Thursday, March 3, 2011

మహిళలు- మణిదీపాలు (3 )

ఇరోం చానూ షర్మిల: 'ఐరన్ లేడీ అఫ్ మణిపూర్ ' గా ప్రసిద్ది చెందిన షర్మిల గత పది సంవత్సరాలుగా ప్రపంచంలోనే అత్యంత దీర్ఘమైన నిరాహాహారదీక్ష జరుపుతున్నారు. ఇది తనకోసమో, తనవారికోసమో కాదు, కేవలం తను నమ్మిన మానవ హక్కుల కోసం.
       మణిపూర్ కి చెందిన 38 సంవత్సరాల  షర్మిల, ఒక  జర్నలిస్ట్,కవయిత్రి ,  మానవ హక్కుల పరిరక్షణ   కోసం పోరాడే వ్యక్తి. మాలూం అనే ఊర్లో నవంబర్ 1 , 2000 వ తేదీన అస్సాం రైఫిల్స్ జరిపిన కాల్పులలో బస్ కోసం ఎదురుచూస్తున్న పది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. కొందరు పార్లమెంట్ మీద దాడి జరుపబోతుంటే ఆపడానికి జరిపిన కాల్పులలో ఈ ప్రయాణీకులు చనిపోయారు తప్ప వారిని అటాక్ చేసే ప్రయత్నం కాదని 'అస్సాం రైఫిల్స్' చెప్పారు. చనిపోయిన వారిలో పెద్దవారూ, సాహస బాల పురస్కారం పొందిన పదేనిమిదేళ్ళ అమ్మాయి ఉండడమూ, ప్రభుత్వం నించీ ఈ సంఘటన గురించి సరి ఐన వివరణ రాకపోవడం వల్ల కలత చెందిన  షర్మిల తన తల్లి ఆశీర్వాదంతో నవంబర్ నాలుగో తేదీనించి నిరవరధిక నిరాహారదీక్ష ప్రారంభించింది.ఆమె కోరిక ఒక్కటే  'ఆర్మేడ్ ఫోర్సెస్ స్పెషల్ పోవేర్స్ ఆక్ట్ (AFSPA) 1958 ని మణిపూర్ నించీ,  మిగతా సమీప ప్రాంతాలనించీ  వెనక్కి తీసుకోమనే.
        ఆమె నిరాహార దీక్ష ప్రారంభిన మూడు రోజులకే పోలీసులు 'ఆత్మహత్యా ప్రయత్నం" క్రింద  ఆమెని అరెస్టు  చేసారు. ఆమె తనంత తానుగా ఆహరం కానీ, నీరు కానీ తీసుకోవడానికి నిరాకరించడం వల్ల బలవంతంగా ఆమెకి ముక్కుద్వారా ద్రవపదార్ధాలు అందిస్తారు. ఇది అత్యంత బాధాకరమైన ప్రక్రియ. దీనిని అనుభవించిన వారికి కానీ అర్ధం కాదని వైద్యులే అంటారు. ఇలాంటి  ఆమె దీక్ష గత పదేళ్లుగా సాగుతూనే ఉంది. ఆమెకి సాయంగా ప్రజలు కూడా అనేక రకాలుగా ప్రభుత్వాలకీ సంగతి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జస్టిస్ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలోAFSPA చట్టం గురించీ  తద్వారా అస్సాం రైఫిల్స్ కి ఉండవలసిన అధికారాలూ, హక్కుల గురించి అధ్యయనం చెయ్యమని ఆదేశించింది. వారు కూడా AFSPA ని వెనక్కు తీసుకోవడమే మంచిదని అభిప్రాయపడినా కూడా అప్పుటి హోం శాఖామాత్యులు ఒప్పుకోలేదు. గత పదేళ్లుగా షర్మిలని అత్యంత కట్టుదిట్టాలమధ్య ఇంఫాల్ లోని జవహర్ లాల్ హాస్పటల్ లో బందీగా ఉంచారు. ఆమెని ప్రతీ ఏడాది విడుదల చెయ్యడమూ, మళ్ళీ ఖైదు చెయ్యడమూ అలవాటుగా జరుగుతోంది.
          మహాత్మాగాంధీ లాగే షర్మిల కూడా సత్యాగ్రహాన్ని సాధనం గా ఎంచుకుంది, అంతమాత్రాన ఆమెని క్రిమినల్ గా పరిగణించడం చాలా  మానవ హక్కుల సంఘ అధ్యక్షుడు అభిప్రాయపడ్డారు. ఆయనే కాదు, చాలా మంది ప్రముఖ మానవ హక్కుల పరిరక్షణా నేతలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. ఒక మహిలని , అదీ ఎంతో శాంతియుతంగా తన నిరసన ని తెలియచేస్తున్నా ఆమెని ఇలా బంధించడం తప్పని చెప్పారు.
       'ఎంతో మానసిక స్థైర్యం ఉంటేనే కానీ ఇలాంటి సాహసం చేయ్యలేరనీ, ఆమె కధ  ఆధారంగా సినిమా తియ్యాలని ఉన్నా ఆమె నిజ జీవితాన్ని, ధైర్యాన్నీ  సరిగ్గా చిత్రీకరించాలేనేమో అని అనిపించడమే కారణమని' ప్రసిద్ద దర్శకుడు అరిబం శ్యాం శాస్త్రి అన్నారు.వీరే కాదు, మరెందరో ప్రముఖులు ఆమెకితమ సహకారాన్ని, సహాయాన్ని ప్రకటించారు. వీరిలో అరుంధతీ రాయ్, మహాశ్వేతా దేవి, నోబుల్ బహుమతి గ్రహీత 'శిరీన్ ఎబాడి 'వంటి ప్రముఖులెందరో ఉన్నారు. ఆమె జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఎన్నో పుస్తకాలు కూడా పలువు రచించారు.   
    షర్మిల పేరును నోబుల్ శాంతి బహుమతికై 2005 లో ప్రతిపాదించారు. ఐ.ఐ.పీ .ఎం వారు  ఈ మధ్యనే షర్మిల కి టాగూరు శాంతి బహుమతి ( 51 లక్షల నగదు)  నిచ్చి సత్కరించారు. మరెన్నో బహుమతులూ,సత్కారాలు ఆమకు లభించాయి.
 పదేళ్లుగా ఒక్క ముద్ద అన్నం తినకుండా గడపడం అనేది నాలాంటి మామూలు మనుషుల ఊహకి కూడా అందని విషయం. తను నమ్మిన సిద్దాంతానికి కట్టుబడి,  అత్యంత    శాంతియుతంగా ఏమాత్రం ఆవేశ కావేశాలకి  లోను కాకుండా షర్మిల చేస్తున్న పోరాటాన్ని ఏ  పేరుతొ పిలవాలో? ఎంత గొప్పగా అభివర్ణించాలో  కూడా   తెలియడంలేదు. అయితే ఆమె మాత్రం 'మనం ఈ లోకంలోకి ఎందుకు వచ్చామో విధిగా తెలుసుకోవాలి ఎందుకంటే ఎప్పుడు వెళ్లి పోతామో  మనకే తెలియదు కనక..' అంటారు.
ఈ మహిళా దినోత్సవ సంధర్ధంలో ఈ ఉక్కుమహిళకి జోహార్లు. ఆమె ప్రయత్నం సఫలం కావాలని మనస్పూర్తిగా  కోరుకుందాం.

Wednesday, March 2, 2011

మహిళలూ-మణిదీపాలు (2 )

డా. శోభా నాయుడు: ఇష్టపడి ఎంచుకున్న ఏ రంగంలోనైనా అలుపెరుగని  దీక్షా, సాధనా, అంకిత భావాలతో కృషి చేస్తే చేరుకోలేని ఉన్నత శిఖరాలు ఉండవని నిరూపించిన నృత్య చూడామణి పద్మశ్రీ .  డా. శోభా నాయుడు. సుప్రసిద్ధ కూచిపూడి నృత్య విద్వాంసులు శ్రీ వెంపటి చినసత్యం గారి శిష్యులలో పేరెన్నిక గన్న వీరు విశాఖ జిల్లా అనకాపల్లి లో 1956 లో జన్మించారు. చాలా చిన్ననాటి నించీ ఆమె వివిధ సంగీత నృత్య రూపకాలలో నాయికా వేషాలు వేస్తూ కూచిపూడి నాట్యం మీద ఎంతో పట్టు సాధించారు. తన గురువుగారితో కలిసి మన దేశంలోనూ, విదేశాలలోనూ పలు చోట్ల ప్రదర్శనలు ఇచ్చారు. అనేక రకాలైన పాత్రలలో తన ప్రతిభా పాటవాలు ప్రదర్శిస్తూ ప్రత్యేకంగా సత్యభామ, పద్మావతి పాత్రలకి మారుపేరుగా నిలిచారు. 

తనకున్న అసమాన ప్రతిభా పాటవాలూ, కళా దృష్టి తోనూ వివిధ రకాలలిన  కదా అంశాలతో ఆమె రూపొందించిన నృత్యరూపకాలు ప్రపంచమంతా ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయి. పురాణాలకి, ఇతిహాసాలకి సంబంధించినవైనా, ఆధునిక సాంఘిక ఇతి వృత్తాలైనా ఎంతో కమనీయంగా, సాంప్రదాయ నృత్య రీతి బద్దంగా రూపొందించడం ఆమె ప్రత్యేకత.
విప్రనారాయణ, శ్రీ కృష్ణ శరణం మమ, కళ్యాణ శ్రీనివాసం,  విజయోస్తుతే నారీ, క్షీర సాగర మధనం, సర్వం సాయి మయం, జగదానంద కారకా, గిరిజా కల్యాణం, స్వామీ వివేకానంద మరియు నవరస నటభామిని లాంటి సంగీత నృత్య రూపకాలను రూపొందించి, దర్సకత్వం వహించడమే కాక వాటిలో పద్మావతి, చండాలిక, సాయి బాబా, జగన్మాత పార్వతీ, మోహినీ వంటి పాత్రలను ఎంతో అద్భుతంగా, అనితరసాధ్యంగా పోషించి ప్రపంచమంతా నృత్య ప్రేమికుల ప్రసంసలు అందుకున్నారు. కళ్యాణ శ్రీనివాసం వంటి కార్యక్రమాలను చూసి తిరుమల తిరుపతి దేవస్థానం వారు వాటిని దేశమంతా  ప్రదర్శింప చేసి  బహుళ ప్రాచుర్యాన్ని కల్పించారు.

 కూచిపూడి నృత్య అకాడమీ కి ప్రిన్సిపాల్ గా 1980 నించీ తన సేవలు అందిస్తున్నారు. అంతేకాక శ్రీ వెంకటేశ్వర  భక్తి చానల్ లో 'సాధన' అన్న కార్యక్రమంలో శాస్త్రీయ నృత్యం లో శిక్షణ ఇస్తున్నారు. అలాగే సంస్కృతీ చానల్ లో 'సిరి సిరి మువ్వ ' కార్యక్రమమాన్ని నిర్వహిస్తూ ప్రతిభను ప్రోత్సహిస్తున్నారు. గురువుగా ఇప్పటివరకూ దాదాపు 2000 మంది గొప్ప శిష్యుల్ని ఎంతో ప్రతిభావంతులుగా తీర్చి దిద్దారు. వీరంతా ప్రపంచలో నలుమూలలా స్థిరపడి తమ వంతు కళాపోషణ చేస్తున్నారు. రష్యాలో వీరి ప్రదర్సనలని చూసి కొంతమంది ఔత్సాహికులు రష్యానించి వచ్చి మరీ ఆమె దగ్గర నృత్యం నేర్చుకుంటున్నారు. 

మద్రాస్ లోని కృష్ణ గాన సభ వారు శోభానాయుడుగారికి 'నృత్య చూడామణి'  ,  కేంద్ర సంగీత నృత్య అకాడెమీ వారి పురస్కారమూ, నుంగంబాక్కం వారిచే నృత్య కళా శిరోమణి లాంటి బిరుదులెన్నో ఆవిడ సొంతమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం వారిచే పద్మశ్రీ అవార్డ్ కూడా ఆమెని వరించింది. 

అనుపమానమైన అందం, అనితరసాధ్యమైన అభినయం, అకున్థత దీక్షా, ఎటువంటి భావాన్నైనా అవలీలగా పలికించే విశాల నేత్రాలూ,  హావభావాలు కలిసి ఆమెనొక విలక్షణమైన నర్తకిగా నిలబెడితే, తనకెంతో ప్రియమైన కళని పెంచి పోషించి, తరగని ఆ సంపదని భావి తరాలకి పదిలంగా అందించాలని నిరంతరంగా కృషి సలుపుతున్న మహా నర్తకి శ్రీమతి. శోభా నాయుడు. కళని ప్రేమించాలి, ఆరాధించాలి అని కేవలం చెప్పడం కాకుండా అనుక్షణమూ ఆచరించి చూపుతున్న అభినవ నాట్య సరస్వతి.. 
మృదు భాషణ  కీ, నిగర్వానికీ, నిరాడంబరతకీ మారుపేరుగా నిలిచిన ఈ నృత్య చూడామణి మార్గం ఎందరికో మార్గ దర్శకం.



Tuesday, March 1, 2011

మహిళలూ- మణిదీపాలు (1 )

    మార్చి ఎనిమిదో తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రతీ సంవత్సరమూ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలలో మహిళలపై తమకున్న గౌరవాన్నీ, ప్రేమనూ వారు సాధించిన అభ్యున్నతినీ కీర్తిస్తూ, వాళ్ళ కీర్తి కిరీటాలలో మరెన్నో కలికి తురాయిలు చేరాలని ఆశించే రోజుగా జరపబడుతుంది. మొట్టమొదటగా ఈ పండగని జర్మనీలో 1911 వ సంవత్సరంలో మార్చి 19   వ  తారీకున జరిపారుట. ఈ ఒక్క రోజే మనదా? మిగతావన్నీ కాదా  ? అన్న ప్రశ్న పక్కన పెట్టి మనకంటూ కేటాయించుకున్న ఈ రోజుని చక్కగా ఆనందంగా గడిపేస్తే సరిపోతుంది కదా.. మహిళల దినోత్సవం అనగానే జీవితంలో ఎంతో సాధించి, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న మహిళలని గుర్తు తెచ్చుకోవడం సహజం.. నా మటుక్కు నాకు ఇలాంటి వారెంతో స్ఫూర్తి ప్రదాతలుగా కనిపిస్తారు, అందుకే అలాంటి కొందరిని గుర్తు చేసుకునే ఈ ప్రయత్నం..
1 . నిరుపమా మీనన్  రావు:  ప్రస్తుతం కేంద్ర  విదేశాంగ  శాఖలో (Ministry of External Affairs)కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ కార్యదర్శి   గా (Foreign Secretary) గా కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీమతి నిరుపమా రావు IFS ఆఫీసర్. విదేశాంగ కార్యదర్శిగా ఎంపిక అయిన రెండో మహిళ (మొదటి వారు చోకిలా ఐయ్యర్). 
       కేరళ లోని మలప్పురం లో జన్మించిన అరవై సంవత్స రాల  నిరుపమ,  తండ్రి ఆర్మీ ఉద్యోగ కారణంగా పలుచోట్ల చదువుకున్నారు. బెంగళూరు లోని మౌంట్ కార్మెల్ కాలీజీలో బి.ఎ లిటరేచర్, మరాఠ్వాడ విశ్వవిద్యాలయంలో ఎం.ఎ పట్టాని పుచ్చుకున్నారు. 
      సివిల్ సర్వీసెస్ పరీక్ష లో, సర్వప్రధమురాలిగా 1973 లో ఎంపిక అయ్యి IFS లో చేరారు. అప్పటినించీ     ఈ నాటివరకూ ఆమె వృత్తి జీవితంలో అనేక పదవులను చేపట్టారు, అందులో వాషింగ్టన్‌లో పత్రికా వ్యవహారాల మంత్రిగా, మాస్కోలో డిప్యూటీ ఛీఫ్ ఆఫ్ మిషన్‌గా, విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖలో సంయుక్త కార్యదర్శిగా (తూర్పు ఆసియా), (విదేశీ ప్రచారం) విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖలో మొదటి మహిళా అధికార ప్రతినిధిగా, సిబ్బంది ముఖ్యాధికారిగా, పెరూ మరియు చైనాకు రాయబారిగా మరియు శ్రీలంక హై కమిషనర్‌గా ఎన్నో కీలకమైన పదవులలో బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించారు. 
    IFS శిక్షణ ముగిసిన తర్వాత, ఆమె వియన్నాలోని(ఆస్ట్రియా) భారత రాయబార కార్యాలయంలో పనిచేశారు. 1981-83 మధ్యకాలంలో శ్రీలంకలోని భారత హై కమిషన్‌లో మొదటి కార్యదర్శిగా పని చేసిన ఘనత ఆమెదే . విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖలో ఆమె పనిచేసిన తొలినాళ్ళలోనే  చైనాతో భారతదేశానికి ఉన్న సంబంధాల విషయంలో   ఆమె వ్యవహరించిన తీరుకి  ప్రత్యేక గుర్తింపు  పొందారు మరియు ప్రధానమంత్రి డిసెంబర్ 1988లో బీజింగ్‌కు చారిత్రాత్మక పర్యటన చేసినప్పుడు అధికార సభ్యులుగా ఉన్నారు.

విద్య మీద ఉన్న మక్కువ వాళ్ళ ఆమె 1992-93 సంవత్సారాలలో ప్రఖ్యాత  హార్వార్డ్ విశ్వవిద్యాలయంలోని వెదర్‌హెడ్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ అఫైర్స్ లో  విద్యార్థిగా ఆసియా-పసిఫిక్ భద్రత మీద ప్రత్యేక అధ్యయనం చేశారు.
         వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయాలలో మరియు మాస్కోలో మంత్రిగా మరియు డిప్యూటీ ఛీఫ్ ఆఫ్ మిషన్‌గా వరుసగా పనిచేశారు. ఆమె మొదటిసారి రాయబారిగా పెరూకు పంపబడ్డారు మరియు 1995-1998 మధ్యకాలంలో బొలివియా బాధ్యతలను కూడా తీసుకున్నారు. 2001లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ యొక్క మొదటి మహిళా అధికార ప్రతినిధిగా నియమింపబడ్డారు. భారతదేశ హైకమిషనర్‌గా 2004లో ఆమె శ్రీలంకకు పంపబడ్డారు. 2006లో, చైనాకు ఆమె భారతదేశం యొక్క మొదటి మహిళా రాయబారిగా అయ్యారు. ఆగష్టు 1, 2009న శివశంకర్ మీనన్ తరువాత ఆమె భారతదేశం యొక్క విదేశాంగ కార్యదర్శి అయ్యారు.

డిసెంబర్ 21, 2010న, భారత విదేశాంగ కార్యదర్శిగా నిరుపమ రావు పదవీకాలాన్ని  (31 జూలై 2011 వరకూ) పొడిగించటానికి భారత ప్రభుత్వం అంగీకరించింది. 
 ఆంగ్ల సాహిత్యం మీదున్న మక్కువ  వాళ్ళ ఆమె  'రైన్ రైసింగ్ 'అనే కవితల పుస్తకాన్ని ప్రచురించారు. 
   
ఇంత గొప్ప అర్హతలున్న వీరు ఎప్పుడూ నిరాడంబరంగా ఉండడానికి ఇష్టపడతారు.. తన గురించి చెప్పుకోవడం ఆమెకి తెలియనే తెలియదు. నిరుపమ శ్రీ సుధాకర్ రావు (IAS) ను 1975 లో వివాహం చేసుకున్నారు. వీరికి నిఖిలేశ్, కార్తికేయ  అని ఇద్దరు పిల్లలు. 
'తనకప్పగించిన పనిని బాద్యతగా చేయడానికి ప్రయత్నిస్తున్నాను తప్ప ఇందులో నా గొప్పేమీ లేదు 'అంటారామె వినమ్రంగా.  జీవితంలో ప్రతీ రోజూ  ఒక కొత్త విషయం తెలుస్తుంది ,   నేర్చుకుంటే అంటారు అంతేకాదు వచ్చిన ప్రతీ కొత్త పదవీ మరిన్ని కొత్త విషయాలు తెలుసుకోవడానికీ,  ఉద్యోగపరంగా  విషయ పరిహ్నానాన్ని పెంచుకోవడానికీ ఉపయోగ పడుతుంది   అని  చెప్పే నిరుపమా రావు గారి గురించి విన్నా,  చదివినా ఎంతో గొప్పగా అనిపిస్తుంది. మనమూ ఇలా ఉండగలిగితే ?అనిపిస్తుంది. అలాంటి మహిళా మణి దీపానికి హేట్సాఫ్.  
ఆవిడ స్పూర్తితో మరెందరో అమ్మాయిలు ఇలాంటి రంగాలని ఎంచుకుని ముందుకు సాగాలని కోరుకుందాం.


అంకుల్ పాయ్.. అనంత్ పాయ్

 ఈ సారి ఫిబ్రవరి నెలలోని ఆఖరి వారం పుస్తకప్రియులూ, సినిమా ప్రియులు.. ఇలా కళాప్రియులమీద కక్ష తీర్చుకోవడానికే నిశ్చ యించు కుందేమో అనిపిస్తోంది, వరసగా జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే. ముందు శ్రీ మిక్కిలినేని.. ఆ తరవాత శ్రీ ముళ్ళపూడి వెంటనే శ్రీ అనంత్ పాయ్. వీరందరూ  వరస తేదీలలో పరమపదించడం నిజంగా ఆశ్చర్యమే. చూస్తుంటే పైనేదో గూడుపుఠానీ చేసి ఈ మహానుభావులందరినీ మనకు లేకుండా , అక్కడకు పనిమీద పిలిచేసుకున్నట్టుగా అనిపించడం లేదూ.. 
    
దూర దర్శన్ లో ఎప్పుడో 1967 లో జరిగిన ఒక క్విజ్ ప్రోగ్రాం లో అభ్యర్ధులు 'గ్రీక్ పురాణాల గురించి అవలీల గా చెప్పి మన పురాణాలూ, ఇతిహాసాల దగ్గరకు వచ్చేసరికి తడబడడం చూసిన ఒక వ్యక్తి కి వచ్చిన ఆలోచనే.. అజరామరంగా ప్రపంచవ్యాప్తంగా పిల్లలతోనూ, వాళ్ళ తల్లితండ్రులతోనూ ప్రేమగా  పెనవేసుకుపోయిన 'అమర చిత్ర కధలు'. అంటే ఆశ్చర్యమే.  ఇప్పటి వరకూ దాదాపు గా 85 శీర్షికలతో వచ్చిన ఈ పుస్తకాలు దాదాపుగా 440 మిలియన్  కాపీలు అమ్ముడుపోయి చరిత్రని సృష్టించాయి. ఇప్పటికీ ప్రతీ సంవత్సరమూ మూడు మిలియన్లవరకూ అమ్ముడుపోతూనే ఉంటాయి. వీటిలో పురాణాలకీ, ఇతిహాసాలకీ, చరిత్రకీ సంబంధించిన ఎన్నో కధలు పుస్తకాలుగా ప్రచురించ బడ్డాయి. సాధారణంగా ఒక వ్యక్తి గురించి కానీ, ఒక సంఘటన గానీ కేంద్ర బిందువుగా ఈ పుస్తకాలు సాగుతాయి. బీర్బల్, తెనాలి రాముడు లాంటి వారిగురించీ, శివుడు, దుర్గ, విష్ణు పురాణాలూ, జాతక కధలూ, భగవద్ గీతా, మదర్ తెరీసా ఇలా ఒకటనేమిటి ఎన్నో రకాల ఇతివృత్తాలూ, ఆహ్లాదంగా రాసే రాతలూ, ఆకట్టుకునే గీతలూ.. వెరసి మనకి మనసుకి హత్తుకునే కతలూ..అవి చెప్పే ఊసులూ.. అమర్ చిత్రకధలకీ, మిగతా వాటికీ కూడా కదా, కధనం శ్రీ పాయ్ సమకూర్చేవారు. రాం వారీకర్, దిలీప్ కదం. ప్రతాప్  ములిక్ వంటి వారు బొమ్మలని అందించేవారు.

       ఆ తరవాత 1980  లో  స్థాపించబడిన 'టింకిల్" అనే పిల్లల కార్టూన్ పత్రిక ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించిందో చెప్పక్కరలేదు. రామూ, షామూ, తంత్రీ ద మంత్రీ, షికారీ శంబు, ప్యారేలాల్,  సుపండి లాంటి పాత్రలైతే ప్రతీ ఇంట్లోనూ కుటుంబ సభ్యులలాగా కలిసిపోయాయి. సుపండి జోకులైతే ఇన్నీ, అన్నీ కావు, ప్రతీ  టింకిల్ పత్రికలోనూ కనిపిస్తూనే ఉంటాయి, కడుపుబ్బ  నవ్విస్తూనే ఉంటాయి. కేవలం మానవ పాత్రలే కాదు, మరిచిపోలేని జంతువులూ  ఉన్నాయి.. కపీశ్ అనే మర్కట రాజమూ , చమత్కా అనే నక్క, డూబ్ డూబ్ అనే మొసలి, కీచు మీచు అనే కుందేళ్ళూ ఇలా ఎన్నో పాత్రలు, వాటి మధ్యన జరిగే ఆసక్తికరమైన కధనాలూ..అను క్లబ్ అనే పేరిట విజ్ఞాన సంబంధితమైన విశేషాలూ, వింతలూ పంచుతారు. మీ చిన్నప్పుడు ఏమి జరిగింది?  అనో లేక మీరే కధ  రాయండి !అనో పిల్లలని తమతో కలుపుకునే ప్రయత్నాలూ, చిన్న చిన్న పజిల్సూ, ప్రశ్నలూ ఇలా ఎన్నో ఆకర్షణలతో టింకిల్ పత్రిక పిన్నలనూ, పెద్దలనూ ఒకేరీతిన అలరిస్తుంది. వీటన్నింటి వెనకా ఉన్నది పెద్ద సంస్థ ఏమీ కాదు.. కేవలం ఒక వ్యక్తి.. అతనే శ్రీ అనంత్ పాయ్.
              కర్నాటక లో 1929 లో జన్మించిన శ్రీ పాయ్ తన రెండో ఏటనే తల్లితండ్రులని పోగోట్టుకున్నారు. తరవాత స్వ శక్తి తో బొంబాయిలో  ఉన్నత విద్యాభ్యాసం చేసారు. మొదటినించీ కూడా పాయ్ కి పుస్తకాలు చదవడమే కాక, ప్రచురించడం అందునా 'కామిక్స్' ని ప్రచురించడం అంటే చాలా ఇష్టం. పెద్దగా నడవకపోయినా 1954 లో ప్రచురించబడిన "మానవ్' అన్న పత్రిక వీరిదే. వీరు టైమ్స్ ఆఫ్ ఇండియా లో పనిచేస్తున్నప్పుడు వారి 'ఇంద్రజాల్' కామిక్స్ వల్ల చాలా అనుభవం గడించారు. ఆ తర్వాత ఇండియా బుక్ హౌస్ "మీర్చందానీ' గారితో కలిసి అమర్ చిత్ర కదా ప్రారంభించారు..ఇవి అనేక ప్రాంతీయ భాషలలోకూడా లభిస్తాయి. ఇలా శ్రీ పాయ్ ని మా దేశంలోనే  కార్టూన్ యుగానికి 'ఆద్యుడు' గా చెప్పవచ్చు.
     కేవలం పిల్లల పుస్తకాలే కాక 'పర్సనాలిటీ డెవెలప్ మెంట్' మీద వీడియో చిత్రాల్నీ, పుస్తకాలనీ కూడా వెలువరిం చారు. ఆడియో పుస్తకాలకి ప్రయోక్తగానూ పనిచేశారు. పిల్లలకి 'అంకుల్ పాయ్' గా ఎంతో ప్రియమైన మావయ్యగా ఎన్నో కధలూ కబుర్లూ చెప్పే ఈ మావయ్యని ఎన్నో అవార్డులూ, రివార్డ్ లూ వరించాయి. బొంబాయిలోని ప్రభాదేవి లో  శ్రీ పాయ్ తన భార్య శ్రీమతి లలితా పాయ్ తో కలిసి నివసించేవారు.
వారి ఆత్మకు ఆ భగవంతుడు శాంతి ప్రసాదించాలని కోరుకుంటూ..
      

నగుమోము గనలేని నాజాలి తెలిసి నన్ను బ్రోవగ రాదా శ్రీరఘువర నీ...