి తానూ ఎన్నుకొన్న మార్గం   తన పురుష సహోద్యుగల కంటే రెండింతలు ఎక్కువ కష్టపడటమే' అని. 
    ప్రస్తుతం గడుస్తున్న సమయాన్ని ఆస్వదిన్చాదమూ,  రాబోయే కాలంలో వచ్చే  ఉత్సాహభారితమైన క్షణాల కోసం ఎదురుచూడడమూ ఆమె కెంతో ఇష్టం. తను పుట్టిన దేశమన్నా ,  సంస్కృతి  అన్నా ఎంతో ఇష్టపడే ఆమె ఆఫీసు ఫంక్షన్లకీ, ఇతర సందర్భాలలోనూ సాంప్రదాయబద్ధం గా చీర ను ధరించడానికి ఇష్టపడతారు. ఇదొక్కటే కాదు తను చిన్ననాటినించే నేర్చుకొన్న ఇతర భారతీయ అలవాట్లూ, సంప్రదాయాలు మర్చిపోకుండా ఆచరిస్తారు. ఇంద్ర నూయి భర్త పేరు శ్రీ. రాజ్ నూయి, వీరికిద్దరు కుమార్తెలు. కుటుంబాన్నీ, ఉద్యోగాన్ని సమతూకంగా నిర్వహించడానికి ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తారు. 
  ఆమె కార్యదక్షతనూ , దీక్షనూ సన్మానిస్తూ    ఎన్నో అవార్డ్ లు ఆమె సొంతమయ్యాయి. వీటిల్లో భారత ప్రభుత్వం వారు ప్రకటించిన పద్మ భూషణ్ (2007 ), బర్నార్డ్ కాలేజీ వారందించిన బర్నార్డ్ మెడల్ ఆఫ్ ఆనర్ లాంటి వాటితో పాటు మరెన్నో ఉన్నాయి. అనేక వ్యాపార పత్రికలు   వివిధ సంవత్సరాలలో ఆమెని ప్రపంచం లోని అతి శక్తివంతమైన మహిళలలో  ముఖ్యమైన  వ్యక్తిగా పేర్కొన్నాయి. ఇలా ఎన్నో విజయాలు ఆమె సొంతం. 
మహిళలూ- మణిదీపాలు (5 )
   

Friday, March 4, 2011

మహిళలూ- మణిదీపాలు (4 )

సరళా థక్రాల్: ఆకాశంలో ఎగరడమే కలగానూ, అద్భుతంగానూ భావించే కాలంలో అలా ఎగిరే విమాన్నాన్ని నడపడం ఆనేది గొప్ప సాహసం. ఇలాంటి సాహసాలూ, అవకాశాలు కేవలం మగవాల్లకే సొంతం అని భావించే కాలంలో కాక పిట్ లోకి ఒక మహిళా అడుగిడడమే కాక,  వినీలాకాశంలోకి రివ్వున దూసుకుపోయింది. భారతదేశపు ఆ తోలి మహిళా పైలట్ పేరే సరళా థక్రాల్. మనం చెప్పుకునేది 1936 వ సంవత్సరం గురించి, అప్పుడు సరళ వయసు కేవలం 21 సంవత్సరాలు. 
             అప్పటికే  తొమ్మిది  మంది పైలట్లు ఉన్నఘనత ఉన్న కుటుంబంలో శ్రీ  పీ.డీ. శర్మ తో సరళ వివాహం జరిగింది. అప్పటికామే వయసు కేవలం పదహారు  మాత్రమే. ఆ తర్వాత భర్తా, మామగారు అందించిన తోడ్పాటు, సహకారం వలన ఆమె పైలట్ కావాలన్న కోరిక నెరవేరింది. ఆమె కేవలం వంటింటికే పరిమితం కాకూడదని, భావించి కెప్టెన్ శర్మ ఆమెని డిల్లీ ఫ్లైయింగ్ క్లబ్ లో చేరిపించారు.  తన భర్తా, ఆయన కంటే మిన్నగా తన  మామగారు ఇచ్చిన ప్రోత్సాహమూ, ఉత్సాహమూ ఇవ్వడం  వల్లే తను అప్పటివరకూ కేవలం మగవారికే పరిమితం అనుకున్న రంగంలోకి విజయవంతం గా అడుగుపెట్టానని ఆమె అంటారు. అలా ఆమె విమానం నడపడంలో  వెయ్యి గంటల శిక్షణ పూర్తీ చేసుకుని 'ఏ' సర్టిఫికేట్ సాధించారు.
    కమర్షియల్ పైలట్ కావడానికి అవసరం అయిన 'బీ' సర్టిఫికేట్ శిక్షణ కొనసాగుతుండగానే ఆమె జీవితంలో అనుకొనే విషాదం జరిగి, 1939 లో ఆమె భర్త క్రాష్ లో మరణించారు. దానివల్లనూ, రెండవ ప్రపంచ యుద్ధం వల్ల శిక్షణ రద్దు చెయ్యడం వల్లనూ  , ఆమె కమర్షియల్ పైలట్ కాలేక పోయారు.
            ఆ తర్వాత ఆమె లాహోర్ లో మేయో ఆర్ట్ స్కూల్ లో చేరి గొప్ప పెయింటర్ గా పేరు పొందారు. ఆమె పెయింటింగ్ బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ విధానం లో ఉంటాయి, దానిలో ఆవిడ డిప్లమా సంపాదించారు . ఆర్యసమాజరీతిని అనుసరించే ఆమె తర్వాత పీ.పీ. థక్రాల్ ని ద్వితీయ వివాహం చేసుకున్నారు.  ఆవిడ పెయింటింగ్ కీ, చీరాల, నగల రూప కల్పనకీ ఉన్న అభిమానుల్లో ఎంతో మంది ప్రముఖులు ఉన్నారు, వారిలో శ్రీమతి విజయలక్ష్మీ పండిట్ ముఖ్యులు.  అంతేకాదు, ఆవిడ దాదాపు ఇరవై సంవత్సారు అనేక కుటీర పరిశ్రమలకి తను డిజైన్ చేసుకున్న నగలూ, చీరలూ ఇచ్చేవారు, వీటిలో' నేషనల్ స్కూల్ అఫ్ డ్రామా ' ముఖ్యమైనది.
    ప్రస్తుతం తొంభై ఒక్క సంవత్సరాల  సరళ ఇప్పటికీ అదే ఉత్సాహంతో, ఆసక్తితో ఉంటారు. "ప్రతీ రోజూ నేను చెయ్యవలసిన పనులన్నీ కాగితం మీద రాసుకుంటాను, తగినంత పని ఉంటేనే నాకు ఆనందంగా ఉంటుంది, లేకపోతే ఒక ముఖ్యమైన రోజు వృధాగా పోయినట్టుగా అనిపిస్తుంది నాకు " అంటారు. "తలపెట్టిన పని పూర్తీ అయ్యేవరకూ ఆపడం ఆవిడకి తెలియదు, పై బడిన వయసు వలన ఇప్పుడు ఇదివరకులా ఒక్క బిగిన పూర్తి చెయ్యలేకపోయినా పట్టుదలగా పూర్తి చేస్తూ ఉంటాను"  అంటారు. 
        మనిషికీ, జంతువులకీ ఉన్న తేడా నవ్వగలగడం, సంతోషంగా ఉండగలగడం.. అది ఎప్పటికీ ఎవరూ వదులుకోకూడదు. ప్రతీ రోజూ ఒక కొత్త అన్భంగానూ, అనుభూతిగానూ గడపాలి, దానివల్లనే నేను నా జీవితం లో వచ్చిన కల్లోలాలని అధిగామించ గలిగానని అంటారు.
              ఏనాటికీ తరిగిపోని ఉత్సాహానికీ, పోరాట పటిమకి ప్రతి రూపంగా కనిపిస్తారు ఆమె. ఈ వయసులో కూడా తన ఇంటి పని, వంట పని స్వయంగా చేసుకుంటారు. ఆమెని ఆదర్శంగా స్ఫూర్తి పొందిన ఎందరో అమ్మాయిలు పైలట్లు అయ్యారు. 

Thursday, March 3, 2011

మహిళలు- మణిదీపాలు (3 )

ఇరోం చానూ షర్మిల: 'ఐరన్ లేడీ అఫ్ మణిపూర్ ' గా ప్రసిద్ది చెందిన షర్మిల గత పది సంవత్సరాలుగా ప్రపంచంలోనే అత్యంత దీర్ఘమైన నిరాహాహారదీక్ష జరుపుతున్నారు. ఇది తనకోసమో, తనవారికోసమో కాదు, కేవలం తను నమ్మిన మానవ హక్కుల కోసం.
       మణిపూర్ కి చెందిన 38 సంవత్సరాల  షర్మిల, ఒక  జర్నలిస్ట్,కవయిత్రి ,  మానవ హక్కుల పరిరక్షణ   కోసం పోరాడే వ్యక్తి. మాలూం అనే ఊర్లో నవంబర్ 1 , 2000 వ తేదీన అస్సాం రైఫిల్స్ జరిపిన కాల్పులలో బస్ కోసం ఎదురుచూస్తున్న పది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. కొందరు పార్లమెంట్ మీద దాడి జరుపబోతుంటే ఆపడానికి జరిపిన కాల్పులలో ఈ ప్రయాణీకులు చనిపోయారు తప్ప వారిని అటాక్ చేసే ప్రయత్నం కాదని 'అస్సాం రైఫిల్స్' చెప్పారు. చనిపోయిన వారిలో పెద్దవారూ, సాహస బాల పురస్కారం పొందిన పదేనిమిదేళ్ళ అమ్మాయి ఉండడమూ, ప్రభుత్వం నించీ ఈ సంఘటన గురించి సరి ఐన వివరణ రాకపోవడం వల్ల కలత చెందిన  షర్మిల తన తల్లి ఆశీర్వాదంతో నవంబర్ నాలుగో తేదీనించి నిరవరధిక నిరాహారదీక్ష ప్రారంభించింది.ఆమె కోరిక ఒక్కటే  'ఆర్మేడ్ ఫోర్సెస్ స్పెషల్ పోవేర్స్ ఆక్ట్ (AFSPA) 1958 ని మణిపూర్ నించీ,  మిగతా సమీప ప్రాంతాలనించీ  వెనక్కి తీసుకోమనే.
        ఆమె నిరాహార దీక్ష ప్రారంభిన మూడు రోజులకే పోలీసులు 'ఆత్మహత్యా ప్రయత్నం" క్రింద  ఆమెని అరెస్టు  చేసారు. ఆమె తనంత తానుగా ఆహరం కానీ, నీరు కానీ తీసుకోవడానికి నిరాకరించడం వల్ల బలవంతంగా ఆమెకి ముక్కుద్వారా ద్రవపదార్ధాలు అందిస్తారు. ఇది అత్యంత బాధాకరమైన ప్రక్రియ. దీనిని అనుభవించిన వారికి కానీ అర్ధం కాదని వైద్యులే అంటారు. ఇలాంటి  ఆమె దీక్ష గత పదేళ్లుగా సాగుతూనే ఉంది. ఆమెకి సాయంగా ప్రజలు కూడా అనేక రకాలుగా ప్రభుత్వాలకీ సంగతి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జస్టిస్ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలోAFSPA చట్టం గురించీ  తద్వారా అస్సాం రైఫిల్స్ కి ఉండవలసిన అధికారాలూ, హక్కుల గురించి అధ్యయనం చెయ్యమని ఆదేశించింది. వారు కూడా AFSPA ని వెనక్కు తీసుకోవడమే మంచిదని అభిప్రాయపడినా కూడా అప్పుటి హోం శాఖామాత్యులు ఒప్పుకోలేదు. గత పదేళ్లుగా షర్మిలని అత్యంత కట్టుదిట్టాలమధ్య ఇంఫాల్ లోని జవహర్ లాల్ హాస్పటల్ లో బందీగా ఉంచారు. ఆమెని ప్రతీ ఏడాది విడుదల చెయ్యడమూ, మళ్ళీ ఖైదు చెయ్యడమూ అలవాటుగా జరుగుతోంది.
          మహాత్మాగాంధీ లాగే షర్మిల కూడా సత్యాగ్రహాన్ని సాధనం గా ఎంచుకుంది, అంతమాత్రాన ఆమెని క్రిమినల్ గా పరిగణించడం చాలా  మానవ హక్కుల సంఘ అధ్యక్షుడు అభిప్రాయపడ్డారు. ఆయనే కాదు, చాలా మంది ప్రముఖ మానవ హక్కుల పరిరక్షణా నేతలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. ఒక మహిలని , అదీ ఎంతో శాంతియుతంగా తన నిరసన ని తెలియచేస్తున్నా ఆమెని ఇలా బంధించడం తప్పని చెప్పారు.
       'ఎంతో మానసిక స్థైర్యం ఉంటేనే కానీ ఇలాంటి సాహసం చేయ్యలేరనీ, ఆమె కధ  ఆధారంగా సినిమా తియ్యాలని ఉన్నా ఆమె నిజ జీవితాన్ని, ధైర్యాన్నీ  సరిగ్గా చిత్రీకరించాలేనేమో అని అనిపించడమే కారణమని' ప్రసిద్ద దర్శకుడు అరిబం శ్యాం శాస్త్రి అన్నారు.వీరే కాదు, మరెందరో ప్రముఖులు ఆమెకితమ సహకారాన్ని, సహాయాన్ని ప్రకటించారు. వీరిలో అరుంధతీ రాయ్, మహాశ్వేతా దేవి, నోబుల్ బహుమతి గ్రహీత 'శిరీన్ ఎబాడి 'వంటి ప్రముఖులెందరో ఉన్నారు. ఆమె జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఎన్నో పుస్తకాలు కూడా పలువు రచించారు.   
    షర్మిల పేరును నోబుల్ శాంతి బహుమతికై 2005 లో ప్రతిపాదించారు. ఐ.ఐ.పీ .ఎం వారు  ఈ మధ్యనే షర్మిల కి టాగూరు శాంతి బహుమతి ( 51 లక్షల నగదు)  నిచ్చి సత్కరించారు. మరెన్నో బహుమతులూ,సత్కారాలు ఆమకు లభించాయి.
 పదేళ్లుగా ఒక్క ముద్ద అన్నం తినకుండా గడపడం అనేది నాలాంటి మామూలు మనుషుల ఊహకి కూడా అందని విషయం. తను నమ్మిన సిద్దాంతానికి కట్టుబడి,  అత్యంత    శాంతియుతంగా ఏమాత్రం ఆవేశ కావేశాలకి  లోను కాకుండా షర్మిల చేస్తున్న పోరాటాన్ని ఏ  పేరుతొ పిలవాలో? ఎంత గొప్పగా అభివర్ణించాలో  కూడా   తెలియడంలేదు. అయితే ఆమె మాత్రం 'మనం ఈ లోకంలోకి ఎందుకు వచ్చామో విధిగా తెలుసుకోవాలి ఎందుకంటే ఎప్పుడు వెళ్లి పోతామో  మనకే తెలియదు కనక..' అంటారు.
ఈ మహిళా దినోత్సవ సంధర్ధంలో ఈ ఉక్కుమహిళకి జోహార్లు. ఆమె ప్రయత్నం సఫలం కావాలని మనస్పూర్తిగా  కోరుకుందాం.

Wednesday, March 2, 2011

మహిళలూ-మణిదీపాలు (2 )

డా. శోభా నాయుడు: ఇష్టపడి ఎంచుకున్న ఏ రంగంలోనైనా అలుపెరుగని  దీక్షా, సాధనా, అంకిత భావాలతో కృషి చేస్తే చేరుకోలేని ఉన్నత శిఖరాలు ఉండవని నిరూపించిన నృత్య చూడామణి పద్మశ్రీ .  డా. శోభా నాయుడు. సుప్రసిద్ధ కూచిపూడి నృత్య విద్వాంసులు శ్రీ వెంపటి చినసత్యం గారి శిష్యులలో పేరెన్నిక గన్న వీరు విశాఖ జిల్లా అనకాపల్లి లో 1956 లో జన్మించారు. చాలా చిన్ననాటి నించీ ఆమె వివిధ సంగీత నృత్య రూపకాలలో నాయికా వేషాలు వేస్తూ కూచిపూడి నాట్యం మీద ఎంతో పట్టు సాధించారు. తన గురువుగారితో కలిసి మన దేశంలోనూ, విదేశాలలోనూ పలు చోట్ల ప్రదర్శనలు ఇచ్చారు. అనేక రకాలైన పాత్రలలో తన ప్రతిభా పాటవాలు ప్రదర్శిస్తూ ప్రత్యేకంగా సత్యభామ, పద్మావతి పాత్రలకి మారుపేరుగా నిలిచారు. 

తనకున్న అసమాన ప్రతిభా పాటవాలూ, కళా దృష్టి తోనూ వివిధ రకాలలిన  కదా అంశాలతో ఆమె రూపొందించిన నృత్యరూపకాలు ప్రపంచమంతా ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయి. పురాణాలకి, ఇతిహాసాలకి సంబంధించినవైనా, ఆధునిక సాంఘిక ఇతి వృత్తాలైనా ఎంతో కమనీయంగా, సాంప్రదాయ నృత్య రీతి బద్దంగా రూపొందించడం ఆమె ప్రత్యేకత.
విప్రనారాయణ, శ్రీ కృష్ణ శరణం మమ, కళ్యాణ శ్రీనివాసం,  విజయోస్తుతే నారీ, క్షీర సాగర మధనం, సర్వం సాయి మయం, జగదానంద కారకా, గిరిజా కల్యాణం, స్వామీ వివేకానంద మరియు నవరస నటభామిని లాంటి సంగీత నృత్య రూపకాలను రూపొందించి, దర్సకత్వం వహించడమే కాక వాటిలో పద్మావతి, చండాలిక, సాయి బాబా, జగన్మాత పార్వతీ, మోహినీ వంటి పాత్రలను ఎంతో అద్భుతంగా, అనితరసాధ్యంగా పోషించి ప్రపంచమంతా నృత్య ప్రేమికుల ప్రసంసలు అందుకున్నారు. కళ్యాణ శ్రీనివాసం వంటి కార్యక్రమాలను చూసి తిరుమల తిరుపతి దేవస్థానం వారు వాటిని దేశమంతా  ప్రదర్శింప చేసి  బహుళ ప్రాచుర్యాన్ని కల్పించారు.

 కూచిపూడి నృత్య అకాడమీ కి ప్రిన్సిపాల్ గా 1980 నించీ తన సేవలు అందిస్తున్నారు. అంతేకాక శ్రీ వెంకటేశ్వర  భక్తి చానల్ లో 'సాధన' అన్న కార్యక్రమంలో శాస్త్రీయ నృత్యం లో శిక్షణ ఇస్తున్నారు. అలాగే సంస్కృతీ చానల్ లో 'సిరి సిరి మువ్వ ' కార్యక్రమమాన్ని నిర్వహిస్తూ ప్రతిభను ప్రోత్సహిస్తున్నారు. గురువుగా ఇప్పటివరకూ దాదాపు 2000 మంది గొప్ప శిష్యుల్ని ఎంతో ప్రతిభావంతులుగా తీర్చి దిద్దారు. వీరంతా ప్రపంచలో నలుమూలలా స్థిరపడి తమ వంతు కళాపోషణ చేస్తున్నారు. రష్యాలో వీరి ప్రదర్సనలని చూసి కొంతమంది ఔత్సాహికులు రష్యానించి వచ్చి మరీ ఆమె దగ్గర నృత్యం నేర్చుకుంటున్నారు. 

మద్రాస్ లోని కృష్ణ గాన సభ వారు శోభానాయుడుగారికి 'నృత్య చూడామణి'  ,  కేంద్ర సంగీత నృత్య అకాడెమీ వారి పురస్కారమూ, నుంగంబాక్కం వారిచే నృత్య కళా శిరోమణి లాంటి బిరుదులెన్నో ఆవిడ సొంతమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం వారిచే పద్మశ్రీ అవార్డ్ కూడా ఆమెని వరించింది. 

అనుపమానమైన అందం, అనితరసాధ్యమైన అభినయం, అకున్థత దీక్షా, ఎటువంటి భావాన్నైనా అవలీలగా పలికించే విశాల నేత్రాలూ,  హావభావాలు కలిసి ఆమెనొక విలక్షణమైన నర్తకిగా నిలబెడితే, తనకెంతో ప్రియమైన కళని పెంచి పోషించి, తరగని ఆ సంపదని భావి తరాలకి పదిలంగా అందించాలని నిరంతరంగా కృషి సలుపుతున్న మహా నర్తకి శ్రీమతి. శోభా నాయుడు. కళని ప్రేమించాలి, ఆరాధించాలి అని కేవలం చెప్పడం కాకుండా అనుక్షణమూ ఆచరించి చూపుతున్న అభినవ నాట్య సరస్వతి.. 
మృదు భాషణ  కీ, నిగర్వానికీ, నిరాడంబరతకీ మారుపేరుగా నిలిచిన ఈ నృత్య చూడామణి మార్గం ఎందరికో మార్గ దర్శకం.



Tuesday, March 1, 2011

మహిళలూ- మణిదీపాలు (1 )

    మార్చి ఎనిమిదో తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రతీ సంవత్సరమూ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలలో మహిళలపై తమకున్న గౌరవాన్నీ, ప్రేమనూ వారు సాధించిన అభ్యున్నతినీ కీర్తిస్తూ, వాళ్ళ కీర్తి కిరీటాలలో మరెన్నో కలికి తురాయిలు చేరాలని ఆశించే రోజుగా జరపబడుతుంది. మొట్టమొదటగా ఈ పండగని జర్మనీలో 1911 వ సంవత్సరంలో మార్చి 19   వ  తారీకున జరిపారుట. ఈ ఒక్క రోజే మనదా? మిగతావన్నీ కాదా  ? అన్న ప్రశ్న పక్కన పెట్టి మనకంటూ కేటాయించుకున్న ఈ రోజుని చక్కగా ఆనందంగా గడిపేస్తే సరిపోతుంది కదా.. మహిళల దినోత్సవం అనగానే జీవితంలో ఎంతో సాధించి, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న మహిళలని గుర్తు తెచ్చుకోవడం సహజం.. నా మటుక్కు నాకు ఇలాంటి వారెంతో స్ఫూర్తి ప్రదాతలుగా కనిపిస్తారు, అందుకే అలాంటి కొందరిని గుర్తు చేసుకునే ఈ ప్రయత్నం..
1 . నిరుపమా మీనన్  రావు:  ప్రస్తుతం కేంద్ర  విదేశాంగ  శాఖలో (Ministry of External Affairs)కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ కార్యదర్శి   గా (Foreign Secretary) గా కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీమతి నిరుపమా రావు IFS ఆఫీసర్. విదేశాంగ కార్యదర్శిగా ఎంపిక అయిన రెండో మహిళ (మొదటి వారు చోకిలా ఐయ్యర్). 
       కేరళ లోని మలప్పురం లో జన్మించిన అరవై సంవత్స రాల  నిరుపమ,  తండ్రి ఆర్మీ ఉద్యోగ కారణంగా పలుచోట్ల చదువుకున్నారు. బెంగళూరు లోని మౌంట్ కార్మెల్ కాలీజీలో బి.ఎ లిటరేచర్, మరాఠ్వాడ విశ్వవిద్యాలయంలో ఎం.ఎ పట్టాని పుచ్చుకున్నారు. 
      సివిల్ సర్వీసెస్ పరీక్ష లో, సర్వప్రధమురాలిగా 1973 లో ఎంపిక అయ్యి IFS లో చేరారు. అప్పటినించీ     ఈ నాటివరకూ ఆమె వృత్తి జీవితంలో అనేక పదవులను చేపట్టారు, అందులో వాషింగ్టన్‌లో పత్రికా వ్యవహారాల మంత్రిగా, మాస్కోలో డిప్యూటీ ఛీఫ్ ఆఫ్ మిషన్‌గా, విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖలో సంయుక్త కార్యదర్శిగా (తూర్పు ఆసియా), (విదేశీ ప్రచారం) విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖలో మొదటి మహిళా అధికార ప్రతినిధిగా, సిబ్బంది ముఖ్యాధికారిగా, పెరూ మరియు చైనాకు రాయబారిగా మరియు శ్రీలంక హై కమిషనర్‌గా ఎన్నో కీలకమైన పదవులలో బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించారు. 
    IFS శిక్షణ ముగిసిన తర్వాత, ఆమె వియన్నాలోని(ఆస్ట్రియా) భారత రాయబార కార్యాలయంలో పనిచేశారు. 1981-83 మధ్యకాలంలో శ్రీలంకలోని భారత హై కమిషన్‌లో మొదటి కార్యదర్శిగా పని చేసిన ఘనత ఆమెదే . విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖలో ఆమె పనిచేసిన తొలినాళ్ళలోనే  చైనాతో భారతదేశానికి ఉన్న సంబంధాల విషయంలో   ఆమె వ్యవహరించిన తీరుకి  ప్రత్యేక గుర్తింపు  పొందారు మరియు ప్రధానమంత్రి డిసెంబర్ 1988లో బీజింగ్‌కు చారిత్రాత్మక పర్యటన చేసినప్పుడు అధికార సభ్యులుగా ఉన్నారు.

విద్య మీద ఉన్న మక్కువ వాళ్ళ ఆమె 1992-93 సంవత్సారాలలో ప్రఖ్యాత  హార్వార్డ్ విశ్వవిద్యాలయంలోని వెదర్‌హెడ్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ అఫైర్స్ లో  విద్యార్థిగా ఆసియా-పసిఫిక్ భద్రత మీద ప్రత్యేక అధ్యయనం చేశారు.
         వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయాలలో మరియు మాస్కోలో మంత్రిగా మరియు డిప్యూటీ ఛీఫ్ ఆఫ్ మిషన్‌గా వరుసగా పనిచేశారు. ఆమె మొదటిసారి రాయబారిగా పెరూకు పంపబడ్డారు మరియు 1995-1998 మధ్యకాలంలో బొలివియా బాధ్యతలను కూడా తీసుకున్నారు. 2001లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ యొక్క మొదటి మహిళా అధికార ప్రతినిధిగా నియమింపబడ్డారు. భారతదేశ హైకమిషనర్‌గా 2004లో ఆమె శ్రీలంకకు పంపబడ్డారు. 2006లో, చైనాకు ఆమె భారతదేశం యొక్క మొదటి మహిళా రాయబారిగా అయ్యారు. ఆగష్టు 1, 2009న శివశంకర్ మీనన్ తరువాత ఆమె భారతదేశం యొక్క విదేశాంగ కార్యదర్శి అయ్యారు.

డిసెంబర్ 21, 2010న, భారత విదేశాంగ కార్యదర్శిగా నిరుపమ రావు పదవీకాలాన్ని  (31 జూలై 2011 వరకూ) పొడిగించటానికి భారత ప్రభుత్వం అంగీకరించింది. 
 ఆంగ్ల సాహిత్యం మీదున్న మక్కువ  వాళ్ళ ఆమె  'రైన్ రైసింగ్ 'అనే కవితల పుస్తకాన్ని ప్రచురించారు. 
   
ఇంత గొప్ప అర్హతలున్న వీరు ఎప్పుడూ నిరాడంబరంగా ఉండడానికి ఇష్టపడతారు.. తన గురించి చెప్పుకోవడం ఆమెకి తెలియనే తెలియదు. నిరుపమ శ్రీ సుధాకర్ రావు (IAS) ను 1975 లో వివాహం చేసుకున్నారు. వీరికి నిఖిలేశ్, కార్తికేయ  అని ఇద్దరు పిల్లలు. 
'తనకప్పగించిన పనిని బాద్యతగా చేయడానికి ప్రయత్నిస్తున్నాను తప్ప ఇందులో నా గొప్పేమీ లేదు 'అంటారామె వినమ్రంగా.  జీవితంలో ప్రతీ రోజూ  ఒక కొత్త విషయం తెలుస్తుంది ,   నేర్చుకుంటే అంటారు అంతేకాదు వచ్చిన ప్రతీ కొత్త పదవీ మరిన్ని కొత్త విషయాలు తెలుసుకోవడానికీ,  ఉద్యోగపరంగా  విషయ పరిహ్నానాన్ని పెంచుకోవడానికీ ఉపయోగ పడుతుంది   అని  చెప్పే నిరుపమా రావు గారి గురించి విన్నా,  చదివినా ఎంతో గొప్పగా అనిపిస్తుంది. మనమూ ఇలా ఉండగలిగితే ?అనిపిస్తుంది. అలాంటి మహిళా మణి దీపానికి హేట్సాఫ్.  
ఆవిడ స్పూర్తితో మరెందరో అమ్మాయిలు ఇలాంటి రంగాలని ఎంచుకుని ముందుకు సాగాలని కోరుకుందాం.


అంకుల్ పాయ్.. అనంత్ పాయ్

 ఈ సారి ఫిబ్రవరి నెలలోని ఆఖరి వారం పుస్తకప్రియులూ, సినిమా ప్రియులు.. ఇలా కళాప్రియులమీద కక్ష తీర్చుకోవడానికే నిశ్చ యించు కుందేమో అనిపిస్తోంది, వరసగా జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే. ముందు శ్రీ మిక్కిలినేని.. ఆ తరవాత శ్రీ ముళ్ళపూడి వెంటనే శ్రీ అనంత్ పాయ్. వీరందరూ  వరస తేదీలలో పరమపదించడం నిజంగా ఆశ్చర్యమే. చూస్తుంటే పైనేదో గూడుపుఠానీ చేసి ఈ మహానుభావులందరినీ మనకు లేకుండా , అక్కడకు పనిమీద పిలిచేసుకున్నట్టుగా అనిపించడం లేదూ.. 
    
దూర దర్శన్ లో ఎప్పుడో 1967 లో జరిగిన ఒక క్విజ్ ప్రోగ్రాం లో అభ్యర్ధులు 'గ్రీక్ పురాణాల గురించి అవలీల గా చెప్పి మన పురాణాలూ, ఇతిహాసాల దగ్గరకు వచ్చేసరికి తడబడడం చూసిన ఒక వ్యక్తి కి వచ్చిన ఆలోచనే.. అజరామరంగా ప్రపంచవ్యాప్తంగా పిల్లలతోనూ, వాళ్ళ తల్లితండ్రులతోనూ ప్రేమగా  పెనవేసుకుపోయిన 'అమర చిత్ర కధలు'. అంటే ఆశ్చర్యమే.  ఇప్పటి వరకూ దాదాపు గా 85 శీర్షికలతో వచ్చిన ఈ పుస్తకాలు దాదాపుగా 440 మిలియన్  కాపీలు అమ్ముడుపోయి చరిత్రని సృష్టించాయి. ఇప్పటికీ ప్రతీ సంవత్సరమూ మూడు మిలియన్లవరకూ అమ్ముడుపోతూనే ఉంటాయి. వీటిలో పురాణాలకీ, ఇతిహాసాలకీ, చరిత్రకీ సంబంధించిన ఎన్నో కధలు పుస్తకాలుగా ప్రచురించ బడ్డాయి. సాధారణంగా ఒక వ్యక్తి గురించి కానీ, ఒక సంఘటన గానీ కేంద్ర బిందువుగా ఈ పుస్తకాలు సాగుతాయి. బీర్బల్, తెనాలి రాముడు లాంటి వారిగురించీ, శివుడు, దుర్గ, విష్ణు పురాణాలూ, జాతక కధలూ, భగవద్ గీతా, మదర్ తెరీసా ఇలా ఒకటనేమిటి ఎన్నో రకాల ఇతివృత్తాలూ, ఆహ్లాదంగా రాసే రాతలూ, ఆకట్టుకునే గీతలూ.. వెరసి మనకి మనసుకి హత్తుకునే కతలూ..అవి చెప్పే ఊసులూ.. అమర్ చిత్రకధలకీ, మిగతా వాటికీ కూడా కదా, కధనం శ్రీ పాయ్ సమకూర్చేవారు. రాం వారీకర్, దిలీప్ కదం. ప్రతాప్  ములిక్ వంటి వారు బొమ్మలని అందించేవారు.

       ఆ తరవాత 1980  లో  స్థాపించబడిన 'టింకిల్" అనే పిల్లల కార్టూన్ పత్రిక ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించిందో చెప్పక్కరలేదు. రామూ, షామూ, తంత్రీ ద మంత్రీ, షికారీ శంబు, ప్యారేలాల్,  సుపండి లాంటి పాత్రలైతే ప్రతీ ఇంట్లోనూ కుటుంబ సభ్యులలాగా కలిసిపోయాయి. సుపండి జోకులైతే ఇన్నీ, అన్నీ కావు, ప్రతీ  టింకిల్ పత్రికలోనూ కనిపిస్తూనే ఉంటాయి, కడుపుబ్బ  నవ్విస్తూనే ఉంటాయి. కేవలం మానవ పాత్రలే కాదు, మరిచిపోలేని జంతువులూ  ఉన్నాయి.. కపీశ్ అనే మర్కట రాజమూ , చమత్కా అనే నక్క, డూబ్ డూబ్ అనే మొసలి, కీచు మీచు అనే కుందేళ్ళూ ఇలా ఎన్నో పాత్రలు, వాటి మధ్యన జరిగే ఆసక్తికరమైన కధనాలూ..అను క్లబ్ అనే పేరిట విజ్ఞాన సంబంధితమైన విశేషాలూ, వింతలూ పంచుతారు. మీ చిన్నప్పుడు ఏమి జరిగింది?  అనో లేక మీరే కధ  రాయండి !అనో పిల్లలని తమతో కలుపుకునే ప్రయత్నాలూ, చిన్న చిన్న పజిల్సూ, ప్రశ్నలూ ఇలా ఎన్నో ఆకర్షణలతో టింకిల్ పత్రిక పిన్నలనూ, పెద్దలనూ ఒకేరీతిన అలరిస్తుంది. వీటన్నింటి వెనకా ఉన్నది పెద్ద సంస్థ ఏమీ కాదు.. కేవలం ఒక వ్యక్తి.. అతనే శ్రీ అనంత్ పాయ్.
              కర్నాటక లో 1929 లో జన్మించిన శ్రీ పాయ్ తన రెండో ఏటనే తల్లితండ్రులని పోగోట్టుకున్నారు. తరవాత స్వ శక్తి తో బొంబాయిలో  ఉన్నత విద్యాభ్యాసం చేసారు. మొదటినించీ కూడా పాయ్ కి పుస్తకాలు చదవడమే కాక, ప్రచురించడం అందునా 'కామిక్స్' ని ప్రచురించడం అంటే చాలా ఇష్టం. పెద్దగా నడవకపోయినా 1954 లో ప్రచురించబడిన "మానవ్' అన్న పత్రిక వీరిదే. వీరు టైమ్స్ ఆఫ్ ఇండియా లో పనిచేస్తున్నప్పుడు వారి 'ఇంద్రజాల్' కామిక్స్ వల్ల చాలా అనుభవం గడించారు. ఆ తర్వాత ఇండియా బుక్ హౌస్ "మీర్చందానీ' గారితో కలిసి అమర్ చిత్ర కదా ప్రారంభించారు..ఇవి అనేక ప్రాంతీయ భాషలలోకూడా లభిస్తాయి. ఇలా శ్రీ పాయ్ ని మా దేశంలోనే  కార్టూన్ యుగానికి 'ఆద్యుడు' గా చెప్పవచ్చు.
     కేవలం పిల్లల పుస్తకాలే కాక 'పర్సనాలిటీ డెవెలప్ మెంట్' మీద వీడియో చిత్రాల్నీ, పుస్తకాలనీ కూడా వెలువరిం చారు. ఆడియో పుస్తకాలకి ప్రయోక్తగానూ పనిచేశారు. పిల్లలకి 'అంకుల్ పాయ్' గా ఎంతో ప్రియమైన మావయ్యగా ఎన్నో కధలూ కబుర్లూ చెప్పే ఈ మావయ్యని ఎన్నో అవార్డులూ, రివార్డ్ లూ వరించాయి. బొంబాయిలోని ప్రభాదేవి లో  శ్రీ పాయ్ తన భార్య శ్రీమతి లలితా పాయ్ తో కలిసి నివసించేవారు.
వారి ఆత్మకు ఆ భగవంతుడు శాంతి ప్రసాదించాలని కోరుకుంటూ..
      

నగుమోము గనలేని నాజాలి తెలిసి నన్ను బ్రోవగ రాదా శ్రీరఘువర నీ...